నా జ్ఞాపకాల్లోంచి - డా.కె.ఎల్.వి.ప్రసాద్

ఆమ్మో ,,! ఇదేమి దగ్గు .. !!

ఊహించని సంఘటనలు ఒక్కోసారి మనిషిని భయభ్రాంతులకు గురి చేస్తాయ్. తక్షణం మెదడు మొద్దుబారిపోయి ఏమి చేయాలో తెలీక ఎదురయ్యే ప్రమాదాన్ని ఊహించలేక సతమతమయ్యే సమయాలు..దానికి తోడు పెద్ద దిక్కు తోడులేని ఒంటరి సంసారిక జీవితాలు, తలుచుకుంటే భయంతో వళ్లు కంపిస్తుంది, మనస్సంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎక్కడ లేని పిరికితనం శరీరంలో ప్రవేశించి వున్న దైర్యం కాస్తా చెట్టెక్కి కూర్చుంటుంది. బ్రతుకుతెరువు కోసం పొట్ట చేత పట్టుకుని ఉద్యోగరీత్యా సుదూర తీరాలకు పోయి అక్కడ పని చేయాల్సి వస్తుంది. అయిన వాళ్లకి దూరమై పోయి వంటరి జీవితంతో సహవాసం చేయాలి. పెళ్ళైతే కొంచెం ధైర్యం భార్య కూడా ఉంటుంది కనక. తర్వాత ఒక్కళ్ళో ఇద్దరో పిల్లలు.. ఇంతకు మించి అయిన వాళ్ళు అంటూ ఎవరూ వుండరు. స్నేహితులు వున్నా కొన్ని పరిమితుల వరకే వారి సహకారాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. పెద్ద దిక్కు కోసం ప్రయత్నించే అవకాశమే రాదు. అంతంత దూరాలు వెళ్లి పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళిపోతే, పెద్దవాళ్ళు అలా తెలియని ప్రదేశాల్లో వంటరిగా గడపడానికి సాహసం చేయరు. అందుకే అలాంటి చోటికి పెద్దవాళ్ళని పిలవడానికి ఇష్టపడరు పైగా, వాళ్లకు ఏదైనా ఇబంది వస్తే అదనంగా వాళ్లకు సేవ చేయవలసిన పరిస్థితి రావచ్చు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఈ రిస్కులు తీసుకోరు. సాధ్యమైనంత వరకూ సమస్యలను వంటరిగానే ఎదుర్కోడానికి ప్రయత్నం చేస్తారు. కానీ, ఊహించని సమస్యలు ఉత్పన్నమైనప్పుడు తట్టుకునే శక్తి సన్నగిల్లి అయోమయ పరిస్థితి ఏర్పడక తప్పదు, తత్ పరిణామాలను అనుభవించక తప్పదు. అలాంటివి గ్రామాలలో పెద్దల దృష్టిలో పడకుండా జాగ్రత్త పడక తప్పదు. ఇలా జీవితంలో ఒక్కో వ్యక్తికి, ఒక్కో రకమైన అనుభవం వుండి తీరుతుంది. ఈ నేపథ్యంలో నా భయంకర అనుభవాన్ని మీ ముందు ఉంచడమే, ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.

***********

అవి నేను మానుకోట తాలూకా ఆసుపత్రిలో 1982-94, మధ్య కాలంలో దంతవైద్యంలో అసిస్టెంట్ సివిల్ సర్జన్ గా పని చేస్తున్నరోజులు. చక్కని ప్రదేశం, మంచి మనసున్న మనుష్యులు, ఇటు పల్లె కాకుండా, అటు---పట్నం కాకుండా , బ్రతకడానికి చక్కని అనుకూలమైన ప్రదేశం. తాజా కూరగాయలు, రకరకాల పళ్ళు, నాణ్యమైన బియ్యం, సహృదయులైన మనుష్యులు, ఉద్యోగస్తులకు చక్కని అనుకూలమైన ప్రాంతం అది. ఒకవైపు ఖమ్మం మరో వైపు వరంగల్లు , రక్షకభటుల్లా వుండి, వీటి మధ్య ప్రశాంతమైన, జీవనానికి పెట్టింది పేరుగా ఉండేది. ఇంచుమించు ముఖ్యమైన రైళ్లు అన్నీ అక్కడ ఆగేవి. అలాంటి ప్రదేశంలో ఉద్యోగం చేస్తూ, పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లలు కలిగి ఆనందంగా కాలం గడుపుతున్న రోజులు. అప్పటికి నా శ్రీమతికి ఇంకా ఉద్యోగం వచ్చినట్టు లేదు. అప్పుడు మార్వాడీ వీధిలో రైసుమిల్లు ఎదురుగా తిరుమలరావు గారి ఇంట్లో ఉండేవాళ్ళం. ముందు గది డ్రాయింగ్ రూమ్ కం, క్లినిక్ గా ఉండేది. దానిని ఆనుకునే పడక గది ఉండేది. ఆ రోజు ఆదివారం అనుకుంటాను.

