ప్రధమ శ్రేణి నటుడు - బళ్ళారి రాఘవ - ambadipudi syamasundar rao

ప్రధమ శ్రేణి నటుడు - బళ్ళారి రాఘవ

ఆకర్షణీయమైన రూపము, శాస్త్రజ్ఞానము లోకజ్ఞానం, గీత,నృత్య వాద్యాల పరిచయము, మొదలైన లక్షణాలు అన్ని ఒకే  నటునిలో ఉండటం చాలా అరుదైన విషయము కానీ ఈ లక్షణాలు అన్నింటిని కుప్పగా పోసుకొని పుట్టిన మహానటుడు బళ్లారి రాఘవ.ఆయన రూపమే నటరాజ స్వామికి ప్రతిబింబము.  బళ్లారి రాఘవ నటనలో మెళకువలు నేర్చుకోవటానికి లండన్ వెళ్ళినప్పుడు, నాటక కర్త, కళావిమర్శకుడు జార్జి బెర్నార్డ్ షా బళ్ళారి రాఘవ గురించి మాట్లాడుతు ,"మీరు ఇక్కడి కెందుకు వచ్చారు? మేమే ప్రాచ్య దేశాలకు రావాలి.మీరు దురదృష్టం కొద్ది భారత  దేశము లో పుట్టారు. ఇంగ్లాండులో పుట్టి వుంటే షేక్సియర్ అంత గొప్ప వారై వుండే వారు " అన్నాడు అంటే రాఘవ గారి గొప్పతనాన్ని మనము ఊహించ వచ్చు.రంగస్థలం మీద అరుపులు కేకలు ఆర్భాటాలు లేకుండా పాత్రల మస్తత్వాలను, మానసిక సంఘర్షణలను ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న మేటి నటుడు బళ్లారి రాఘవ.
బళ్ళారి రాఘవ 1880 ఆగస్టు 2న అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోనరసింహాచారి ,శేషమ్మ దంపతులకు జన్మించాడు అతని పూర్తి పేరు తాడిపత్రి రాఘవాచార్యులు. రాఘవ తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన బిడ్డ. అతను పుట్టకముందు బళ్ళారిలోని బసప్ప అన్న ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వెంటనే పుట్టిన బిడ్డ కావడంతో రాఘవకు మొదట బసప్ప అన్న పేరు పెట్టారు. క్రమేపీ వైష్ణవ సంప్రదాయానుసారం రాఘవాచార్యులు ఆన్న పేరు స్థిరపరిచారు. వారిది శ్రీవైష్ణవ శాఖకు చెందిన బ్రాహ్మణ కుటుంబం. తండ్రి తాడిపత్రి పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవాడు. ఆంధ్ర నాటక పితామహునిగా పేరొందిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాఘవకు స్వయానా మేనమామ.
రాఘవ ప్రాథమిక విద్య పూర్తిచేసి, ఎనిమిదవ యేట బళ్ళారిలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి మొదలుపెట్టాడు
పద్నాలుగవ యేట మెట్రిక్యూలేషన్ పూర్తిచేశాడు. తర్వాత బళ్ళారిలోని వార్డ్ లా కళాశాలలో ఎఫ్.ఎ., మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. పూర్తిచేశాడు. బళ్ళారి తిరిగివచ్చి కొంతకాలం పాటు ఉపాధ్యాయునిగా, ఇంజనీరింగ్ గుమాస్తాగా పనిచేశాడు. తిరిగి మద్రాసులో లా కాలేజీలో న్యాయవిద్య అభ్యసించి బి.ఎల్. పట్టా అందుకున్నాడు.
