
ఆధునిక కవితా క్రీడాభిరామం
ఆధునిక కవితా బృహత్సంహిత
జనోపయోగ మహా ప్రయోగ కావ్యం.
జనవంశమ్ (కావ్యకృతి) కవి: శేషేంద్ర
http://seshendrasharma.weebly.com
- సన్నిధానం నరసింహ శర్మ,
ఆధునిక మహాభారతము
అనుబంధ కావ్యం
జనవంశమ్
కావ్యకృతి
(చంపూవినోదిని, ఋతుఘోష, పక్షులు, పద్య కావ్యాలు,
తదనంతర వచన, గేయ, పద్య కవితలు)
మానవ సమాజంలో యుగయుగాన దీర్ఘకాలానంతరం ఐతిహాసిక కావ్యాలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. అవి తత్తద్యుగీన తత్త్వాన్ని ప్రదర్శించేవి. ఇతిహాసం యుగీనవాణి, పూర్వకాలంలో వచ్చిన ప్రతి ఇతిహాసానికి ఒక అనుబంధ కావ్యం ఉండేది – ప్రాచ్య దేశాల్లో గానీ పాశ్యాత్యదేశాలలో గానీ. వాల్మీకి రచిత రామాయణానికి ఉత్తరకాండ అనుబంధ కావ్యము. అట్లాగే వ్యాస మహాభారతానికి అనుబంధకావ్యం హరివంశమ్. ఇదేవిధంగా ప్రాచీనకాలంలో గ్రీసులో వచ్చిన జగద్విదితమైన హోమర్ విరచిత ఇలియడ్ అనే ఇతిహాసానికి అడిస్సీ అనుబంధ కావ్యం. ఇతిహాస కావ్యరచనా ప్రక్రియానుసారంగా ఆధునిక మహాభారతానికి అనుబంధకావ్యంగా ఈ జనవంశమ్ వచ్చింది.
*****
జనవంశమ్ ఆధునిక మహాభారతము కావ్యేతిహాసానికి అనుబంధ కావ్యం. ఆధునిక మహాభారతము పూర్తిగా వచనకవిత. జనవంశమ్ దీనికి భిన్నమైంది. ఇందులో ఛందోబద్ధ పద్యాలు, గేయాలు, పాటలు, వచన కవితలు, చమత్కారికలు అన్నీ ఉన్నాయి. భావతీవ్రత, అభివ్యక్తి ఉష్ణోగ్రత అదే స్థాయిలో ఉంటాయి. స్థాయీ భేదాలుండే వివిధ వర్గాల పాఠకులందరినీ తప్పక ఆకట్టుకునే మహాకావ్యం జనవంశమ్.
1. రుతువులు చెట్ల సుఖదుఃఖాలు
2. రచిత అక్షరం కంటే రాయే అతిశ్రేష్ఠము, సగటు మనిషి గతి చూస్తే ఇదే మనకు స్పష్టము
3. అడుగు నేలకు సైతం శాసనాల కంచె గట్టి నిలువ నీడ లేని దశను నెలకొల్పారంతటను.
4. ఇల్లనేది ఒక మహాగ్రంథం, సంపూర్ణ మానవుడి దేవాలయము.. ఇలా ఎన్నో ఖండికలు వైవిధ్యం విస్తృతికి అద్దం పడతాయి.
ఆధునిక మహాభారతము శ్రీ పవన్ కళ్యాణ్ అచ్చు వేయించగా, జనవంశమ్ ఆయన ఆప్తమిత్రుడు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అచ్చువేయించడం ఈ మహాకావ్యం ప్రత్యేకాకర్షణ.
*****
*****
నగరం ఒక చంబల్ వ్యాలీ
అరే ఈ దేశం మీకేమిచ్చింది
వంకరటింకర్లుగా వంగే దేహం
బానిసత్వం మీద వ్యామోహం
మీరెగరేశే జెండా మీకేమిచ్చింది
ఐదేళ్ళ కొకసారి ఓట్లు
ఆ మధ్యలో కునికిపాట్లు
*****
పత్రిక ముట్టుకుంటే చాలు పామైకరుస్తోంది
రోడ్డుతొక్కితే చాలు బజారుకాటేస్తోంది
సూర్యుడుదయిస్తే చాలు బతుకు ఉరితాడవుతోంది
ఓట్లుమేసి బలిసిన నాయకుడి ముందు
ఏనుగంతరూపాయ ఎలుకై సలాంచేస్తోంది
*****
ఇండియాలో కుక్కలన్నీ
ఏకగ్రీవంగా అరుస్తున్నాయి
మనిషి ఒక ఓటు
దేశం నరకానికి గేటు
గంగానది ఫ్యాక్టరీల శౌచాలయం
గోదావరి కులపిశాచాల లావానలం
అరే ఈవాళ నగరం ఒక చంబల్వ్యాలీ
గ్రామం దేశానికి కూలీ
*****
బాబూనీ చిన్ని కన్నీటి బిందువులో
ఏ సముద్రం గర్జిస్తోందో నాకు తెలుసు
అందుకే చెట్లతో మొరపెట్టుకుంటున్నాను
ఆకులు కాదు తుపాకులు కాయండని
- శేషేంద్ర
*****
ఆధునిక కవితా క్రీడాభిరామం
జనోపయోగ మహా ప్రయోగ కావ్యం.
