గణేశుని కల్యాణం.
శివపార్వతులు తమసంతానమైన కుమారస్వామి-గణేశుని పిలిచి 'నాయనలారా మేము మీవివాహంచేయదలచాము.అందుకు ముకు ఒక నిబంధన పెడుతున్నాము.మీలోఎవరుముందుగా భూప్రదక్షణం చేసి ముందుగా కైలాస గిరికి వస్తారో వారికే ప్రధమంగా వివాహం జరిపిస్తాము' అందిపార్వతిదేవి.
తల్లిమాటలువింటూనే తనమయూర వాహనంపై భూప్రదక్షణానికి బయలుదేరాడు కుమారస్వామి.
తనఎలుక వాహనంపై వెళ్లడంకుదరదని తలచిన గణేశుడు,శుచిగా తలస్నానంచేసి,ఆశీనులైన తల్లితండ్రి పాదాలను పూజించి.వారికి ప్రదక్షణంచేసి 'తల్లి జననీ జనకులకు ప్రదక్షణచేస్తే భూప్రదక్షణఫలం అనివేదాలు చెపుటున్నాయి.మరినేను అలానేచేసానుకదా! ముందు నావివాహం జరిపించండి'అన్నాడు.
అనంతరం వచ్చిన కార్తికేయుడు తల్లితండ్రిపై అలిగివెళ్లి క్రౌంచపర్వతంపై నివసించ సాగాడు. కస్యపుని కుమారుడైన విశ్వరూపుని కుమార్తేలైన సిధ్ధి,బుధ్ధి లను ఇచ్చి వివాహంజరిపించగా,సిధ్ధికి 'లాక్ష' అనే కుమారుడు,బుధ్ధికి'లాభుడు'అనేకుమారుడు కలిగాడు. .కృష్ణపక్షంలో చతుర్ధముఖ్యమైనరోజు.కార్తీకమాసంలో కృష్ణచతుర్ధ తిథిన గణపతిని పూజిస్తే,కోరికలు నెరవేరతాయి. అలిగివెళ్లిన కుమారస్వామిని శివుడు అమావాస్యనాడు, పార్వతిదేవి పౌర్లమినాడు చూడటానికి వెళతారట.
గణపతిని లక్ష్మీ సహితంగా లక్ష్మీ గణపతిగా ఆరాధిస్తాం . లక్ష్మీ గణపతికి పూజలతో పాటు విశేషించి హోమాదికాలు కూడా జరిపిస్తూ ఉంటాం . లక్ష్మీ దేవి కాకుండా సిద్ధి , బుద్ధి సమేత గణపతి మనకి దర్శనమిస్తారు. వీరిద్దరూ గణపతికి భార్యలుగా వివాహ మహోత్సవాలు నిర్వహిస్తుంటాం . వీరీకాక, గణపతికి తుష్టి , పుష్టి అని మరో ఇద్దరు భార్యలున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి . లక్ష్మీ దేవితోపాటుగా సరస్వతీదేవి కూడా గణపతి సహితంగా దర్శనమిస్తారు . వీరు ముగ్గురూ కలిసి ఉన్న చిత్రాలని పూజాగదిలో పెట్టుకొని ఆరాధిస్తాం. శక్తి గణపతి అనేది గణపతి మరో స్వరూపం . ఇదంతా ఒకెత్తయితే, గణపతి స్వామిని బ్రహ్మచారని చెబుతారు కదా ? ఇంతమంది భార్యలున్న గణపయ్య బ్రహ్మచారి ఎలా అయ్యారు ?
ఈ విషయాన్ని మనం వీలైనంత సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తేగానీ, అంతరార్థం బోధపడదు . భార్య అని అంటే, విడదీయలేని శక్తి . లేదా సదా అంటిపెట్టుకొని ఉండే శక్తి స్వరూపం అని అర్థం . పురాణాలలో దేవతా స్వరూపాలని కథా రూపంగా చెప్పేటప్పుడు అందులో మంత్ర సంకేతాలు , యజ్ఞ సంకేతాలు , తదితర రహస్యాలనెన్నింటినో సంకేతాలుగా పొందుపరిచారు. మనం సంకేతాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది .
ఉదాహరణకి సిద్ధి , బుద్ధి సహిత గణపతిని తీసుకుంటే, వీరి సంతానం క్షేముడు , లాభుడు . ఇక్కడ సిద్ధి , బుద్ధి అనేవి ఆ పరమాత్మని అంటి పెట్టుకొని ఉండే శక్తులు . గణపతిని సిద్ధి, బుద్ధి సమేతంగా అర్చించడం వలన కార్యములలో యోగములో బుద్ధి నిలిచి సిద్ధి కలుగుతుంది . తద్వారా మనం క్షేమం, లాభం పొందుతాము . పుత్రులు అంటే ఇక్కడ ఆయన అనుగ్రహించే ప్రసాదము అని అర్థం చేసుకోవాలి . ఇక్కడ ధర్మం పదిలంగా ఉండడం క్షేమం అయితే, ఏ యోగముద్వారా పరమాత్మని పొందడానికి సాధన చేస్తామో అది లాభించి సిద్ధిని పొందడం అనేది లాభం లేదా లాభుడు అని అర్థం చేసుకోవాలి .
దేవీభాగవతంలో ఆయనకీ తుష్టీ , పుష్టి అని ఇద్దరు భార్యలున్నట్టు వర్ణిస్తారు . తుష్టి అంటే తృప్తి , సంతోషం. ఇవి రెండూ లేనప్పుడు మనకి ఎంతటి సంపదలూ, సౌభాగ్యాలూ ఉన్నప్పటికీ కూడా ఉపయోగం లేదు కదా ! అదేవిధంగా వినాయకుడికి పుష్టీ పతి అని పేరు . పుష్టి అంటే సంవృద్ధిగా ఉండడం అనేకదా అర్థం . బలం , దానం , తృప్తి పుష్టిగా ఉండాలి . అప్పుడే కదా మనం , మన దేశం, ఈ జగత్తు పుష్టిగా ఉంటుంది . ఇవి ఆయన శక్తులు. ఆయన్ని ఉపాసించడం వలన సిద్ధిస్తాయి . ఉపాసన అంటే ఆ గణపతికి సర్వదా సామీప్యంగా ఉండడం. మనసా, కర్మణా, వాచా గణపతిని ఉపాశించేవారికి ఇవన్నీ సిద్ధిస్తాయి .
ఇక లక్ష్మీ గణపతిని గురించి రకరకాలుగా మాట్లాడడం వింటూ ఉంటాం . ఇప్పుడు ఉపాసనా కోణం నుండీ లక్ష్మీ గణపతిని చూస్తే, లక్ష్యం అయిన వాటిని అనుగ్రహించే మాత లక్ష్మీ మాత. లక్ష్యమయ్యేవి ఏమిటి ? సిద్ధి , బుద్ధి, తుష్టి , పుష్టి, లాభం, క్షేమం ఇవేకదా ! ఈ సౌభాగ్యాలన్నింటికీ ఒక పేరు పెడితే ఆవిడ లక్ష్మి . అందువల్ల ఆమె ఆయన శక్తి. కనుక లక్ష్మీదేవిని గణపతి సహితంగా ఆరాధించడం . ఇక బుద్ధినిచ్చే దేవి వాగ్దేవేకదా !! అప్పుడు సిద్ధి, బుద్ధులు లక్ష్మీ , సరస్వతులు కదా ! ఇలా ఉపాసనా దృష్టితో గణపతిని అర్థం చేసుకున్నప్పుడు ఆయన సర్వాంతర్యామిత్వం అర్థమై, బుద్ధి ఆ సిద్ధిగణపతి ముందర మోకరిల్లుతుంది .
అదీ సంగతి. అందువల్ల గణపయ్య ఇంత మంది భార్యలకు భర్త అనుకోవడం కాదు చేయవలసింది. గణపతి ఆరాధన వల్ల ఇన్ని శక్తుల అనుగ్రహం కలుగుతుంది అని భావం . కనుక గణపయ్య ఇంతమంది భార్యలుండీ బ్రహ్మచారి అన్నమాట !
శ్రీ విఘ్నేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు !!
సేకరణ.