రాఘవకు బాల్యం నుంచే నటనలో, నాటకాల్లో ఆసక్తి ఉండేది.ఆయన మేనమామ ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాఘవను ప్రోత్సహించాడు 12వ యేట మొదటిసారి రంగస్థలంపై నటించాడు నటనపై ఆసక్తి మరింత వికసించి మద్రాసులో చదివే రోజుల్లో అనేక నాటకాల్లో నటించి అనుభవం గడించేలా ఉపకరించింది.కర్నూలుకు చెందిన లక్ష్మాణాచారి గారి కూతురు కృష్ణమ్మతో వివాహము జరిగింది.కొద్దికాలంలోనే రాఘవ న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, ప్రసిద్ధి చెందాడు. ధనికుడయ్యాడు. ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. "రావు బహద్దూర్" అన్న బిరుదు కూడా ఇచ్చింది.కానీ ఆయనకు నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ ఉన్నాయి. రాఘవకు నాటకరంగంపై ఉన్నఆసక్తి తో బళ్ళారిలో షేక్స్‌పియర్ క్లబ్ స్థాపించి, తద్వారా షేక్స్‌పియర్ నాటకాలు ప్రదర్శించేవాడు. బెంగళూరులో కోలాచలం శ్రీనివాసరావు నడిపే 'సుమనోహర' అనే సంఘం ప్రదర్శించే నాటకాలలో ప్రధాన పాత్రలను ఎక్కువగా బళ్ళారి రాఘవ పోషించేవాడు
బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకొనేవారు.హావభావ ప్రకటనలోను, డైలాగులు చెప్పడంలోను రాఘవ అసమానుడనిపించుకొన్నాడు. విదూషక పాత్ర అయినా, మహారాజు పాత్రయినా రాఘవ అవలీలగా పోషించేవాడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలన్నింటిలోనూ రాఘవ ప్రదర్శనలిచ్చాడు సామాన్య ప్రేక్షకులు, కళాప్రియులు, ప్రముఖులు కూడా బళ్ళారి రాఘవ నాటకాలను బహువిధాలుగా ఆదరించారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాధ టాగూరు, జార్జి బెర్నార్డ్ షా వంటివారు రాఘవ నాటకాలను ప్రశంసించారు.1919 జనవరిలో బెంగుళూరులో జరిగిన ఫెస్టివల్ ఆప్ పైన్ ఆర్ట్ లో రాఘవ పఠాన్ రుస్తుంగా ప్రదర్శించిన అభినయాన్ని రవీంద్ర నాథ్ టాగూర్ ఎంతగానో మెచ్చుకున్నారు 1930లో మద్రాసులో రాజమన్నారు రచించిన "తప్పెవరిది?" నాటక ప్రదర్శనం తెలుగు నాటకరంగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చెబుతారు.హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు  ఇవి ఆయనకు బాగా పేరు తెచ్చిన నాటకాలు. నటుడే కాకుండా రాఘవ నాటక రచయితా కూడా సరిపడని సంగతులు అనే నాటకాన్ని స్వయముగాను, పివి రాజమన్నార్ గారితో కలిసి తెగని సమస్య అనే నాటకాన్ని రచించారు.
స్త్రీలను నాటకాలలో పాల్గొనడానికి రాఘవ ప్రోత్సహించాడు.ఈ విషయమై అప్పుడు వివిధ వేదికలలోనూ, పత్రికలలోనూ చాలా చర్చ జరిగింది. కొప్పరపు సరోజిని, కొమ్మూరి పద్మావతి, కాకినాడ అన్నపూర్ణ వంటి స్త్రీలు ఆయన నాటకాలలో నటనను ప్రారంభించి తరువాత ప్రసిద్ధ రంగస్థలనటీమణులయ్యారు. కె.ఎస్.వాసుదేవరావు, బసవరాజు అప్పారావు, బందా కనకలింగేశ్వరరావు వంటి వారు కూడా బళ్ళారి రాఘవ శిష్యులే.పౌరాణిక నాటకాలలో తారస్థాయిని చేరుకొన్న పద్యాల వినియోగం తెలుగు నాటకాల్లో కాస్త తగ్గించాలనీ, సహజ నటనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనీ రాఘవ వాదించేవాడు. ఇంకా సాంఘిక ప్రయోజనాలకు కూడా నాటకాలలో మరింత ప్రోత్సాహం ఇవ్వాలనేవాడు.
బళ్ళారి రాఘవ శ్రీలంక, ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు పర్యటించి భారతీయ నాటకాలు, కళలగురించి ఉపన్యాసాలు, సెమినార్లు ఇచ్చాడు.1927లో బెంగుళూరుకు  గాంధీజీ వచ్చినప్పుడు రాఘవ ఆధ్యాత్మికగురువైన పండిట్ తారనాధ్  రచించిన హిందీ నాటకము"దీన బంధు కబీర్ "ను కొద్దిసేపు చూద్దామనుకొన్న గాంధీజీ తన ప్రార్ధన సమయాన్ని కూడా మరచిపోయి నాటకాన్ని పూర్తిగాచూసి రాఘవ మహారాజ్ కి జై అని మెచ్చుకున్నారు 1927లో ఇంగ్లాండులో లారెన్స్ ఆలివర్, ఛార్లెస్ లాటన్ ‌ప్రభృతులతో కలిసి ప్రదర్శనలిచ్చాడు. అమెరికా, రష్యా వంటి దేశాలనుండి కూడా ఆహ్వానాలు అందినాయి గాని ఆయన వెళ్ళలేకపోయాడు.
