అటు వరల్డ్‌ కప్‌.. ఇటు ఆటగాళ్ల ప్యాకప్‌.! - ..

The World Cup.. Players Pack.!

ఇండియాలో క్రికెట్‌ని ఓ ఆటగా కాదు.. అంతకు మించిన ఏదో ఓ అద్భుతం అన్నట్లుగా భావిస్తుంటారు అభిమానులు. కొంతమంది ఇంకో అడుగు ముందుకేసి క్రికెట్‌ ఓ మతంగా మారిపోయిందని సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. అసలు క్రికెట్‌కి ఇంతటి క్రేజ్‌ భారతదేశంలో ఎందుకొచ్చింది అంటే దానికి చాలా కారణాలున్నాయి. కారణాల సంగతి పక్కన పెడితే, క్రికెట్‌ కెరీర్‌ని ఊహించుకుని, చిన్నతనం నుండే బ్యాట్‌ చేత పట్టి, బంతిని గిర గిరా తిప్పి విన్యాసాలు చేస్తుండడం సహజమే. ఇప్పుడు ప్రపంచంలోని పలు దేశాలు వరల్డ్‌ కప్‌ ఫీవర్‌లో మునిగి తేలుతున్నాయి. వాటిలో చాలా కొద్ది దేశాలు మాత్రమే క్రికెట్‌ని ఆస్వాదిస్తాయనుకోండి.. అది వేరే సంగతి. 
ఎప్పుడో కపిల్‌ డెవిల్స్‌ వరల్డ్‌ కప్‌ని సాధిస్తే, చాలా కాలం తర్వాత ధోనీ సేన 2011లో మళ్లీ వరల్డ్‌ కప్‌ అందుకుంది. మధ్యలో 2015 వరల్డ్‌ కప్‌ని చేజార్చుకున్న టీమిండియా ఈ సారి ఎలాగైనా కప్‌ కొట్టాలనే కసితో ఉంది. విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే సెమీస్‌లోకి అడుగు పెట్టేసింది.

దేశమంతా టీమిండియా గెలుపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ క్రికెట్‌లో లుకలుకలు బయట పడుతుండడం గమనార్హం మన తెలుగోడు అంబటి తిరుపతి రాయుడు బీసీసీఐ రాజకీయాల కారణంగా వరల్డ్‌ కప్‌ ఆడలేకపోయాడు. ప్రతిభ ఉన్నా, క్రికెట్‌లోని రాజకీయాలు, అతనికెంతో ఇష్టమైన క్రికెట్‌ని దూరం చేశాయి. స్టాండ్‌బైగా అయినా అవకాశం దక్కినందుకు ఆనందిస్తూ, వరల్డ్‌ కప్‌లో ఆడే అవకాశం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాడు. ఫలితం దక్కకపోవడంతో చివరికి రిటైర్‌మెంట్‌ ప్రకటించేశాడు. వరల్డ్‌కప్‌కి కొద్ది రోజులు ముందే యువరాజ్‌ సింగ్‌ కూడా క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. అంతకు ముందు గౌతమ్‌ గంభీర్‌ని కూడా క్రికెట్‌లోని రాజకీయాలే ఎగతాళి చేశాయి. టీమిండియా గెలవడం గురించి ఎంతగా క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారో, క్రికెట్‌లో రాజకీయాలు నశించాలని కూడా అంతే బలంగా కోరుకుంటున్నారు. ఛీఫ్‌ సెలెక్టర్‌ మన తెలుగోడు అయ్యుండి, సాటి తెలుగోడి ప్రతిభను అవమానించడం అత్యంత బాధాకరమైన విషయం. ఈ వివాదాల సంగతి పక్కన పెడితే, వరల్డ్‌ కప్‌లో అద్భుతమైన ప్రతిభతో మెన్‌ ఇన్‌ బ్లూ సెమీస్‌కి చేరుకున్న దర్మిలా ముచ్చటగా మూడోసారి వరల్డ్‌ కప్‌ని గెలుచుకోవాలని ఆశిస్తోంది 130 కోట్ల యువ భారతం.