సీ యస్ రావు చతుర నవలలు: పుస్తక సమీక్ష - సిరాశ్రీ

cs rao chathura navalalu
రచన: సీ యస్ రావు
వెల: 250/-
ప్రతులకు: విశాలాంధ్ర
రచయిత దూరవాణి: 9885017122, 040-23401747

"ఈనాడు" సంస్థ 70 వ దశకంలో నెలకొక కొత్త నవలను తెలుగు వారికి అందజేయాలనే ఉద్దేశ్యంతో "చతుర" అనే మాస పత్రికను స్థాపించారు. అది కూడా వందలాది పేజీలతో ఎడతెగని నవల కాకుండా వంద పేజీల లోపు ఉండే చిన్న నవల, నవలిక అనవచ్చు. నవలా ప్రియులంతా చతుర కోసం చకోర పక్షుల్లా వేచి చూసేవారు. అలాగే నవలా రచయితలంతా చతుర లో తమ నవల ప్రచురింపబడాలని తహ తహ లాడేవారు. కాని "చతుర" వారి నియమ నిబంధనలకి అనుగుణంగా ఉంటేనే ప్రచురణకు యోగ్యత సంపాదించుకునేది ఏ నవలైనా.
అలా పలు నవలలు "చతుర" కు అందించిన ప్రసిద్ధ రచయిత సీ యస్ రావు "చతుర నవలలు" పేరిట ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో మొత్తం ఐదు నవలలు ఉనాయి. అన్నీ గతంలో "చతుర" లో వచ్చినవే.

1. కమలమ్మ కమతం
2. రవళి
3. ప్రేమ మజిలీలు
4. శివగంగ
5. సమాగమం

వీటిల్లో "కమలమ్మ కమతం" అదే పేరుతో సినిమాగా వచ్చి పలు పురస్కారాలను అందుకుంది. ఇక "శివ గంగ" ఉషా కిరణ్ పతాకంపైన "మల్లెమొగ్గలు" పేరుతో 80 వ దశకంలో విడుదలయ్యింది.

స్వతహాగా నాటక రచయిత కావడంతో సీ యస్ రావు నవలల్లో నటకీయత ఉండి అక్షరాలు చదువుతుంటే దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంది.

తూర్పు గోదావరి నేపధ్యంతోనే సీ యస్ రావు రచనలు సాగడం ఒక ప్రత్యేకత. ఆ మాండలికంపై ఆయనకున్న పట్టు, గ్రామీణ వాతావరణంలోని విశేషాలు కథలోకి చొప్పించి కనికట్టు చేసే నేర్పు, పాత్రోచిత హాస్యం అన్నీ ఈ తరం పాఠకులను కూడా అలరిస్తాయనడం అతిశయోక్తి కాదు.

సమీక్షన్నాక ఒప్పులతో పాటు తప్పులు కూడ రంధ్రాన్వేషణ చేసి చెప్పాలి కనుక చెబుతున్నా. ఇందులో ఉన్న చిన్న లోటేమిటంటే అక్కడక్కడ "ముద్రా"రాక్షసాలు ఉండడం...అచ్చు తప్పులన్నమాట.

అయితేనేం?...మాయాబజార్లో ఎస్ వీ రంగారావు చెప్పిన "పాడిత్యంకన్నా జ్ఞానం ముఖ్యం" అనే డయలాగ్ ఒక్కసారి తలుచుకుని ఆ అచ్చు తప్పుల్ని పెద్దగా పట్టించుకోకుండా చదువుకుంటే గోదావరి మాండలీక జ్ఞానంతో పాటు కావల్సినంత ఆహ్లాదం, రసానుభూతి కలగడం ఖాయం. 
 
ఇక మీ ఇష్టం.