ఆంధ్రప్రదేశ్ విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ ‘నిర్ణయం’ చెప్పేసరికి, రాష్ట్ర విభజన తధ్యం, అనివార్యం అని అందరూ అనుకుంటున్నారు. సహజంగానే తెలుగు సినీ పరిశ్రమ ఏమవుతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కానీ, తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడున్నట్టే వుంటుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
హిందీ సినిమాల్ని దేశమంతా చూస్తోంది. తమిళ సినిమాలు డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. కాబట్టి తెలుగు సినిమా రెండు ప్రాంతాల్లో మామూలుగానే విడుదలవుతాయి. ఇది తెలుగు సినీ ప్రముఖుల వాదన. ఉద్యమాల కారణంగా ప్రాంతీయ విభేదాలు వచ్చాయి తప్ప, రాష్ట్రం విడిపోతే కొత్త రాష్ట్రాలలో ప్రేక్షకులు ప్రాంతాలకతీతంగా సినిమాల్ని ఆదరిస్తారనడం నిస్సందేహం.
మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్కి వచ్చింది. ఇక్కడ వేళ్ళూనుకుని వుంది. భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమ విశాఖ వైపు దృష్టి సారించినా, అక్కడ కూడా తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే కోరుకుంటారు. అప్పుడు రెండు కేంద్రాలవుతాయి తెలుగు సినీ పరిశ్రమకి. అది కూడా మంచిదే కదా.
రాజకీయ నాయకులు చెబుతున్నట్టు తెలుగు జాతి ఎలా వున్నా, ఐక్యంగానే వుండాలి. తెలుగు సినీ ప్రముఖులూ అందర్నీ రంజింపజేయాలి.
|