మొక్కపాటి నరసింహ శాస్త్రి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మొక్కపాటి నరసింహ శాస్త్రి.

మొక్కపాటి నరసింహ శాస్త్రి.
వీరు 1892 అక్టోబర్ 9న తూర్పు గోదావరిజిల్లా గండ్రేడు లో గ్రామంలో మహాలక్ష్శి,పేరిశాస్త్రి దంపతులకు జన్మించారు.బందరులో ఇంటర్ వరకుచదివి ఆతరువాత స్కాట్ లాండ్ దేశంలో 1913 -1917 మధ్యకాలంలో తన చదువు కొనసాగించారు.1925లో ప్రచురితమైన వీరి బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. బారిష్టర్ పార్వతీశం హాస్యానికి పెట్టింది పేరు.
ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది ఓడలో ఇంగ్లండు చేరుకొన్న పార్వతీశం ఓడలో
చిక్కిన స్నేహితుడి వల్ల స్కాట్‌లాండ్లో ఎడిన్‌బరా నగరంలో ఒక ఇంట్లో పేయింగ్ గెస్టుగా చేరుతాడు. ఒక లా కళాశాలలో చేరుతాడు. ఆంగ్లం కూడా రాని పార్వతీశం ఏకసంధాగ్రహి క్రింద అన్ని విషయాలు ఒక్కసారి చెప్పడంతో గ్రహించి అందరి మన్ననలు పొందుతాడు. ఒక స్నేహితురాలిని ఆసక్తికరమైన సన్నివేశం ద్వారా పొందుతాడు. హాస్యం పాళ్ళు ఈ భాగంలో తగ్గినా ఈ భాగం రసవత్తరంగానే ఉంటుంది. ఈ భాగం చివరి అంకంలో బారిష్టర్ పాసై ఇంటి ప్రయాణం పట్టుతాడు. తన స్నేహితురాలు వదిలి వెళ్ళే సన్నివేశాన్ని మొక్కపాటి నరసింహశాస్త్రి గారు చాలా చక్కగా చిత్రించారు.
మూడవ భాగం ముఖ్యంగా ఇంటివచ్చాక తనని ఇంటి వారు ఏవిధంగా స్వీకరించారు అనే విషయాలు, అప్పటి సాంప్రదాయల ప్రకారం బయటి దేశం నుండి వచ్చిన వారు ఎదుర్కొనే సంఘటనలు చిత్రించారు. ఇంగ్లాండు నుండి వచ్చాక గ్రామంలో ఉన్నవారు అడిగే వివిధమైన విచిత్ర ప్రశ్నలు చాలా అసక్తికరంగా ఉంటాయి. తరువాత పెళ్ళి, న్యాయశాస్త్ర ప్రాక్టీసు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడం, ప్రకాశం పంతులు గారిని కలవడం, తాను సంపాదించిన సంపదను స్వాతంత్ర్యోద్యమానికి ధార పోయడం, పలు మార్లు జైలుకి వెళ్ళడం అనే విషయాలు ఉంటాయి. హాస్యం పాళ్ళు ఈ భాగంలో మరింత తగ్గుతుంది.ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.'బారిష్టర్ పార్వతీశం' .ఒక ప్రముఖుని (పోలాప్రగడ సత్యనారాయణ మూర్థి) మాటలలో........ "ఒక రోజు కళాశాల నుంచి ఇంటి కొచ్చే సరికి మా ఇంటి అరుగు మీద వాలు కుర్చీలో కూర్చొని మా పిల్లలకి కథలు చెప్తూ నవ్విస్తున్నారు.. బారిస్టర్ పార్వతీశం నవలా రచయిత మొక్క పాటి నరసింహ శాస్త్రి గారు. కుశల ప్రశ్నలు అయింతర్వాత వచ్చిన పని చెప్పారు."