ఘన చరిత్ర కలిగిన - ambadipudi syamasundar rao

ఘన చరిత్ర కలిగిన

అక్టోబర్ 15,1918 లో వి.వి శ్రేష్టి గారిచే ప్రకాశం జిల్లా వేటపాలెం లో స్థాపించబడిన సారస్వత నికేతనము అనే గ్రంథాలయం తెలుగు నాట ఉన్న అరుదైన మరియు పురాతనమైన గ్రంధాలయము మొదట్లో హిందూ యువజన సంఘం అనే పేరుతో ప్రారంభించారు శ్రేష్టి గారి తర్వాత అడుసుమల్లి శ్రీనివాసరావు పంతులు గారు దీని నిర్వహణ బాధ్యత చేపట్టారు. మొదటి నుంచి ప్రైవేట్ కుటుంబము చే ఏ విధమైన లాభాపేక్ష లేకుండా నిర్వహించబడటము ఈ గ్రంథాలయం ప్రత్యేకత. 1924 ఒక పెంకుటిల్లు ను స్వాధీనం చేసుకుని గ్రంథాలయాన్ని ప్రారంభించారు ఈ గ్రంథాలయాన్ని తర్వాత ‘సారస్వత నికేతనం’ అని నామకరణం చేశారు 1927 లో ఈ గ్రంథాలయం, 1927 సొసైటీ చట్టం క్రింద రిజిస్టర్ కాబడింది. ఇది ఆంధ్ర దేశంలోనే కాకుండా యావద్భారత దేశంలోని పురాతన గ్రంథాలయాలలో ఒకటి. మొదటి దశలో గాంధేయవాది, మహాదాత గోరంట్ల వెంకన్న గారు భూరి విరాళం ఇచ్చారు 1929 లో మహాత్మా గాంధీ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు,1930లో ఈ గ్రంథాలయం, జిల్లా కేంద్ర గ్రంథాలయం గా గుర్తింపు పొందినది.1935 బాబూ రాజేంద్ర ప్రసాద్, గ్రంథాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభాన్ని శంకుస్థాపన చేశారు. ఇదో జ్ఞాన మందిరంగా అభివర్ణింపబడింది .1936 గాంధీ గారు రెండోసారి ఇక్కడకు విచ్చేశారు దీని నూతన భవనాలను సేఠ్ జమ్నాలాల్ బజాజ్, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రారంభించారు ఈ గ్రంథాలయంలో 1942 గుంటూరు జిల్లా గ్రంథాలయాల సభ జరిగింది.అలాగే 1943 అంతర్జాతీయ సహకార ఉద్యమం, 1949లో 6వ దక్షిణ భారత యువత విద్యా సదస్సు జరిగినాయి 1950 జర్నలిజం కొరకు తరగతులు, వావిలాల గోపాలకృష్ణ ప్రధానాచార్యులు గా వ్యవహరించి, జరిపించారు.1985 RRLF, కలకత్తా వారిచే ఇవ్వబడిన మ్యాచింగ్-గ్రాంట్ సహాయంతో, క్రొత్త వింగ్ ను ఏర్పాటు గావించారు.

ఈ గ్రంథాలయం ఆంధ్ర ప్రదేశ్లో పరిశోధన అవసరాలు తీర్చే గ్రంథాలయాలలో ప్రముఖమైనది ఎందుకంటే ఈ గ్రంథాలయంలో చాలా అరుదైన పుస్తకాల కలెక్షన్ ఉంది వీటిలో పురాతనమైన తాళ పత్ర గ్రంథాలు, చేతి వ్రాత పుస్తకాలు హిందీ తెలుగు సంస్కృతం,ఇతర భారతీయ భాషలలో లో వ్రాసినవి సుమారు 90,000 దాకా ఉన్నాయి. కాబట్టి పరిశోధకులకు ఈ గ్రంథాలయం ఒక నిధి లాంటిది అని చెప్పవచ్చు తెలుగు సాహిత్య చరిత్రలో, చరిత్ర రచనలో ఎన్ని విధాలుగా ఉపకరించింది. ఇందుకు అసంఖ్యాకమైన ఉదాహరణలు ఉన్నాయి తెలుగులో తొలి యాత్రా చరిత్ర గా పేరొందిన ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర గ్రంథాన్ని 1940 ప్రాంతాల్లో మూడో సంకలనం కూర్పు చేసి పునర్ ముద్రించేందుకు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, పుస్తకప్రియుడు దిగవల్లి వేంకటశివరావు గారు ప్రయత్నించగా వేటపాలెం గ్రంథాలయం లో మంచి ప్రతి దొరికి పునర్ముద్రణ సాధ్యమైంది.