రాఘవ మిత్రులు వత్తిడిపై 1936 సినిమా రంగంలో ప్రవేశించాడు. హెచ్.ఎం. రెడ్డిగారి 'ద్రౌపదీ మాన సంరక్షణము ' లో దుర్యోధనుడుగా నటించారు. గూడ వల్లి రామ బ్రహ్మంగారి 'రైతు బిడ్డ. లోను, రాజరాజేశ్వరి వారి 'చండిక.' లోను నటించాడు. సహజ స్వతంత్ర నటుడైన రాఘవ సినీ రంగంలో ఇమడ లేక పోయారు. కొద్ది సినిమాలలో బళ్ళారి రాఘవ నటించాడు. ద్రౌపదీ మానసంరక్షణం, రైతుబిడ్డ, చండిక, కన్యాశుల్కం వంటివి ఆయన నటించిన కొద్ది సినిమాలు. ద్రౌపదీ మానసంరక్షణంలో ఆయన దుర్యోధన పాత్రను ఎందరో ప్రశంసించారు గాని ఆ సినిమా విజయవంతం కాలేదు.
రాఘవ వృత్తి రీత్యా న్యాయవాధి. తాను నమ్మిన సిద్ధాతాల మేరకు న్యాయంగా వున్న కేసులను మాత్రమే చేపట్టే వాడు. క్రిమినల్ లాయర్ గా బాగా పేరుతో పాటు ధనాన్ని అర్జించాడు. కాని ఆయన మిగుల్చుకున్న దేమి లేదు. అయన సంపాదనను నాటక కళాభి వృద్ధికే వినియోగించాడు.
న్యాయవాదిగా, కళాకారుడుగా పేరు పొందిన రాఘవను 1933 లో కొందరు మిత్రులు బళ్ళారి మునిసిపల్ కౌన్సిల్ కు పోటీ చేయమని ఒత్తిడి చేశారు. రాఘవ, మరి కొందరు మిత్రులు, ప్రముఖ వ్యాపారి ముల్లంగి కరిబసప్ప మున్నగు వారు చాకలి వీధిలో ప్రచారానికి వెళ్ళారు. మిత్రులు ఓటర్లకు రాఘవను పరిచయం చేసి వారికి ఓటు వేయమని కోరారు. ఓటర్లు మౌనంగా వుండి పోవడంతో కరి బసప్పకు కోపం వచ్చి ఓటర్లను తిట్టాడు. రాఘవ మనస్సు చివుక్కు మన్నది. వెంటనే ఇంటికి వచ్చి తమ నామినేషన్ పత్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. ఆయన ఆనాటి నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనాడు.
కష్టాలలో ఉండి సహాయం కోరినవారికి కూడా రాఘవ విరివిగా సహాయం చేసి వాడు. కాని ఆడంబరాలకోసం అతిగా ఖర్చు చేయుడానికి ఆయన వ్యతిరేకి. సంపన్నుడై ఉండి కూడా చాలా సాదాసీదా జీవనం గడిపేవాడు హరిజన బాలబాలికల కోసము ముద్దుతార ప్రాధమిక పాఠశాలను స్థాపించారు అయన గొప్ప శైవ భక్తులు ప్రతిసోమవారము విధిగా శివభజన చేసేవారు. రాఘవ సమయ స్ఫూర్తి చాల గొప్పది.దానికి ఒక ఉదాహరణ  ఒక సారి 'చంద్ర్ గుప్త ' నాటకం విజయవాడ దుర్గా కళామందిరంలో ప్రదర్శింప బడుతూ ఉంది. చాణక్య పాత్ర ధారి రాఘవ ప్రళయ కాల రుద్రుని వలె నందులపై ప్రతీ కారం కోసం తపిస్తున్నాడు. శ్మశాన రంగం అది. అంతలో ఆకస్మికంగా ఒక కుక్క రంగ స్థలం మీదికి వచ్చింది. రాఘవ ఏమాత్రం చెలించక కుక్కను చూస్తూ 'శునక రాజమా, నీకు కూడా నేను లోకు వయ్యానా?' అన్నాడు. కుక్క కాసేపు వుండి వెళ్ళి పోతుంది. ప్రేక్షకుల సంభ్రమాశ్చర్యాలతో రంగ మందిరం దద్దరిల్లింది అటువంటి మహానటుడు1946, ఏప్రిల్ 16 న  తనువు  చాలించారు 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు