రామ్గోపాల్ వర్మ - నాగార్జున కాంబినేషన్లో సినిమా రాబోతోంది. 27 ఏళ్ల క్రితం ఈ కాంబినేషన్లో వచ్చిన 'శివ' సెన్సేషనల్ విజయాన్ని సాధించింది. టాలీవుడ్ సినిమాకి ఓ కొత్త పంథాని పరిచయం చేసిన సినిమా అది. మళ్లీ 27 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా రాబోతోంది. ఈ నెల 20న ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. అప్పుడు 'శివ' సినిమాని స్టార్ట్ చేసిన చోటే ఈ సినిమాని మొదలుపెట్టడం విశేషం. తొలి షాట్లోనే నాగార్జున చెప్పిన డైలాగ్ అదిరిపోతోంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది ఈ సినిమా. టాలీవుడ్లో ఇదో టెక్నికల్ వండర్ కానుందట. సినిమా ప్రారంభోత్సవం రోజే సినిమాకి సంబంధించి కొన్ని కాన్సెప్ట్ పోస్టర్స్ విడుదలయ్యాయి. వాటిలో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. లుక్ చాలా డిఫరెంట్గా ఉంది.
ఇంతకు ముందెన్నడూ నాగ్ని ఆ లుక్లో చూడలేదు. చాలా రఫ్గా కనిపిస్తున్నాడు ఆ లుక్స్లో. నాగార్జున చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సినిమా కూడా ఇదే. సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉండబోతోందట. వర్మ చెప్పిన సబ్జెక్ట్ నచ్చే ఈ సినిమాకి ఓకే చేశారు నాగార్జున. వర్మపై ఎంతో నమ్మకంతో ఈ సబ్జెక్ట్కి సైన్ చేశారు. నాగ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ద్వారా నిజం చేస్తాననీ వర్మ అన్నారు. అంతేకాదు ఈ మధ్య వర్మ సోషల్ మీడియా వేదికగా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ విమర్శలన్నింటికీ ఈ సినిమాతో చెక్ పెట్టేస్తానన్నట్లుగా వర్మ వ్యాఖ్యానించారు. 'శివ'ని దృష్టిలో పెట్టుకుని ఈ కాంబినేషన్పై భారీగా అంచనాలున్నాయి. చూడాలి మరి ఆ అంచనాల్ని ఈ సినిమా అందుకుంటుందో లేదో! ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క పేరు వినిపిస్తోంది. అయితే ఇంతవరకూ నాగ్తో నటించని ముద్దుగుమ్మని హీరోయిన్గా ఎంచుకునే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారమ్.
|