ఈ గ్రంథాలయంలో 1909 నుండి వార్తా పత్రికలూ మేగజైన్లు, పత్రికల విస్తారమైన సేకరణ( సుమారు 70,000) ఉండటం వలన దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి అనేక మంది పరిశోధకులు వచ్చి ఇక్కడే బస చేసి తమ పరిశోధనలకు గ్రంథాలయ వనరులను వినియోగించుకుంటున్నారు పాఠకుల సౌకర్యార్థం ఈ పుస్తకాలను వాటి కేటలాగ్ లను ఆన్ లైన్ లో లభ్యమయేటట్లు నిర్వాహకులు ఏర్పాటు చేశారు స్వాతంత్రోద్యమ కాలంలో ఈ గ్రంధాలయము యువతకు ప్రేరణ కలిగించే ముఖ్య ప్రదేశముగా మసిలేది

ఈ గ్రంథాలయం ప్రత్యేకతలు:- 2013 నాటికి ఈ గ్రంధాలయము;లో సుమారు 90,000 పుస్తకాలు ఉన్నాయి వీటిలో 60,000 తెలుగు, 20,974 ఇంగ్లిష్, 1,011 హిందీ, 302 ఉర్దూ 1687 ఇతర భాషల పుస్తకాలు ఉన్నాయి అంతే కాకుండా 121 తాళ పత్ర గ్రంథాలు,20 ప్రచురించబడని వ్రాత ప్రతులు కూడా ఉన్నాయి. రాజమండ్రి లోని గౌతమి గ్రంధాలయము తర్వాత పెద్ద గ్రంథాలయం ఇదే. ఈ పుస్తకాలలో 12 శతాబ్దం నాటివి కూడా ఉన్నాయి. గాంధీ ప్రసంగాలలోని సూక్తులు 100 వాల్యూములు ఉన్నాయి.విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఉపన్యాసాల ప్రతులు ఉన్నాయి. తాళ పత్ర గ్రంధాల పై రాయడానికి వాడే ఘంటము వెండి పూత కలిగినది ఈ గ్రంథాలయంలో ఉన్నది. అలాగే గాంధీ వాడే చేతి కర్ర ( విరిగింది ఉన్నది) 1947 లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి దినపత్రికల కలెక్షన్ ఈ గ్రంథాలయంలో ఉన్నది. తాళ పత్ర గ్రంధాల వ్రాత ప్రతులు ఉన్నాయి. ఇవి కాకుండా 1900 సంవత్సరానికి ముందు ప్రచురితం అయినవి 1943 ప్రాంతాన ప్రచురిచితము అయినవి 18,115 పుస్తకాలు ఈ గ్రంధాలయములో ఉన్నాయి

ఈ గ్రంధాలయము స్థాపించటానికి ముఖ్యోద్దేశం ప్రజలలో సాహిత్యము, వ్యక్తిత్వం, నీతి నిజాయితీ,దేశభక్తి ,మానవత్వము,భక్తి ప్రపత్తులు, దాతృత్వము వంటి లక్షణాలను పెంపొందించడమే. ఈ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన పుస్తకాలతో సంచార గ్రంధాలయాలను కూడా ఏర్పాటు చేశారు.వీటితో పాటు చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో రీడింగ్ రూమ్ లో బీద వారికి ఉచితంగా విద్యను బోధించటానికి స్కూళ్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే పల్లెటూళ్లలో ప్రముఖుల చేత ఉపన్యాసాలు ఇప్పించేవారు. అనతికాలంలోనే ఈ గ్రంధాలయ కార్యక్రమాలు స్వాతంత్ర్యోద్యమంలో ఒక మీటింగ్ ప్లేస్ గా ఏర్పడి యువతను దేశభక్తి కైపు మళ్లించింది ఫలితంగా ఈ సంస్థ ప్రముఖ నాయకులైన మహాత్మా గాంధీ, బాబు రాజేంద్ర ప్రసాద్, చిలకమర్తి నరసింహం.కాశీనాధుని నాగేశ్వర రావు, కట్టమంచి రామలింగ రెడ్డి గార్ల మన్ననలు ప్రశంసలు పొందింది.,అంతే కాకుండా దేశ విదేశాల నుండి సాహితీ ఆభిమానుల దృష్టిని కూడా ఆకర్షించింది. 2018 లో వందేళ్ల పండుగ కూడా జరుపుకుంది ఆ సందర్భంగా గ్రంథాలయ భవనం చిత్రముతో పోస్టల్ కవర్ ను కూడా విడుదల చేశారు రాజుపాలెపు వెంకట శేషగిరిరావు గారు కమిటీ ఆధ్వర్యంలో చివరి కార్యదర్శి అలాగే కె వి డి మల్లికార్జున రావు గారు అధ్యక్షుడు

.