కాశీ ప్రయాణ కథలు - అంతిమ పరిక్ష .
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
సోదరులారా ఈరోజు మీకు అంతిమ పరిక్ష అనే కథ చెపుతాను వినండి అని శ్రీహరి కథ చెప్పడం ప్రారంభించాడు ...
ధరణికోటను జయచంద్రా అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతని రాజ్యంలో రెండు ఉన్నతమైన పదవులు నిర్వాహణకు ఎంపిక జరిపే బాధ్యత తన మంత్రి సుబుద్దికి అప్పగించాడు.పలువురిని పరిక్షించిన మంత్రి మాధవా,కేశవా అనే యువకులను ఎంపిక చేసి " నాయన లారా మీ ఇరువురిని ఒక్కో ప్రశ్న అడుగుతాను వాటికి సరైన సమాధానం చెప్పగలిగిన వారే అంతిమ పరిక్షకు ఎంపిక అవుతారు , మాధవా ఈభూమండలంపై ఆహరం తీసుకుంటూ నీళ్ళు తాగే ప్రాణి ఏది ? " అన్నాడు.
క్షణకాలం ఆలోచించిన మాధవుడు " మంత్రివర్యా మనిషి మాత్రమే ఆహరం తీసుకుంటూ నీళ్ళు తాగుతాడు "
"భళా నీయొచనా శక్తి అమోఘం ,కేశవా కోడిముందా? గుడ్డు ముందా ? "అన్నాడు మంత్రి.
"కోడి ముందు " అన్నాడు కేశవుడు.
"అదెలా వివరించు "అన్నాడు మంత్రి.
"మంత్రివర్యా తమరు మాటతప్పుతున్నారు తమరుఒక ప్రశ్న మాత్రమే అని ప్రశ్నించారు నేను సమాధానం చెప్పాను కానీ మీరు మరోప్రశ్న వేస్తున్నారు " అన్నాడు కేశవుడు.
"అమోఘం నీతెలివి మెచ్చదగినిదే ,ఇప్పుడు మీఇరువురు అంతిమ పరిక్షకు సిధ్ధంకండి, పరిక్ష ఏమిటంటే మన రాజధాని పక్కనే ఉన్న కొండపైకి ఒక్కరాత్రిలో చేరుకోవాలి మీఇరువురికి చెరిఒక చేతి దీపం ఇవ్వబడుతుంది దీపంలోని నూనె సగం కొండ ఎక్కేసరికి అయిపోతుంది దీపం వెలుగు లేకుండా కొండ ఎక్కకూడదు మీఇరువురు దీపం వెలుగులోనే కొండపైకి చేరుకోవాలి ఈనియమం తప్పక పాటించాలి మీకు తోడుగా ఇరువురు సైనికులు వస్తారు " అన్నాడుమంత్రి.
రాత్రి చీకటి పడిన అనంతరం రెండుదీపాలు వెలిగించి మాధవునికి, కేశవునికి అందించిన మంత్రి వారికి తోడుగా ఇరువురు సైనికులను పంపించాడు. ఆశ్చర్యకరంగా సైనికులతో కలసి మాధవుడు ,కేశవుడు దీపం వెలుగులో కొండపైకి చేరుకున్నారు .
"సోదరులారా మాధవుడు,కేశవుడు చేతిలోని దీపంలోని నూనె సగం కొండ ఎక్కే సరికి అయిపోతుందికదా మరి దీపం వెలుగులో వాళ్ళు కొండ ఎలా ఎక్కగలిగారు? అన్నాడు శ్రీహరి.
పెద్దన్న గారు మాధవుడు,కేశవుడు సహజంగా తెలివైన వారు ,కొండఎక్కడం ప్రారంభం కాగానే మాధవుడు తన చేతిలోని దీపంలో ఉన్న దీపం నూనెను కేశవుని చేతిలోని దీపంలో పోసాడు అలాదీపం వెలుగులో వారు కొండ ఎక్కగలిగారు "అన్నాడు శివయ్య.
"సోదరా ప్రారంభంలో మాధవుని చేతిలో దీపం మాత్రమే వెలిగించి సగం కొండ ఎక్కడానే మాధవుని దీపం అరిపోయిన అనంతరం కేశవుని చేతిలో దీపం వెలిగించి కొండపైకి చేరుకునే అవకాశం ఉంది "అన్నాడు బ్రహ్మయ్య.
కథ ముగియడంతో అంతా నీద్రకు ఉపక్రమించారు.