వాడెవడో చెప్పితే నమ్మి ఐదు వేల కాపీలేశాను బారిస్టర్ పార్వతీశం. పది హేనేళ్లయింది. ఇంకా పదిహేను వందల పుస్తకాలు మిగిలి వున్నాయి. ఈ వూళ్లొ నాలుగైదు హైస్కూళ్లున్నాయంట గదా.... ఒక్కొక్క ఉన్నత పాఠశాల ఇరవై అయిదు చొప్పున కొన వచ్చట. అంతా కొంటే వంద పుస్తకాలు ఖర్చు అవుతాయి. కాపి రూపాయా పావలా... రేప్పొద్దున వెళ్లి ఒక్కొక్క హెడ్మాస్టర్ ను కలుసు కోవాలి. పని ఎంత వరకు అవుతుందో? "...... నాకు చాల బాధ కలిగింది. బారిస్టర్ పర్వతీశం అంటే ఒక హాస్య మహా కావ్యం. దాన్ని అమ్ముకోడానికి రచయిత ప్రతి ఉన్నత పాఠశాలకూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా యాచించడమా?"ఎన్ని పుస్తకాలు తెచ్చారు" అనడిగాను."వంద. అంటే నూట పాతిక రూపాయిలవి""మీరెక్కడికి వెళ్లకండి. అవి అమ్ముడయే మార్గం నేను చూస్తాను" అన్నాను. ఆ మర్నాడు ఒక తెల్ల కాగితం మీది ఒక ఆహ్వాన పత్రికను రాశాను ఇలా. "మొక్క పాటి వారు వచ్చారు. వారి బారిస్టర్ పార్వతీశం నవల వారి సంతకం తో ఇస్తారు. పుస్తకం వెల ఎంత వున్నా పుస్తకం తీసుకున్నవారు మాత్రం వారికి పది రూపాయలివ్వాలి. జేబులో పదేసి రూపాయిలేసుకొని రేపు సాయింత్రం ఆరు గంటలకి స్థానిక లైబ్రరి దడాబామీద జరిగే భావపురి రచయితల సమావేశానికి రావలసింది" అంటూ ఒక విద్యార్థికి ఆ కాగితం ఇచ్చి వూళ్లో వున్న లెక్చరర్లు, ప్లీడర్లు, ఉద్యోగులు, విద్యావంతులు ఇతర పుర ప్రముఖులలు చూపించి, వారు చూసి నట్లు సంతకాలు చేయించుకొని రమ్మని పంపించాను.కాగితం మీద సంతకాలయితే అరవై మంది చేశారు. కాని సభకు వచ్చి మొక్క పాటి వారి సంతకంతో వున్న నవలని పదిరూపాయిలిచ్చి తీసుకోడానికి, ఆయన ఉపన్యాసం వినడానికి నూట పది మంది వచ్చారు. పుస్తకాలు వందే వుండడం వల్ల పది మందికి ఇవ్వలేక పోయాము. కాని రచయితకి గంటలో వెయ్యి రూపాలొచ్చాయి. అదీ ఎలా? భక్తి ప్రవుత్తులతో సంర్పించినవి. మొక్క పాటి వారు ఎంత సంతోషించారో.... నా చేతులు పట్టుకొని " నూట పాతిక వస్తే చాలనుకున్నాను. కాని వెయ్యి రూపాయిలొచ్చాయి.... నీ వల్లనే" అన్నారు. క్షమించండి ఇది నావల్ల గాదు, బాపట్లలో వున్న రసజ్ఞుల వల్ల ... ఒక మంచి గ్రంథాన్ని ... రచయిత చేతుల మీదుగా తీసుకోవాలనే అకాంక్ష వుండడం వల్లా....... ఇది వీరందరి రసజ్ఞత.. సంస్కారమూను.." అన్నాను. అదే ఈ రోజుల్లో అయితే సాద్యమేనా? ????????........
పిఠాపురం ఆస్థానంలో దివానుగా ప్రసిద్ధులైన మొక్కపాటి సుబ్బారాయుడు వీరి సహోదరుడు.
వీరు ఇంకా గాజుపాళెంగాంధీ,బండసుబ్బడు,ఏకోదరులు,ప్రతిబింబాలు,
పిలక!భిక్షువు,శిల్పద్వయము,విన్నవి కన్నవి,మొక్కుబడి,మిస్ మనోహరి,సుబ్బరాయుడు,సత్యంవధ,పెదమామయ్య,అనశ్వరం,హాస్యరసం,గాంధీ-నేటివరూధిని,మనప్రముఖ హాస్య రచయితలు,బారిష్టర్ గారి బాతాఖాని వంటి పలురచనలుచేసారు. బారిష్టర్ పార్వతీశం నవల సినిమాగా వచ్చింది. జి.వరలక్ష్శి లంకా సత్యం గార్లు ఇందులో నటించారు. ఈ కవి1973 మార్చి5న తుదిశ్వాసవిడిచారు.