మనగ్రామ దేవతలు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

మనగ్రామ దేవతలు .

మన గ్రామదేవతలు .

మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు. బహుజన సంస్కృతి పరిరక్షకులు. సమాజంలోని బడుగు కులాల వారు కూడా అగ్రకులాలతోపాటు సమానంగా సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవటం ఈ గ్రామదేవతల జాతర ల వల్ల సాధ్యమయ్యింది. ప్రాచీనకాలంలో పురాతన మానవునిచే పూజింపబడ్డ దుష్ట గ్రామ దేవతలు కూడా కాలక్రమేణ శిష్ఠ దేవతల్లో కలిసి పోవడం జరిగింది. అయితే పూజా విధానంలో, గుళ్ళ నిర్మాణంలో గ్రామ దేవతలకు, శిష్ఠ దేవతలకు తేడాలు స్పష్ఠంగా కనిపిస్తున్నాయి. నిశితంగా పరిశీలిస్తే గ్రామ దేవతల పూజా విధానంలో కొన్ని శిష్ఠ దేవతల పూజా విధానాలు సమ్మిళితమై పోయాయని చెప్పక తప్పదు. అదే విధంగా శిష్ఠ దేవతల పూజా విధానాలు కొన్ని గ్రామ దేవతారాధనల్లో చోటు చేసుకున్నాయనుట సత్యం. గ్రామ సం రక్షణ కోసం యేర్పాటు చేసుకున్న గ్రామ దేవతల లక్షణాలు కొన్ని విలక్షణంగా ఉంటాయి. మచ్చుకు కొన్ని...

గ్రామదేవత భయంకర స్వరూపిణి. అంతేకాదు వికటదంత. బలిని తీసుకోవడం, రక్తపానం, ఆసవసేవనం ప్రీతికరాలు. గ్రామదేవత గ్రామాళ్ళో వేపచెట్లక్రింద, త్రాచుపుట్టలలోపల నెలకొని ఉంటుంది. తనను నిర్లక్ష్యం చేసిన జానపదులను పట్టి పీడించి రోగాలపాలు చేయడంలో ఈమెకు పట్టుదల మెండు. గ్రామాలను పరిరక్షించడం, చెలరేగిన వ్యాధులను అదుపులో ఉంచడం, తనను నమ్ముకొన్న పశువులను జానపదులను యీతి భాధలు, గ్రహ బాధల నుండి శత్రువుల నుండి రక్షించడం యీవిడ నిత్యకృత్యాలు.ఊరి పొలిమేరలను, పంటపొలాలను, చెరువులను, నీటి వనరులను కాపాడుట యీమె కర్తవ్యం. గ్రామదేవతల పూజార్లు, బ్రాహ్మణేతరులై వుంటారు. గ్రామదేవతల పూజార్లకు సంస్కృత మంత్రాలు రావు. ఆ మంత్రాలన్నీ ఆయా ప్రాంతీయ భాషల్లో వుంటాయి. గ్రామదేతల పూజాలను స్త్రీలు కూడా చేస్తారు.

గ్రామదేవతల స్వరూప స్వభావాలను అనుసరించి, పుట్టుక స్వభావాలను బట్టి ఒక్కొక్క తెగవారు పూజారిగా వుండటం జరుగుతొంది. చాలావరకు గ్రామదేవతలు చిన్న రాయిగానో, శూలంగానో చెట్టు రూపంలో గాని, గరగగా గానీ దర్శనమిస్తుంటారు. చౌడమ్మ, యెల్లమ్మ, దుర్గమ్మ వంటి దేవతలు భయంకర స్వరూపులుగా కనిపిస్తారు

శిష్ట దేవతల స్వారూపాలు.

ఈ దేవతల లక్షణాలు భిన్నాంగా ఉంటాయి. వీరి స్వరూపం ప్రసన్నంగా ఉంటుంది. వీరిని అన్ని కులాలవారు పూజిస్తారు. సామాన్యంగా శిష్ఠదేవతలకు బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు. వీరు అంతటా వ్యాపించి వుంటారు. వీరి స్తోత్రాలు సంస్కృత మంత్రాలతో మిళితమై ఉంటాయి.

