ఉయ్యలవాడ నరసింహారెడ్డి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ఉయ్యలవాడ నరసింహారెడ్డి.

ఉయ్యలవాడ నరసింహారెడ్డి.
మరణానికి భయపడితే జీవించలేం అని నిరూపించిన శౌర్యవంతుడు నరసింహారెడ్డి 18వ శతాబ్దపు తొలిదినాల్లో రాయలసీమలో పాలెగాళ్ళ వ్యవస్ధ ఉండేది. కడపజిల్లాలోనే 80మందిపాలెగాళ్ళు ఉండేవారు. నిజాము
నవాబు రాయలసీమప్రాం తాలను బ్రిటీష్ వారికి అప్పగించడంతో పాలెగాళ్ళు బ్రిటిషు ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. బ్రిటీష్ ప్రభుత్వం వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాల ఏర్పాటు చేసింది.
ఉయ్యలవాడ గ్రామం ఇప్పటి కర్నులు జిల్లాలో ఉంది. ఉయ్యలవాడకు పాలెగాడుగా నరసింహారెడ్డి తండ్రి పెదమల్లారెడ్డిఉండేవాడు.నరసింహారెడ్డితాతగారు, నొస్సం
జమీదారు చెంచుమల్ల జయరామిరెడ్డి నిస్సంతు కావడంతో నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నాడు. తండ్రి తరపున నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే తాతగారైన, జయరామిరెడ్డి నిస్సంతుగా మరణించాడనే నెపంతో అతనికి ఇస్తూ వచ్చిన భరణాన్ని మరణంతోరద్దుచేసింది బ్రిటిషుప్రభుత్వం.నరసింహారెడ్డి
కర్నులు జిల్లాలోని రూపనగుడి గ్రామములో జన్మించి , ఉయ్యలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడని జానపద వీరగాథల వలనతెలుస్తుంది.ఇతను కడప, కర్నులు, అనంతపురం, బళ్ళారి జిల్లాలలో 66 గ్రామాలకు అధిపతి. రూపనగుడి, ఉయ్యలవాడ, ఉప్పులూరు, గుళ్లదుర్తి, కొత్తకోట మొదలైన గ్రామాలలో ఇతను నిర్మించిన కోటలు, నగరులు ఈనాటికీ ఉన్నాయి.
నరసింహారెడ్డి తల్లి నీలమ్మ ఉయ్యాలవాడ నగరికాపు పెదమల్లారెడ్డి రెండవ భార్య. ఈమె నొస్సం జమీందారు చెంచుమల్ల జయరామిరెడ్డి చిన్న కుమార్తె. నరసింహారెడ్డికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య సిద్దమ్మ వలన కొడుకు దొరసుబ్బయ్య జన్మించాడు. రెండవ భార్య పేరమ్మ వలన ఒక కుమార్తె, మూడవ భార్య ఓబులమ్మ వలన ఇద్దరు కుమారులు జన్మించారు.
నరసింహారెడ్డి దగ్గర ఓబళాచార్యుడు అనే ఆస్థానకవి ఉండేవాడు. కర్నూలు ప్రాంతంలో ప్రసిద్ధికెక్కిన కృష్టిపాటి వేంకటకవికవితో ఓబళాచార్యునికి నస్యం పై సంభాషణాత్మకంగా జరిగిన రెండు పద్యాలను వేటూరి ప్రభాకర శాస్త్రి తమ చాటుపద్యమణిమంజరిలో ప్రస్తావించాడు. ఒకానొక సమయంలో వేంకటసుబ్బయ్య కవి నరసింహారెడ్డి ఆస్థానానికి రాగా, రెడ్డి అతనిని సత్కరించి, కావ్యగానం ఒనర్చవలసిందిగా ప్రార్ధించాడు.
1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు అనుచరుణ్ణి కోయిలకుంట్ల ఖజానాకు పంపగా, అక్కడి తహసిల్దార్, ఆ వ్యక్తిని తిట్టి, నరసింహారెడ్డి వస్తేనే ఇస్తాను పొమ్మనడంతో రెడ్డి తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి తాతయ్య జయరామిరెడ్డి కాలములోనే అనగా క్రీ.శ.1800 లోనే అంగ్లేయులు నొస్సం సంస్థానమును లోబరుచొకొని, ఈ రాజవంశానికి నెలకు 11 రూపాయలు భరణం ఏర్పాటు చేసారు. సా.శ. 1845 వరకు ఈ భరణం నరసింహారెడ్డికి చెల్లించడం జరిగింది. ఆసంవత్సరం నరసింహారెడ్డి తనకు రావలసిన భరణం కొరకై కోయిలకుంట్ల తహసిల్దారుకు తన భటునుని (కొందరు భటునుని కాక తన కొడుకు దొరసుబ్బయ్యను పంపాడని చెబుతారు) పంపాడు. ఆ తహసిల్దారు అది ఇవ్వకుండా నరసింహారెడ్డి పై దుర్భాషలాడాడు. ఆ భటుడు ఉయ్యాలవాడకు పోయి జరిగిన విషయం తెలిపాడు. అది విన్న నరసింహారెడ్డి అటువంటి అవమానం భరించటం కంటే చావే మేలు అని తలిచాడు. అదే భటునితో నేనే వస్తానని తహసిల్దారుకు కబురుపంపాడు.
