రుతు'క్రమం' తప్పుతోందా.? నిర్లక్ష్యం వద్దు.! - ..

Do not neglect.!

రుతుక్రమం.. యవ్వనాన్ని అంది పుచ్చుకున్న ప్రతీ ఆడపిల్ల జీవన చక్రంలో అతి కీలకమైన ఘట్టం ఇది. పునరుత్పత్తి క్రియకు ఈ చర్య అత్యంత కీలకం. అయితే, ఈ రుతుక్రమంలో వచ్చే తేడాలను మహిళలు చాలా లైట్‌గా తీసుకుంటారు. సహజంగా అందరు మహిళల్లోనూ ఉండే సమస్యలే అని నిర్లక్ష్యం చేస్తారు. మన భారతీయ సాంప్రదాయాలు, కట్టుబాట్ల దృష్ట్యా ఈ సమయంలో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని ఒక్కోసారి పెద్ద సమస్యలే అయినా బయటికి చెప్పేందుకు ఇష్టపడరు. కానీ, చిన్న సమస్యే కదా.. సహజమైన సమస్యే కదా.. అని లైట్‌ తీసుకుంటే, అంతిమంగా అవి దీర్ఘకాలిక సమస్యలుగా పరిణమించవచ్చు. రుతుక్రమంలో వచ్చే తేడాల వల్ల మహిళల జీవిత కాలం తగ్గిపోయే అవకాశాలున్నాయని  వైద్యులు సూచిస్తున్నారు. రుతుక్రమంలోని తేడాలు కేవలం మహిళల్లో లైంగిక రుగ్మతలకు మాత్రమే కారణంగా భావిస్తే పొరపాటే. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య గుండెపోటు, ఇతరత్రా దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ప్రమాదముంది.

ముఖ్యంగా రుతుక్రమంలో హెచ్చు తగ్గులు జీవక్రియలను కుంగదీసే మెటబాలిక్‌ సిండ్రోమ్‌ సమస్యకు కారణం కావచ్చు. మహిళల్లో వచ్చే ఎక్కువ క్యాన్సర్‌ రకాలకు ఇదీ ఓ కారణంగా భావించాలి. అంతేకాదు, తీవ్రమైన కుంగుబాటు, మానసిక ఒత్తిడికి కూడా దారి తీసే ప్రమాదాలున్నాయి. ఆయా కారణాలతోనే మహిళల్లో ఈ సమస్య దీర్ఘ కాలిక సమస్యగా పరిణమిస్తోంది. తద్వారా వారి జీవిత కాలాన్ని కొద్ది కొద్దిగా తగ్గించి వేస్తోంది. పీరియడ్స్‌ క్రమంగా వచ్చే మహిళలు, క్రమం తప్పి వచ్చే మహిళలను రెండు గ్రూపులుగా విడదీసి, వారి మానసిక స్థితి గతుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని అంచనా వేసిన వైద్య నిపుణులకు ఆశ్చర్యకరమైన నిజాలు బయటికొచ్చాయని ఈ మధ్య ఓ అధ్యయనం వెల్లడించింది. గుండెపోటు, రక్తహీనతతో అనూహ్య మరణాలు సంభవించాయని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది. సో నెలసరి క్రమాన్ని లైట్‌ తీసుకోవద్దనీ, ఏ చిన్న తేడా ఉన్నా, సిగ్గు పడకుండా, వెంటనే వైద్యుని సలహాలు తీసుకోవాలని, అవసరమైన చికిత్సలు చేయించుకోవాలని అధ్యయన నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు గుర్తు పెట్టుకోవాల్సింది పరిశుభ్రతను పాఠించడం, మంచి ఆహారం తీసుకోవడం. ఈ సమయంలో పరిశుభ్రతను పాఠించడంతో పాటు, పోషకాలు, కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వేడి వేడిగా ఉన్న ఆహారంతో పాటు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల రసాల్ని ఎక్కువగా తీసుకోవాలి. వీలైనంత విశ్రాంతి కూడా అవసరమే. ఈ జాగ్రత్తలు పాఠిస్తూ, ఏ రకమైన చిన్న సమస్యనైనా నిర్లక్ష్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్య చికిత్స చేయించుకోవడం ఉత్తమం అని స్పెషలిస్టులు చెబుతున్న మాట.