కాశీ ప్రయాణ కథలు. 3.
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరంకొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకుతిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
"అన్నలు ఈరోజు మీకు శ్రమలో దాగిన సుఖం అనే కథ చెపుతాను వినండి" అని శివయ్య కథ చెప్పడం ప్రారంభించాడు...
తెల్లవారుతూనే తన బొరియలోనుండి వెలుపలకు వచ్చిన కుందేలుకు ఎదురుగా చెట్టుపైనున్న కోతి కనిపించాడు " రా అల్లుడు భుజాన మూటలో ఏదోతెచ్చావే "అన్నాడు .
"మామా మనప్రయాణంలో తినడానికి నాకు పండ్లు, నీకు దుంపలు తెచ్చాను "అన్నాడుకోతి.
ఇంతలో రివ్వున వచ్చిన పిల్లరామచిలుక కోతిమాటలువిని " ముంతడు నీళ్ళకే ఉలిక్కిపడితే పొంతడు నీళ్ళు ఎలా పోసుకుంటావు ?" అన్నది.
"నీతిక్కల సామెతలతో మాప్రాణాలు తీయక "అన్నాడు కోతి. "పోనీలే అల్లుడు చిలకపలుకులు విని సంతోషించాలి "అన్నాడు కుందేలు . "అలా బుద్ది చెప్పు కుందేలు మామ ,వెనుకటికి అయినోళ్ళు అందరూ ఆదారినపోతే జంగాన్ని పట్టుకు జాము ఏడ్చాడంట కోతిబావ లాంటోడు. అన్నది పిల్లరామ చిలుక. ఉరిమిచూసిన కోతి "నువ్వెందుకు పొద్దున్నే ఇలావచ్చావో చెప్పు "అన్నాడు కోతి. " అడవి జంతువులన్ని నీటి జాడ వెదుకు ప్రయాణం చేయడానికి సిధ్ధంగా ఉన్నాయి , సింహ రాజుగారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు "అని వెళ్ళింది చిలుక.
నీటీని వెదుకుతూ అడవి జంతువులు వెళుతూ ఎండ వేడికి భయపడి ఒక పెద్ద మర్రిచెట్టు కింద చేరాయి. " ఏనుగు తాతా మాఅందరిలో పెద్దవాడివి నువ్వు ఏదైనా కథచెప్పు " అన్నాడు గాడిద. "నాకు మాఅమ్మ చెప్పిన కథ చెపుతాను వినండి...తమ ముందు ఉన్నఒక రొట్టెకోసం రెండు పిల్లులు ఈరోట్టె నాకంటే నాకే కావాలి అని వాదులాడుకో సాగాయి.అటుగా వెళుతున్నకోతి, పిల్లుల వాదులాటవిని"ఏమిటి అల్లుళ్ళు మీలో మీరేవాదులాట"అన్నది.
"కోతి మామా ఈరొట్టెను ముందుగా నేనే చూసాను ఇదినేనే తింటాను" అన్నది మొదటి పిల్లి."లేదు రొట్టెను మొదట నేనే చూసాను కనుక ఈరోట్టెను నేనే తింటాను"అన్నది రొండోపిల్లి.
"అల్లుళ్ళు మధ్యవర్తిగా నేను మీకు తీర్పు చేపుతాను,రొట్టెను రెండు ముక్కలు చేసి మీఇద్దరికి చెరిసగం సమంగా పంచుతాను"అన్నదికోతి.
"మామా యాభై ఏళ్ళ క్రితం మీతాత ఇలా పంపకం పేరున రొట్టెను రెండు ముక్కలు చేసి,ఈభాగం ఎక్కువ ఉంది,కాదు మరో భాగం ఎక్కువ ఉంది అంటూ రొట్టె మొత్తం కోతి మామే నాడు తిన్నాడట,ఆకథ మాకు మాపెద్దల ద్వారా తెలుసు,పెద్దల మాట చద్ది మూట అని మేము బాల్యంలోనే తెలుసుకున్నాం, కథలు వినడంవలన, చదవడం వలన బోలెడు లోకజ్ఞానం పొందవచ్చని తెలుసుకున్నాం, అయినా పోరాటం వలన లాభం ఏముంటుంది గాయాలు తప్ప,మాకు వచ్చిన సమస్యను సామరస్యంగా మేమే పరిష్కరించుకుంటాం ఇందులో నీజోక్యం వద్దు, ఇతరుల మేథస్సును,ధనాన్ని, శ్రమను,ఆహారాన్ని దోచుకోవడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా ,మనం మన అవసరాలకు ఎలాదాచుకుంటామో, ఎదటి వారు కూడా వారి అవసరాలకు అలానే దాచుకుంటారు. దొంగతనము చేసి ,మోసగించి ఎవరూ పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు కాలేరు. అటువంటి చర్యలవలన చెరసాల శిక్ష అనుభవించవలసి వస్తుంది. అలాంటి వారిని సమాజం హీనంగా చూస్తుంది ఎవ్వరూ మనల్ని గౌరవించరు , నీకన్న చిన్నప్రాణులు అయిన చీమలు , తేనెటీగలు ఆహారంకోసం అలుపు ఎరుగని పోరాటం చేస్తున్నాయి వాటిని చూసి నేర్చుకో! "అన్నది మెదటి పిల్లి.
సిగ్గుతో తలవంచుకున్న కోతి అవమానంతో వెళుతూ శ్రమ లోనే సుఖం ఉన్నది అని గుర్తించింది " అన్నడు శివయ్య.
అందరూ నిద్రకు ఉపక్రమించారు.