గ్రామదేవతల గుళ్ళు ఊరిపొలిమేరల్లో, పంటపొలాలమధ్య, చెరువు గట్లలో, వేపచెట్లక్రింద ఉంటాయి. నాలుగు బండ రాళ్ళను చేర్చి చతురస్రాకారంలో గుడి నిర్మిస్తారు. గ్రామదేవతలకు ప్రతిరూపమైన గరగను, వేపమండలను జోడించి దేవతలముందుంచి పూజిస్తారు. శక్తి దేవతల గుళ్ళు సామాన్యంగా అన్నీ తీరాల్లో ఉంటాయి. ఇవి శాస్త్రానుసారంగా నాగర్, ద్రావిడ, వేసర శైలిలో నిర్మింపబడి ఉంటాయి. ఇందులో దేవతా మూర్తులను శాస్త్రోక్తంగా, నియమానుసారంగా ప్రతిష్ఠించి ఆరాధిస్తారు. వీరి గుళ్ళు విశాలంగా, ఆర్షణీయంగా వుంటాయి. గోపురాల మీద శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది. సాధారణంగా ప్రతి దేవత గుడికి పుష్కరిణి ఉంటుంది. శిష్ఠ దేవతల గుళ్ళు గ్రామదేవతల గుళ్ళ కంటే కొంచెం భిన్నంగా కనిపించినా, కొన్ని సామాన్యంగా కనిపిస్తాయి.

గ్రామదేవతల గుళ్ళు సామాన్యంగా తూర్పు వైపు ద్వారం కలిగి ఉంటాయి. సూర్యుని కిరణాలు గర్భగుడిలో విగ్రహం మీద పడాలనే వుద్దేశ్యంతో తూర్పు వైపు ద్వారం కల్గి ఉండేలా గుళ్ళను నిర్మిస్తారు. శిష్ఠ దేవతల గుళ్ళు కూడా తూర్పువైపు మహాద్వారం కలిగి ఉంటాయి. గ్రామదేవతల గుళ్ళు చతురస్రాకారంలో కానీ, దీర్ఘచతురస్రాకారంలో కానీ ఉంటాయి. శిష్ఠ దేవతల గుళ్ళుకూడా అలాగే ఉంటాయి. చతురస్రాకారం స్థిరత్వానికి ప్రతీక. గుండ్రని ఆకారం అస్థిరత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అందువలన్ గుళ్ళు గుండ్రనివి కాకుండా వుంటాయి.

గ్రామదేవతలు శిష్ఠదేవతల పూజల్లో పోలికలు.

గ్రామ దేవతల, శిష్ఠదేవతల పూజాపద్ధతులను పోల్చి చూస్తే శిష్ఠులు గ్రామదేవతల పూజాపద్ధతులను కొన్నింటిని తమలో మిళితం చేసుకొన్నట్లుగా గమనిచవచ్చు. శిష్ఠులు రావి, తులసి, వేప వంటి వృక్షాలను ఆరాధిస్తారు. గ్రామదేవతల గుళ్ళవద్ద ఈ నాటికి రావి, వేప, తులసి చెట్లను జానపదులు పూజించడం చూస్తున్నాము. శిష్టులు నదులను ముఖ్యంగా గంగ, యమున, సరస్వతీ నదులను పవిత్రంగా భావించి పూజించడం కనిపిస్తుంది.

శిష్ఠ దేవతలకు, గ్రామదేవతలకు మతపరంగా, సాహితీపరంగా కొన్ని కాలాలపాటు ప్రచ్ఛన్నగా యుద్దాం జరిగివుండవచ్చు. గ్రామదేవతల ఆధిపత్యం వుండే విధంగా శిష్టులు రచనలు సాగించారు. ద్రావిడులు సఫలతను ఆశించి స్త్రీ దేవతను పూజించడం వీరిమధ్య స్పర్థలకు కారణాలని చరిత్ర చెబుతోంది. కొన్ని ద్రావిడ సంప్రదాయాలు శిష్ఠుల ఆచార వ్యవహారాల్లో కిలిసిపోయినట్లుగా, శిష్టుల ఆచార వ్యవహారాలను మతపద్ధతులను తమలో జీర్ణించుకొన్నారు. అయితే తమ మతాన్ని మాత్రం విడువలేదు. కాలానుగుణంగా తమ దేవతలను పూజిస్తూ, శిష్ఠ దేవతలను పూజించడానికి అలవాటు పడ్డారు. ఈ మార్పిడిలో భాగంగా పురాణాల్లోని ఆచార వ్యవహారాలను, నమ్మకాలను జానపదుని దైనందిన జీవితంలో భాగాలయ్యాయి. ఫలితంగా ద్రౌపది జానపదుని మదిలో శక్తి స్వరూపిణిగా స్థిరపడింది ( చిత్తూరు జిల్లాలోని ద్రౌపదమ్మ తిరుణాల ఇందుకు నిదర్శనం)