జనవంశమ్ (కావ్యకృతి) కవి: శేషేంద్ర
- సన్నిధానం నరసింహశర్మ,
" వ్యాస మహర్షి మహాభారతానికి హరివంశమ్ లాగా, రామాయణానికి ఉత్తరకాండ లాగా, గ్రీసులో హోమర్ కావ్యం ఇలియడు అడిస్సీలాగా ఆధునిక మహాభారతానికి అనుబంధ కావ్యం ప్రజానుబంధ కావ్యంగా వచ్చింది ఈ జనవంశమ్. ఇది ఆధునిక జన ఇతిహాస కావ్యానుస రణం. జనవంశ కావ్యకర్త సుప్రసిద్ధకవి గుంటూరు శేషేంద్రశర్మ.
ఇదివరకే అచ్చయి వచ్చిన ఆధునిక మహాభా రతం, ఈ జనవంశమ్ తిరిగి అచ్చు వెలుగులు చూడడానికి చలనచిత్ర ప్రముఖులు ఇద్దరు కారకులు. మొదటిదాని ముద్రణ ధర్మకర్త చలనచిత్ర నటుడు పవన్ కల్యాణ్, రెండవ దానికి నిత్యనూతన ఆలోచనా ప్రయోగశీలి, దర్శకుడు త్రివిక్రమ శ్రీనివాస్ ముద్రణ ధర్మకర్త . సమీక్షా పరిధిలోకి రాకపోయినా వీటిని పేర్కొనడం దేనికంటే వీరిని ఆదర్శంగా చలనచిత్ర ప్రముఖులు తీసుకుంటే సత్కా వ్యాలు బయటికి వస్తాయి సత్కార్యాలు చేసిన వారూ అవుతారు. జనవంశమ్ జనోపయోగ మహా ప్రయోగ కావ్యం. ప్రజలకు అందుబాటులో ఉండే వచన కవిత్వమూ, విద్వాంసులకు లేదా కొద్దిపాటి సాహిత్య అధ్యయనపరులకు అందే పద్య కవిత్వమూ రెండూ అఖండాలై ఒక కవితా మయూరి పురివిప్పి చేసిన రసరమ్య నాట్యం ఈ కావ్యం.
ప్రజల కష్టసుఖాలు, వారి అభ్యుదయ ఆకాంక్షలు, పాలకవర్గ దుష్టచేష్టల విమర్శలు, స్నేహ మో హన 'సమ్' భాషణలు, ఉమర్ ఖయ్యం వంటి వారల భావపరంపరల వంటివి; ప్రాకృతిక అభివర్ణనలు, సమయసందర్భ దృశ్యమన రచనలు. ప్రముఖ కవి, పండిత గుణగానాలు, తాను చూసినవి, అనుభూతి చెందినవీ మనకు అందించడాలు ఇటువంటి అంశాలు కేళాకుశులై(ఫౌంటీన్స్) దర్శన మిస్తాయి ఈ కావ్యంలో.
ఆధునిక కాలంలో ఛందోబద్ధ పద్య ప్రక్రియా రంగంలో విశృంఖల క్రీడాకారులుగా ఉన్న కవులు శ్రీశ్రీ, గుంటూరు శేషేంద్రశర్మలు.
'తలకాయలు తమతమ జే
బుల లోపల వేసి కొనుచు
పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమోక్రసీకి సిరిసిరిమువ్వా'! అన్నారు శ్రీశ్రీ-
ఆయనే 'మళ్ళీ ఇన్నాళ్ళకు పద్యాలు రాయడం ఎటువంటిదంటే పళ్ళూడిన ముసలిది కుచ్చెళ్ళను సవరించుకోవడం వంటిది అన్నారు చమత్కారంగా. కానీ శ్రీశ్రీ పద్యరచన యువతి కుచ్చెళ్ళను సవరించుకొనే సొగసుగానే వుంటుంది. అది అలావుంచితే శేషేంద్రశర్మ వృత్త రచనల్లోనూ ఉత్తమ క్రీడాకారుడు అని ఈ కావ్య పద్యాల నిర్మాణాల, భావాలు పరుగులు చెబుతాయి. ఎన్నెన్ని పోకడలు, శక్తి ప్రాచీనం అభివ్యక్తి ఆధునిక ఇతివృత్తం ప్రజాక్షేమం.