మధ్యాహ్నం డ్రాయింగ్ రూంలో కూర్చుని వ్యాసం రాసుకుంటున్నాను. అప్పుడు ప్రాంతీయంగా, మిత్రులు ఉబేద్ సంపాదకుడిగా, ' వార్తాలహరి ' అనే తెలుగు వార పత్రిక వచ్చేది. దానికోసం పిల్లల దంతసంరక్షణ గురించి సీరియల్ గా రాస్తూండేవాడిని. అదే తర్వాత కాలంలో 'చిన్నపిల్లలు-దంత సమస్యలు' అని పుస్తక రూపంలో వచ్చింది. నేను సీరియస్ గా వ్యాసం రాసుకుంటున్న సమయంలో, బెడ్ రూంలో కూర్చుని ఏదో పని చేసుకుంటున్న నా శ్రీమతి మెల్లగా దగ్గుతోంది. దగ్గు-జలుబు, ఆమెను తరచుగా పలకరిస్తుండేవి. ఆ దగ్గు అలాంటిదేననుకుని, నా పనిలో నిమగ్నమై వ్యాసం రాసుకుంటున్నాను.

దగ్గు క్రమక్రమంగా ఉదృతం అవుతోంది, ఆమె వంక చూడకుండానే ' కాస్త మంచినీళ్లు తాగరాదా ! ' అన్నాను. ఆమె మంచినీళ్లు తాగి వచ్చిన విషయం ఆమె వంక చూడకుండానే గమనించాను. కానీ, దగ్గు తగ్గుముఖం పట్టలేదు సరికదా ఇంకా ఉధృతమైంది. రాస్తున్న కాగితాలు పక్కన పడేసి ఆమె దగ్గరకు వెళ్లాను. దగ్గుతుంది, ఆయాస పడుతుంది గానీ తన బాధను నాకు చెప్పడం లేదు. కానీ అప్పటికే నా శ్రీమతి ముఖం ఎర్రగా అయిపొయింది. వళ్ళంతా ఎర్రగా కమిలిపోయినట్టు దద్దుర్లు, చాలా భయంకరంగా మారింది పరిస్థితి. నా వాళ్ళు ఝల్లుమంది. సంఘటన నుండి కొంచెం వెనక్కి వెళితే, ఆమెకు తలనొప్పి వస్తే బ్రూఫెన్ బిళ్ళ ఇచ్చేవాడిని. దానితో ఆమెకు వెంటనే ఉపశమనం లభించేది.