మాన్యాలు పోగొట్టుకున్న ఇతర కట్టుబడి దారులు రెడ్డి నాయకత్వంలో చేరారు. వనపర్తి, మునగాల, జటప్రోలు, పెనుగొండ, అవుకు జమీందార్లు, హైదరాబాద్కు చెందిన సలాం ఖాన్, కర్నులు చెందిన పాపాఖాన్, కొందరు బోయలు, చెంచులు కూడా నరసింహారెడ్డితో చేరినవారిలో ఉన్నారు.
1846జూలై10 న రెడ్డి 500 మంది బోయసైన్యమును తీసుకొని, పట్టపగలు కోయిలకుంట్ల పట్టణముపై దండెత్తాడు. తహసీల్దారుని పట్టి, తలను నరికి, ధనాగారములో ఉన్న బొదెలవాడు హరిసింగు ను చంపి, దానిని దోచుకొని, కచ్చేరీ అంతటినీ దగ్ధం చేసి తహసిల్దారు శిరస్సును, హర్సింగు శిరస్సును తెచ్చి నొస్సం దగ్గరనున్న నయనాలప్ప కొండ లో గల ఒక శివాలయం గుహలో దాచాడు. కడపలో ఉన్న కలెక్టరకు, పోలీసు సూపరిండెంటుకు ఈ హత్యా విషయం తెలిసి, అన్వేషణ ప్రారంభించారు. వారు రెడ్డిని ప్రశ్నించగా రెడ్డి తనకేమీ తెలియదని తెలుపగా, బహుశ ఔకరాజగు నంద్యాల నారాయణరాజును, వారి బంధువు నంద్యాల వెంకటరమణరాజును బంధించి కారాగారములో ఉంచారు.
అపరాధ పరిశోధకులు తరువాత శివాలయములో ఉన్న శిరస్సులను కొనుగొన్నారు. రెడ్డి గారి అనుచరులగు గోసాయి వెంకన్న, ఒడ్డె ఓబన్న అనువారిని బంధించి నిజానిజాలను తేల్చారు.
బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. రెడ్డిని పట్టి ఇచ్చినవారికి వేయిరూపాయల బహుమానాన్ని బ్రిటిషు ప్రభుత్వం ప్రకటించింది. అటుపై, నరసింహారెడ్డి వేల కొలది సైన్యములను సమకూర్చుకొని గిద్దలూరు దగ్గర వాట్సన్‌ తో ఘోర యుద్ధం చేసాడు. సైన్యాన్నంతటినీ నష్టపోయిన రెడ్డి, నల్లమల కొండలలోనికి తప్పించుకొని పారిపోయాడు. ఆంగ్లేయులు ఆతనిని కనిపెట్టటానికి ప్రయత్నాలు చేశారు, కాని ఫలించలేదు.
తరువాత జూలై 23న మరలా కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి, తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారద్రోలాడు. నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదుచేసింది ప్రభుత్వం. వారిని విడిపించుకునేందుకు కడప చేరాడు రెడ్డి. 1846అక్టోబర్ 6 నల్లమల కొండల్లోని పేరు సోమశిల వద్దగల జగన్నాథాలయంలో ఉన్నాడని తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించదలచాడు.నరసింహారెడ్డి వద్ద ఒక వంటమనిషి ఉండెడెది. బ్రిటీషువారు ఆమెకు లంచమిచ్చి నరసింహారెడ్డిని పట్టుకొన్నారు. ఆవంట మనిషి నరసింహారెడ్డికి విపరీతముగా సారాయి పట్టించి ఆతని తుపాకీలో నీళ్ళు పోసి ఉంచినదట. ఆసమయములో నరసింహారెడ్డిని బంధించి కోయిలకుంట్లకు తెచ్చారు.నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెట్టారు. వీరిలో 412 మందిపై నేరం రుజువు కాలేదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెట్టారు. 112 మందికి 14 నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ్డాయి. కొందరికి ద్వీపాంతర చెరసాల శిక్ష విధించారు. వారిలో ఔకు రాజు తమ్ముడొకరు.
కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధించాడు. 1847 ఫబ్రవరి 22 వతేదిన ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీసింది బ్రిటిషు ప్రభుత్వం. విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచారు.
వీరులు మరణిస్తారేమో కాని వారు దేశభక్తుల గుండెల్లో సదా చిరంజీవులే.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.