ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

జయంతులు

జూలై 5
1 శ్రీ ఘంటసాల బలరామయ్య :  వీరు జూలై 5, 1906 న నెల్లూరు లో జన్మించారు. ప్రముఖ సినిమా నిర్మాత, దర్శకుడు.  నాగేశ్వరరావు, అమర గాయకుడు ఘంటసాల లను వెండితెరకు పరిచయం చేసింది వీరే. పోటీపడి, “ శ్రీలక్ష్మమ్మ కథ “ ను 19 రోజుల్లో నిర్మించిన ఘనత కూడా వీరిదే.

2. శ్రీ రావూరి భరద్వాజ  :  వీరు జూలై 5, 1927 న కంచికచెర్ల లో జన్మించారు.  తెలుగులో ఎన్నో లఘుకథలు, నవలలూ రాసారు. 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించారు. 2012 లో జ్ఞానపీఠ పురస్కారం తో సత్కరించబడ్డారు.

జూలై 6
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ  : వీరు జూలై 6, 1930 న, శంకరగుప్తం లో జన్మించారు. ప్రఖ్యాత కర్ణాటకసంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు,  . ప్రపంచ వ్యాప్తంగా, 25 వేల ప్రదర్శన/ కచేరి లు ఇచ్చిన ఘనత వీరిది. ఆయన, మృదంగం, కంజిరా లను కూడా అద్భుతంగా వాయించేవారు.

జూలై 7
శ్రీ మద్దిపట్ల సూరి :  వీరు జూలై 7, 1916 న అమృతలూరు లో జన్మించారు.  ప్రముఖ అనువాదకుడు , రచయిత, సాహితీవేత్త. వీరి  అనువాదాలలో అధికభాగం సాహిత్య ఎకాడమీ పురస్కారాలు అందుకున్నవారి రచనలే. వారి శైలి సంస్కృతం వన్నెమీరిన వ్యావహారికం. రవీంద్రనాథ్ టాగోర్ 21 ప్రసిద్ధకథలకు వీరి అనువాదాలు రవీంద్ర కథావళ అన్నపేరుతో 1968 లో ప్రచురించారు.  1993 లో సాహిత్య అకాడమీ అనువాద బహుమతి వీరికి ఇచ్చారు.

జూలై 9
1.శ్రీ టేకుమళ్ళ రాజగోపాల రావు : వీరు జూలై 9, 1876 న పెద్దాపురం లో జన్మించారు. వీరు గొప్ప విద్యావేత్త , రచయిత, దార్శనికుడుగా పేరు పొందారు. వీరు రాసిన “ విహంగ యానం “ తెలుగులో వెలువడిన మొట్టమొదటి  Science Fiction Novel  గా పేరు పొందింది. గ్రంధాలయోధ్ధరణకు ఎంతో కృషి చేసారు.
2.శ్రీ ఉప్పులూరి గోపాలకృష్ణమూర్తి :  వీరు జూలై 9, 1918 న మచిలీపట్నం లో జన్మించారు.  దేశవిదేశాల్లో పేరు గడించిన సుప్రసిధ్ధ తత్వవేత్త.   U G  గా ప్రసిధ్ధి చెందారు.

జూలై 10
శ్రీ పీసపాటి నరసింహ మూర్తి :  వీరు జూలై 10, 1920 న వంతరాం లో జన్మించారు. పేరుపొందిన రంగస్థల నటుడు. తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడు పాత్రదారిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు.

జూలై 11
శ్రీ చిలకలపూడి సీతారామాంజనేయులు :   C S R  గా ప్రసిధ్ధి చెందిన వీరు, జూలై 11, 1907 న నరసరావుపేట లో జన్మించారు. ప్రముఖ రంగస్థల, సినిమా నటుడు. వారి   Dialogue delivery  ప్రత్యేకంగా ఉండేది. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు.. “ మాయాబజార్ “ లో వీరి శకుని పాత్ర, ఇప్పటికీ , తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు.

వర్ధంతులు

జూలై 6
శ్రీ మోటగానహళ్ళి లక్ష్మి నరసు జయసింహ :   జన్మతహా కన్నడిగుడైనా, సికిందరాబాద్ లోనే పెరిగాడు. ఒక అద్భుత క్రికెట్ ఆటగాడు.  M L జయసింహ గా ప్రసిధ్ధిచెందారు. భారత క్రికెట్ జట్టులో 39 టెస్ట్ మాచ్ లు ఆడారు.
వీరు జూలై 6, 1999 న స్వర్గస్థులయారు.

జూలై  7
శ్రీ వాడపల్లి వెంకటేశ్వర రావు :   భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం అయిన కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు . 2008 జూలై 7వ తేదీన కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం ముందు జరిగిన తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో మొత్తం 41 మంది మృతి చెందగా,వారిలో భారతీయ దౌత్యవేత్త అయిన 44 యేళ్ళ వాడపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరికి మరణానంతరం కీర్తిచక్ర ప్రదానం చేసారు. .
వీరు జూలై 7, 2008 న స్వర్గస్థులయారు.

జూలై 8
శ్రీ నాయని సుబ్బారావు :   తొలితరం భావకవి, స్వతంత్ర సమర యోధుడు. ఈయన రచనలలో ప్రముఖమైనది 1937లో రాసిన సౌభద్రుని ప్రణయ యాత్ర అనే ఆత్మ కథాత్మక కావ్యం. ఈయన మాతృగీతాలు (1939), వేదనా వాసుదేవము (1964), విషాద మోహనము (1970) అనే స్మృతి కావ్యాలూ, జన్మభూమి (1973) అనే మహాకావ్యమూ రాశారు..
వీరు జూలై 8, 1978 న స్వర్గస్థులయారు.

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu -  doorapu kondalu nunupu
కాశీ ప్రయాణ కథలు - దూరపు కొండలు..
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు
రామానాయుడు
- .డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.