అప్పట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ లు, ఫిజీషియన్ శాంపిల్స్ పుష్కలంగా ఇచ్చేవాళ్ళు. అందుచేత ఆరోజు కూడా, తలనొప్పి అనగానే, బ్రూఫెన్ బిళ్ళ ఒకటి ఇచ్చాను. దాని ఫలితం విపరీతమైన రియాక్షన్. ఇక ఏమీ ఆలోచించకుండా , ఉన్నఫళంగా, ఇంటికి తాళం కూడా వేయకుండా, నా శ్రీమతిని, పిల్లలని, స్కూటర్ మీద ఎక్కించుకుని ఆగ మేఘాల మీద డాక్టర్ గారి దగ్గరకు వెళ్లాను. మహబూబాబాద్ ఆసుపత్రికి మొదటిసారి ఎం.డి, డాక్టర్ వచ్చారు. ఆయన నా సహోద్యోగి. ఆయన పేరు చెప్పకపోతే అది ఇక్కడ నేరం అవుతుంది. ఆయన డా.లక్ష్మీరాజం గారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి పోస్టింగ్ ఆయనకీ. ఆయన ఆసుపత్రికి వచ్చిన తర్వాత బయటికి కేసులు రిఫర్ చేయవలసిన అవసరం బాగా తగ్గిపోయింది. అతికొద్ది సమయంలోనే చాలా మంచి పేరు తెచ్చుకున్న ప్రభుత్వ ప్రజా వైద్యుడాయన. అదృష్టవశాత్తు, ఆరోజు ఆయన ఇంట్లోనే వున్నారు. నా వేషమూ, నా కంగారూ చూసి ఆయన వెంటనే పరీక్ష చేయడం మొదలు పెట్టారు. పరిస్థితి ఆయనకు అర్ధం అయింది. ఆయన చికిత్స మొదలు పెట్టారు. ఆయన నాతొ మాట్లాడకుండానే వైద్యం చేస్తున్నారు. నా శ్రీమతి పరిస్థితి మరీ అద్వాన్నంగా తయారయింది. కూర్చోలేక పోతున్నది, నిలబడలేకపోతున్నది. పడుకోలేకపోతున్నది. దీనికి తోడు ఏదో గైనిక్ సమస్య కూడా మొదలైంది. తెలిసిన స్త్రీ వైద్య నిపుణుడికి ఫోన్ చేస్తే ఆయన ఆపరేషన్ థియేటర్ లో సర్జరీ చేస్తున్నట్టు తెలిసింది. పరిస్థితి అయోమయంగా తయారయింది. డాక్టరు గారి కదలికల్లో మార్పు వచ్చింద. నాకు అనుమానం మొదలై చెప్పలేని వ్యధ ప్రారంభమైంద. అయినా డాక్టర్ గారు నాతో మాట్లాడడంలేదు. నిశ్శబ్దంగా చేయదలచుకున్న వైద్యం చేస్తున్నారు. ఆయన సొమ్ముతోనే, రకరకాల మందులు రప్పిస్తున్నారు. ఏమీ చేయలేని పరిస్థితిలో పిల్లలను దగ్గర పెట్టుకుని ఓమూల కూలబడ్డాను. క్షణాలు, నిముషాలు, గంటలు, సమయం గడిచిపోతుంది.

సాయంత్రానికి ఎలర్జీ తగ్గుముఖం పట్టింది. డాక్టర్ గారి ముఖం వెలిగింది. అప్పటి వరకూ నాతో ముచ్చటించని ఆయన 'నౌ వుయ్ ఆర్ సేఫ్ డాక్టర్ సాబ్ ' అన్నారు. నా శ్రీమతి తేరుకున్నాక ఆయన అన్నారు 'నేను చాలా భయపడ్డాను' అని. అప్పటి వరకూ సమస్య తీవ్రత నాకు తెలియలేదు. అప్పుడు నా వళ్ళంతా చెమటలు పట్టాయి. చాలా భయం వేసింది. ఈ జ్ఞాపకం నిరంతరం నామనస్సులో మెదులుతూనే ఉంటుంది. మరచిపోయే విషయమా, నా శ్రీమతికి పునర్జన్మ ఇచ్చిన డాక్టర్ గారిని సదా స్మరిస్తూనే వుంటాను.

ఉపసంహారం: పెన్సిలిన్, టెస్ట్ డోస్ ఇచ్చినప్పుడు నెగెటివ్ వచ్చినంత మాత్రాన ఎప్పటికీ నెగెటివ్ వస్తుందనే నియమము, భరోసా ఏ మాత్రమూ లేవు. అలాగే టాబ్లెట్స్ కూడా! అందుకే వైద్యుల సలహా లేకుండా ఎంత చిన్న టాబ్లెట్ కూడా వాడ కూడదు, అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల షాపు వాళ్ళు మందులు అమ్మకూడదు!!