శిష్ఠ సంప్రదాయానికి విరుద్దంగా పురాణాల్లో ఈమె ఐదు మందికి భార్య కాని ఈమెలో ఉన్న శక్త్యంశం జానపదున్ని బాగా ఆకట్టుకుంది. అందుకే జానపదులు పాండవుల కంటే ద్రౌపదినే యెక్కువగా పూజిస్తారు. శిష్ఠులచే కొలవబడుతున్న సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఆంజనేయుడు, నవ గ్రహాలు లాంటి దేవతలు పురాణ పఠనంవల్ల జానపదుని మతంలో చోటు చేసుకుని పూజలందుకొంటున్నారు. కురబ జాతివారు శివున్ని, బసవన్నని పూజిస్తారు. షికారీలు తమ కులదైవమైన వెంకటేశ్వరునికి మాంసాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. ఇక్కడ ద్రావిడ దేవతలు శిష్టులచే పూజింపబడుతూ శిష్ఠ దేవతలై జనపదాలలో ఆరాధింపబడుటను గమనించాలి.

శిష్ఠ సాహిత్యంలో గ్రామదేవతల ప్రభావం కనిపిస్తోంది. మహా భారతంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు అర్జునుడు దుర్గను స్తుతిస్తాడు. ఈమె భయంక రూపం కలిగి, దున్నపోతు రక్తం, యుద్ధమంటే ఎక్కువ ఇష్ఠపడుతుందని అర్జునుడు ప్రశంశిస్తాడు. అలాగే ధర్మరాజు మరో చోట ఈమె ఆయుధాలు కలిగి జంతుబలితో తృప్తిపడి భక్తులకు విజయాన్ని చేకూరుస్తుందని స్తుతిస్తాడు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో వీరబ్రహ్మంగారు గ్రామదేవతైన పోలేరమ్మను చుట్ట కాల్చేందుకు నిప్పు తెమ్మని ఆఙ్ఞాపిస్తాడు. శూద్రకుని మృచ్ఛకటికం నాటకంలో నాయకుడైన చారుదత్తుడు ప్రతిదినం గ్రామదేవతకు బలి యిచ్చేవాడని తెలుస్తోంది. రామాయణ కాలంలో నాగులకు తల్లిగా చెప్పబడే సురస అనే దేవత కనిపిస్తుంది. ఈమెను కామరూపిణి అని కూడా పిలిచేవారట. రామాయణంలో హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నాప్పుడు నీటిలో సింహిక అనే దేవతను చూస్తాడు. ఈమె సముద్రం మీదుగా వెళ్ళేవారిని చంపుతుండేదట. అలాగే రావణుని రాజ్యమైన లంకను ఒక రాక్షస దేవత కాపాడుతున్నట్లు చెప్పబడింది.

ఈ విధంగా గ్రామదేవతల సాంప్రదాయ పూజా విధానాలు కొన్ని శిష్ఠ దేవతల సంప్రదాయాలలోనికి, శిష్ఠ దేవతల సంప్రదాయాలు కొన్ని గ్రామ దేవతల సంప్రదాయాలలోనికి కలిసి పోవడం జరిగింది. అయితే కాలగమనంలో నాగరికత పెరుగుతున్నకొద్దీ జానపదులు శిష్ఠ మతపద్ధతులను, ఆచార వ్యవహారాలను తమకు తెలియకుండానే అనుసరిస్తున్నారు.

గ్రామస్థులను చల్లగా చూస్తూ, అంటు వ్యాదుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, గ్రామాన్ని భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే దేవత

గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం. మానవుడు నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాల్ని చవి చూస్తున్నాడు. మరో వైపు తన లక్ష్య సాధనకోసం ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూల కారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు, ఆమెను సంతృప్తి పరచేటందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించాడు. అందులో ప్రార్థన, మంత్రతంత్రాలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి.

గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.

ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు కచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.

దేవతల ఆవిర్భావము.

పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.

పృధ్వీ దేవత.

పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్ఠించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు. జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత ఉంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉంది.

జల దేవత.

జలానికి సంబంధించిన తల్లి గంగమ్మగంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.

అగ్ని దేవత.

మూడవది తేజస్సు (అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).

వాయు దేవత.

నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.

ఆకాశ దేవత.

ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.

పోషణ, రక్షణ నిచ్చే దేవతలు. విశాఖ జిల్లాలో ఒక గ్రామ దేవత ప్రతిరూపాలు పూజింపబడుతున్నవి

ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ

క్రమముగా ఈమె 'తలుపులమ్మ'గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామంలోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది. ఇక పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ' అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది.

గ్రామదేవతా నామ విశేషాలు.

సాధారణంగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే క్రమముగా అది 'మావుళ్ళమ్మ' అయింది. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా అంకగళమ్మ అంకాళమ్మ మారిపోయింది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న)అమ్మ పుల్లమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= అప్పలమ్మ అన్నారు. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= పెంటమ్మ. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో బోనముల (భోజనమనే పదానికి విక్రుతి)+అమ్మ= బోనాలమ్మ. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల పిలుస్తారు. లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= గుర్రాలమ్మ అయినది. ఇక ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ='సోమపోలమాంబ' అన్నారు. సోమప్రోలు అనే గ్రామం ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.

పార్వతే అమ్మోరు (అమ్మవారు)గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం. ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అనీ వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజనీ అంటారు. వారిలో కొందరు...

పాగేలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతెమ్మ, సత్తమ్మ, తాళ్ళమ్మ, చింతాలమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టాలమ్మ, దాక్షాయణమ్మ,

పేరంటాళ్ళమ్మ, రావులమ్మ, గండి పోచమ్మ, మొగదారమ్మ, ఈరినమ్మ, దండు గంగమ్మ ( పెదబ్రహ్మదేవం సామర్లకోట మండలం) దుర్గమ్మ, మొదుగులమ్మ, నూకాలమ్మ (అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా, కాకినాడ, సామర్లకోట, కాండ్రకోట (పెద్దాపురం), చింతలూరు తూర్పుగోదావరి జిల్లా), మరిడమ్మ, నేరెళ్ళమ్మ, పుంతలో ముసలమ్మ (మొయ్యేరు,అత్తిలిదగ్గర,ప.గోజిల్లా), మాచరమ్మోరు, మద్ది అనపమ్మోరు, సోమాలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలక్క (అంతర్వేది, తూ.గో.జిల్లా) (గుర్రాలమ్మ), అంబికాలమ్మ, దనమ్మ, మాలక్ష్మమ్మ, ఇటకలమ్మ, దానాలమ్మ, రాట్నాలమ్మ, తలుపులమ్మ (తుని, తూ.గో.జిల్లా), పెన్నేరమ్మ, వెంకాయమ్మ, గున్నాలమ్మ, ఎల్లమ్మ (విశాఖపట్నం), పెద్దమ్మ, మంటాలమ్మ, గంటాలమ్మ, సుంకులమ్మ, జంబులమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వనువులమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనికమ్మ, ధారాలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోసాలమ్మ, పళ్ళాలమ్మ (వానపల్లి, తూ.గో.జిల్లా), ధనమ్మ, జోగులమ్మ, పైడితల్లి, చెంగాళమ్మ, రావులమ్మ, బూరుగులమ్మ, కనకమహాలక్ష్మి (విశాఖపట్టణం), పోలమ్మ, కొండాలమ్మ, వెర్నమ్మ, దేశమ్మ, గరవాలమ్మ, గరగలమ్మ, దానమ్మ, మహంకాళమ్మ, వీరుళ్ళమ్మ, మరిడమ్మ (పెద్దాపురం - తూర్పు గోదావరి జిల్లా) ముళ్ళమాంబిక, ఎల్లారమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, ముడియలమ్మ, పెద్దింట్లమ్మ, నంగాలమ్మ, చాగళ్ళామ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారలమ్మ, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ- పేరంటాళ్ళమ్మ, రంగమ్మ-పేరంటాలమ్మ, వెంగమ్మ-పేరంటాలమ్మ,తిరుపతమ్మ, రెడ్డమ్మ, పగడాలమ్మ, మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా), విశాఖపట్నంలో కుంచమ్మ, ఎరకమ్మ, పెద్దింట్లమ్మ.మసకపల్లి పామర్రు మండలం తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామదేవతలు గొల్లాలమ్మ, (పినపళ్ళ), చింతలూరు నూకాలమ్మ, మసకపల్లమ్మ, వెలగలమ్మ, ఉర్లమ్మ తల్లి (గణపవరం, కర్లపాలెం మండలం, గూంటూరుజిల్లా)పైళ్లమ్మ తల్లి, బళ్లమ్మ తల్లి, లోల్లాలమ్మ తల్లి, వూదలమ్మ తల్లి, కట్వలాంబిక,నాగాలమ్మ-నాంచారమ్మ తల్లి, సింగమ్మ తల్లి,ఘట్టమ్మ తల్లి, అంజారమ్మ తల్లి, కొట్లమ్మ తల్లి (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా), బర్రమ్మ తల్లి (పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా), బలుసులమ్మ తల్లి (తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా), వెంకమ్మ తల్లి ఖమ్మం, నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది.

సేకరణ.