కొండా లక్ష్మణ్ బాపూజి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

Konda Laxman Bapuji

కొండా లక్ష్మణ్ బాపూజి.
బాపూజీ, స్వాతంత్ర్య సమరయోథుడుగా, డిప్యూటీ స్పీకరు, మంత్రివర్యులు, మచ్చలేని ప్రజాసేవకుడు అయినవీరు 1915 సెప్టెంబర్27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో బాపూజీ, అమ్మక్క దంపతులకు జన్మించారు. 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తల్లి మరణించింది. మేనత్త గంగమ్మ పెంచారు. రాజురామానికి ఘర్ లో బాల్యం గడిచింది. ప్రాథమిక విద్యాబ్యాసం ఆసిఫాబాదులో, న్యాయశాస్త్ర విద్య హైదరాబాదులో పూర్తిచేశారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు. బాపూజీ భార్య శకుంతల. ఈమె వైద్యురాలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. ఒక కుమారుడు భారత సైన్యంలో వైమానిక దళంలో ఉంటూ దేశసేవలో వీరమరణం పొందినారు.

1940లో న్యాయవాద వృత్తి చేసేటప్పుడు బాపూజీ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసేవారి తరఫున వాదించి కేసులను గెలిపించేవారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దేశమంతటా ప్రజలు ఆనందోత్సవాలలో పాల్గొంటున్ననూ, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య అకృత్యాలకు లోనై ఉండటాన్ని చూసి విమోచనోద్యమంలో పోరాడినారు. 1947 డిసెంబరు 4న నిజాం నవాబుమీద బాంబులు విసిరిన నారాయణరావు పవార్ బృందంలో కొండా లక్ష్మణ్ కూడా నిందితుడే. ఆజ్ఞాతంలో ఉండి ప్రాణం కాపాడుకున్నారు.

హైదరాబాదు సంస్ధాన్ లో పౌరవిమోచనోద్యమంలో 1938మొదటిసారి అరెస్టుఅయ్యారు. 1941- 1942 ఖద్దరు ఉద్యమంలో,1942 లో క్విట్ ఇండియా ఉంద్యమంలో పాల్గొన్నారు. 1948లో భారత ప్రభుత్వం నిజాంపరిపాలనపై పోలీస్ యాక్షన్ ప్రకటించిన సమయంలో సాయుధ పోరాట భాగస్వాములైయ్యారు. పౌర శిక్షణ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులైనారు. 1948జూన్ 25 వీరిని నిజాం పోలీసులు అరెస్టు కు ప్రయత్నించగా అజ్ఞాతంలోనికి వెళ్ళారు.1952లో బాపూజీ తొలిసారిగా ఆసిఫాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైనారు. 1957లో చిన్నకొండూరు నుంచి విజయం సాధించి అదే సంవత్సరం శాసనసభ డిప్యూటి స్పీకరుగా ఎన్నికయ్యారు. 1962లో స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అయితే ప్రత్యర్థి పాల్బడిన అక్రమాలపై కేసువేసి విజయం సాధించారు.

1967లో భువనగిరి నుంచి విజయం సాధించారు. కాసు బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తూ 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. 1972లో భువనగిరి నుంచి ఎన్నికయ్యారు. 1973లో పి.వి.నరసింహారావు తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారింది. ఇందిరాగాంధీ ఒప్పుకున్ననూ అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ జలగం వెంగళరావు పేరు ప్రతిపాదించి ఆయన్ను ముఖ్యమంత్రి చేశారు. 1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదృశ్యం నిర్మించుకున్నాడు. 2002లో చంద్రబాబు ప్రభుత్వం దాన్ని నేలమట్టం చేయగా కోర్టు తీర్పు బాపూజీకి అనుకూలంగా వచ్చింది. ఆయన అంత్యక్రియలు 22-09-2012 నాడు జలదృశ్యంలో జరిగింది.

 

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - Amayaka Prajalu
కాశీ ప్రయాణ కథలు - అమాయక ప్రజలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Akashayanam lo anagarikatha
ఆకాశయానంలో అనాగరికత (వ్యాసం)
- మద్దూరి నరసింహమూర్తి
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - prathubhaku Pattam
కాశీ ప్రయాణ కథలు - ప్రతిభకు పట్టం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు