హిడింబి ప్రేమ కథ - హేమావతి బొబ్బు

Hidimbi premakatha

చాలా ఏళ్ల తర్వాత, కురుక్షేత్ర యుద్ధం ముగిశాక, భీముడు తన కొడుకు త్యాగాన్ని తలచుకుంటూ, హిడింబిని చూడటానికి అడవికి తిరిగి వచ్చాడు. రాజ్య గర్వం, యుద్ధపు అలసట అతని కళ్లలో కనిపిస్తున్నాయి. ఎదురుగా హిడింబి. మునుపటి కంటే ఇంకా గంభీరంగా, ప్రశాంతంగా ఉంది. ​

భీముడు తడబడుతూ...."హిడింబీ... నేను రావడం నీకు ఇష్టం లేదేమో అనిపించింది. కానీ ఘటోత్కచుడు లేకుండా హస్తినలో ఉండలేకపోయాను. వాడు నా ప్రాణాలు కాపాడాడు, కానీ నేను వాడిని కాపాడుకోలేకపోయాను" అన్నాడు. వెదురు చాప మీద ఫలహారాలు అన్నీ సిద్ధం చేసి భీముని వైపు చిరునవ్వుతో చూస్తూ "వృక్షం నీడను ఇస్తుంది భీమసేనా, కానీ తన నీడలో పెరిగే మొక్కలను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకోదు. నా కొడుకు నీ కోసం మరణించలేదు, తన ధర్మం కోసం మరణించాడు. దాని గురించి విచారించకండి" అన్నది.

"నన్ను క్షమించు. నిన్ను, వాడిని అడవిలో ఒంటరిగా వదిలేశాను. నువ్వు నాతో రాజప్రసాదానికి వచ్చి ఉంటే, వాడు యువరాజుగా పెరిగేవాడు. ఈ అడవిలో ఎన్నో కష్టాలు పడి ఉంటావు కదా?" అన్నాడు భీమసేన. ​హిడింబి ప్రశాంతంగా అతని కళ్లలోకి చూస్తూ.... ​"రాజభవనంలో ఉంటే వాడు ఒకరి కింద సేవకుడిగానో, లేదా సింహాసనం కోసం పాకులాడే వ్యక్తిగానో ఉండేవాడు. కానీ ఇక్కడ, ఈ అడవిలో వాడు 'రాజు'గా పెరిగాడు. నేను పడింది కష్టం కాదు భీమసేనా.. అది నా బాధ్యత. ఒకరి సహాయం కోరని జీవితం ఎంత గొప్పదో నాకు ఈ అడవి నేర్పింది." ఆమెకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి.

భీముడు వెళ్ళిపోయిన తర్వాత హిడింబి కన్నీరు కార్చలేదు. ఆమెకు తెలుసు, ధర్మం పేరుతో సాగే ఆ రాజ్యాధికార పోరాటాల్లో తన లాంటి ‘వనవాసి’కి చోటు లేదని. హస్తినాపురపు మేడల కంటే, తన అడవిలో స్వేచ్ఛగా బతకడమే గొప్పని ఆమె నిర్ణయించుకుంది. ​ ​హిడింబి తన కొడుకు ఘటోత్కచుడిని కేవలం ఒక వీరుడిగా మాత్రమే కాదు, అత్యున్నత సంస్కారం కలిగిన వ్యక్తిగా పెంచింది. తండ్రి లేని లోటు తెలియకుండా.... "నీ తండ్రి ఒక గొప్ప యోధుడు, కానీ నీ జీవితం నీది" అని చెబుతూ అతన్ని పెంచింది. ​ మాయలు, తంత్రాల కంటే ప్రకృతిని ప్రేమించడం, బలహీనులను రక్షించడం నేర్పింది. కురువంశపు వారసత్వ గొడవలు తన కొడుకును తాకకూడదని ఆమె కోరుకుంది. ​భీముడు తనను వదిలి వెళ్ళాడని ఆమె ఎప్పుడూ కుంగిపోలేదు. "అతను తన ధర్మం కోసం వెళ్ళాడు, నేను నా మాతృధర్మం కోసం ఇక్కడే ఉంటాను" అనుకుంది. ​

