ఆంధ్ర పితామహుడు తెలుగు ప్రజల చేత గౌరవంగా'ఆంధ్ర పితామహుడు'అని పిలిపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మాడపాటి హనుమంతరావు.తెలుగుజాతికి పితామహునిగా ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యమైనవి.ఆయన రాజకీయనాయకుడు,న్యాయవాది సామాజిక-సాంస్కృతిక రంగాల ఉద్యమ కారుడు,రచయిత, విద్యా సంస్థల స్థాపకుడు,వివిధ వృత్తి-కుల సంఘాల స్థాపకుడు.ఇలా చెప్పుకుంటూపోతే అదొక పెద్ద కథగా మారుతుంది.ఆయన ప్రస్థానం ఏ రంగంలోని వారికైనా నిరంతరం స్ఫూర్తిని నింపుతూనే ఉంటుంది. మాడపాటి వారు కృష్ణా జిల్లాలోని నందిగామ తాలూకాలో ఉన్న పొక్కునూరు గ్రామంలో 1885,జనవరి 22 నాడు జన్మించారు.తండ్రి అకాల మరణం చెందడంతో నల్గొండ జిల్లాలోని సూర్యాపేట లో తహసీలు కార్యాలయంలో పేష్కారుగా ఉద్యోగం చేస్తున్న మేనమామ జమలాపురం వెంకటరావు గారి పోషణలో పెరిగాడు.మేనమామల సహకారంతో చదువుకొని రకరకాల ప్రభుత్వ ఉద్యోగాలు చేసాడు.ఉద్యోగం చేస్తూనే లా కోర్సులో చేరి 1917 లో న్యాయవాదిగా తన మనస్తత్వానికి సరిపోయే వృత్తిలోకి మారాడు. ఒకరకంగా మాడపాటి వారి జీవితం ఇక్కడినుంచే మలుపు తిరిగింది. నిరంతరం తనవద్దకు న్యాయం కోసం వచ్చే ప్రజలదగ్గరనుంచి తెలుసుకున్న విషయాల ఆధారంగా ఆనాటి తెలుగుసమాజం తాలూకు అసలుస్థితిను అర్థం చేసుకున్నాడు.ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సంకల్పించాడు. నిజాంపరిపాలన కింద ఉన్న తెలుగు ప్రాంతంలో ఆనాడు తెలుగులో చదువులు లేవు. తెలుగు సంస్కృతికి విలువ లేదు. భాష మీద, సంస్కృతి మీద పరాయి పెత్తనాన్ని సహించని మాడపాటి ఈ రెండంశాల పట్ల ప్రజల్లో కదలిక తీసుకురావాలని భావించాడు. దానికొరకు సారూప్య భావజాలం కలిగిన మిత్రులతో కలిసి 1921లో 'ఆంధ్రజనసంఘం' ఏర్పాటు చేసాడు. ఇది తెలంగాణ ప్రాంతంలో పదమూడు మహాసభలను నిర్వహించి ప్రజలను చైతన్యం చేసింది.అయితే 1930లో జోగిపేటలో జరిగిన మహాసభలో దీనిపేరు 'ఆంధ్రమహాసభ'గా మార్చారు. దీని కేంద్ర సంఘానికి కూడా ప్రధాన కార్యదర్శిగా ఉండి సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా నిర్విరామ కృషి సల్పాడు మాడపాటి. ప్రజల నుంచి మేధావులను తయారు చేసి తాను నడిపిస్తున్న సామాజిక ఉద్యమాలను బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో గ్రంథలయాలను స్థాపించాడు హన్మంతరావు.1900లో హైదరాబాదులో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం,1904లో వరంగల్లులో రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషానిలయం నెలకొల్పాడు.ఆయన నిబద్ధత ఎలాంటిది అంటే షష్టిపూర్తి సందర్భంగా ఆయనకు జరిగిన సన్మానం ద్వారా లభించిన సొమ్మును కూడా గ్రంథాలయాలకు,గ్రంథ ప్రచురణలకు వినియోగించాడు. అయితే కొమర్రాజు లక్ష్మణరావు తరువాత గ్రంథాలయోద్యమంలో మాడపాటి వారి కృషి చెప్పుకోదగింది. ఆనాడు విద్యార్థులకు తెలుగు మాధ్యమంలో పాఠశాలలు లేవు. ఆ లోటును పూడ్చటానికి హైదరాబాదులోని నారాయణగూడలో బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేశాడు. ఒకరకంగా మహారాష్ట్రలో ఫూలే సాగించిన కృషిలాంటిదే ఇది.ఆడపిల్లల కోసం ఆయన ఎన్నో పాఠశాలలు స్థాపించాడు.రచయితగా ఆనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ అనేక రచనలు చేశాడు.'తెలంగాణలో ఆంధ్రోద్యమము'అనేది వీరి ప్రసిద్ధ రచన. ఒకరకంగా ఆయన ఆత్మకథలాంటిదే ఇది. ఈరకంగా తెలుగు ప్రజల జీవితాల్లో చైతన్యం నింపడానికి ఆయన ఎన్ని రకాల అవకాశాలు అందుబాటులో ఉన్నాయో అన్నింటినీ ఉపయోగించుకున్నాడు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజాల కోసమే ఆలోచించాడు.అంత చేసి కూడా తన పేరుప్రఖ్యాతులను ఆధారంగా చేసుకొని ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని కోరుకోలేదు. అంతటి నిస్వార్ధపరుడు. నిరాడంబరుడు.ఆనాటి రాజకీయ దురందరుల ఒత్తిడి నేపథ్యంలో హైదరాబాద్ నగర తొలి మేయర్ గా,ఆంద్రప్రదేశ్ రాష్టంలో తొలి శాసన మండలి అధ్యక్షుడిగా ప్రజలకు మరిన్ని సేవలను అందించాడు.ఆయన ప్రజాజీవితాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 'పద్మ భూషణ్' పురస్కారంతో గౌరవించింది.తెలంగాణ ప్రజల జీవితాల మీద చెరగని ముద్ర వేసిన మాడపాటి తన 85 వ ఏట నవంబర్11,1970 నాడు శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. -తోకల రాజేశం 9676761415 హామీపత్రం మాడపాటి హనుమంతరావు మీద 'గో తెలుగు డాట్ కామ్'లో ప్రచురణ నిమిత్తం పంపిస్తున్న "ఆంధ్ర పితామహుడు"అన్న వ్యాసం నా స్వంతం.ఇది ఇంతవరకు ఎలాంటి దిన, వార,పక్ష,మాస పత్రికలలో ప్రచురింపబడలేదు. ఎలాంటి అంతర్జాల పత్రికలలో వెలువడలేదు. ప్రచురణ నిమిత్తం ఎవరివద్ద కూడా పరిశీలనలో లేదు. ఈ వ్యాసం ఎవరికి అనువాదం కాదు. అనుసరణ కూడా కాదు. ఈ నిమిత్తమై ధ్రువీకరిస్తూ హామీ ఇస్తున్నాను. ఇట్లు తోకల రాజేశం రచయిత 9676761415