ఆమె భీముడిని ప్రేమించింది, కానీ అతని నీడలో బతకడానికి ఇష్టపడలేదు. పాండవుల నుంచి ఎటువంటి సహాయం కోరలేదు. అడవిలో లభించే వనమూలికలు, వేట ద్వారా తన రాజ్యాన్ని తానే ఏలుతూ ఒక 'సింగిల్ మదర్' గా గర్వంగా జీవించింది. ​కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు, హిడింబికి తెలుసు ఇది తన కొడుకు ప్రాణాల మీదకు వస్తుందని. కానీ, ఆమె అతన్ని ఆపలేదు. కానీ తల్లిగా అతడిని హెచ్చరించింది.... "నాయనా, ఆ రాజ్యాలు, సింహాసనాలు మనవి కావు. కానీ నీ తండ్రికి అవసరం వచ్చినప్పుడు వెళ్లడం నీ బాధ్యత" అని పంపించింది. ​కొడుకు మరణ వార్త విన్నప్పుడు కూడా ఆమె గుండె నిబ్బరంతో ఉంది. తన కొడుకు ఒకరి స్వార్థం కోసం కాకుండా, తండ్రిపై ఉన్న ప్రేమతో ప్రాణ త్యాగం చేశాడని గర్వపడింది. కానీ ఇన్నిరోజుల తరువాత తిరిగి వచ్చిన భీముడు ​అసహనం తో ఆమె వైపు చూస్తూ " నా అవసరం ఎప్పుడూ కలగలేదా? ఒక్కసారి కూడా నన్ను పిలవాలనిపించలేదా?" అన్నాడు. ​

"ప్రేమ వేరు, అవసరం వేరు. నా ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంది, కానీ నా అవసరాలను నా ఆత్మగౌరవం తీర్చింది. నువ్వు లేని లోటును నేను నా ఎదుగుదలతో నింపుకున్నాను. రాజ్యాలు గెలవడం కంటే, తనని తాను గెలవడం గొప్పని నా కొడుకుకి నేర్పించాను. అందుకే వాడు కృష్ణ పరమాత్మకే ఆశ్చర్యం కలిగించేలా పోరాడాడు" అంటూ అతనికి నమస్కరించింది. ​భీముడు వంగి ఆమె చేతులు పట్టుకుని.... "నువ్వు కేవలం నా భార్యవు మాత్రమే కాదు, నువ్వు నాకంటే గొప్ప వీరవనితవు. ఈ ప్రపంచం పాండవుల విజయాన్ని గుర్తుంచుకుంటుందేమో కానీ, ఆ విజయానికి పునాది వేసిన నీ త్యాగాన్ని, నీ ఒంటరి పోరాటాన్ని గుర్తుంచుకోదు." ​హిడింబి అతని వైపు చూస్తూ "లోకం ఏం గుర్తుంచుకుంటుందనేది నాకు అనవసరం. నా కొడుకు నా చేతుల్లో ఒక వీరుడిగా పెరిగాడు, నీ కీర్తి కోసం ప్రాణాలు ఇచ్చాడు. అది చాలు" అన్నది. ​హిడింబి ఒక బాధితురాలిలా జీవించకుండా, తన జీవితాన్ని తానే మలుచుకున్న ఒక విజేత. భర్త దూరమైనా కుంగిపోకుండా, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్న ఆధునిక భావాల ప్రతిరూపం ఆమె.

మరిన్ని కథలు

Surigaadu
సూరిగాడు
- Anisa tabassum sk ( అనిసా తబస్సుమ్ sk )
Chintoo lo bhayam poyindi
చింటూలో భయం పోయింది
- నారంశెట్టి ఉమామాహేశ్వరరావు
Subhashini-Charavaani
సుభాషిణి - చరవాణి
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Maa manchi donga
మా మంచి దొంగ
- అనిసా తబస్సుమ్
Mali vayasu chivari majili
మలి వయసు చివరి మజిలీ..
- వరలక్ష్మి నున్న
Premanubandham
ప్రేమానుబంధం
- Kameswara Rao Rapaka
Vyavasayam
వ్యవసాయం
- డా:సి.హెచ్.ప్రతాప్