ప్రకాశకీయం, ఋతుకాండ, భ్రమరకాండ, ప్రజాకాండ, చంపూకాండ, యుద్ధకాండ, చమత్కా రికకాండ అనే సప్తకాండల సమన్వితం యీ కావ్యం. ఈ కాండల కవితాఖండికల్లో అద్భుత భావాలు అలవోకగా రాస్తారు.
"పంచాంగాల్లో ఉండవు ఋతువులు/
జీవితాల్లో ఉంటాయి అరణ్యాల్లో ఉంటాయి.
చెట్టుచె ట్టునా ఉంటాయి.
రుతువులు చెట్ల సుఖ దుఃఖాలు; '
శుక్లపక్షం ఊదిన బుడగలా
తేలుతున్నాడు చంద్రుడు ఆకాశ నీలిమలో/
వసంత ఋతువంటే చెట్టులోనుంచి/
విరుచుకుపడ్డ విశ్వరూపం కాబోలు'
'ఈ రుతువులో సింహాసనం మీద ఉన్న రాజుకంటె/
కొమ్మమీద కూర్చున్న కోకిలే మన ప్రభువు-
ఇలా మనస్సును హరించే భావాలు పద చిత్రాల సంపదలుగా సొగసులీనుతాయి. ఋతు కాండలో ఈ ఆకాశం, సముద్రాలు, అందాల చెట్ల ప్రపంచం, విశ్వవైశాల్యం- ఇవన్నీ చూసి శేషేంద్ర శర్మ గారి ఊహా విహంగం ఎక్కడెక్కడికి ఎగిరిపోయి తన దర్శనాలు కవితా ప్రదర్శనశాలగా రూపొందిస్తుంది. ప్రకృతి సౌందర్యాల్ని చూపుతూ ప్రాకృతికంగా బ్రతకమని అన్యాపదేశంగా ప్రబోధిస్తారు.
'బరువులు మొయ్యలేని అవయవాలు పూలవి/
చిత్రం సౌందర్యం లోకపు అన్ని వస్తువులకంటే బలవాలి'; /
కొమ్మల్లో ఆ చైత్రమాస దేవత పాడే పాట విను/
జన్మలో వంచనాశిల్పం లేని పక్షుల్లా పువ్వుల్లా బ్రతుకు.../
నీకివ్వబడిన ఈ జీవితం/
స్వప్నాల్ని బాణాల్లా సంధించే ఇంద్రధనుస్సు'-
ఇలా భావరస వాక్యాలు రసజ్ఞ హృదయ తంత్రుల్ని మీటుతాయి. కొన్ని పద్యాలు నయాగరా జలపాత ప్రవాహవేగాల్లా ఉంటాయి.
భ్రమరకాండలో 'గగ నంలో ఎగిరే పక్షికి/
పాప పుణ్యాల చింతే లేదు/
భూమిమీద నడిచే మనిషికి పునర్జన్మ అంటే భయం
'అంటూ 'గాలి మబ్బుల్లో చేసిన చిరు నీలి చెలమలో/ చూడు ఒక నక్షత్రం నగ్నంగా స్నానం చేస్తోంది' అనే ఒక వాక్యంతో మన గుండెల్ని తడిమేస్తూ అసాధారణ భావుకతతో మనల్ని నిశ్శబ్దం లోకి తోసేస్తారు. నిజానికి కవిత్వాన్ని నిశితంగా తీసుకునేవాడికి ఎంత ఆనందమో అంత చింతనా బాధ కూడా కదా అనిపిస్తుంది. ప్రకృతినో, సౌందర్య సీమల్నో ప్రేమస్థానాల్నో పట్టించుకుని. ఆకా కవిత్వం రాసినంత మాత్రాన సమాజాన్ని, ప్రజాస మస్యల్నీ దూరంచేసుకోవలసిన అవసరంలేదని, వీటిని పట్టించుకుని తాదాత్మ్యచిత్తంతో రాసినంత మాత్రాన ఏ ప్రేయసి గురించో సౌందర్య సీమల గురించో రాయకుండా వుండనవసరం లేదని-
కవిత్వం మానవ బహుకోశం దర్శన సమగ్ర స్వరూపమని మానవ సహజీవనం లాగే కవి త్వంలో పద్యం, వచన కవిత్వం, కేవల వచనా గేయం అన్నీ సహజీవనం చేయవచ్చనీ ఈ జనవం శమ్ చెప్పక చెబుతుంది. అందుకే శేషేన్ 'నేను ఈ శతాబ్దపు శిథిలాల్లోంచి లేస్తున్న కవిని' అన్నారు.
మన ఋషుల వంటి కవి టి.ఎస్.ఇలియట్ జ్ఞానప్రయోగశాల అనుసరణం శేషేంద్రశర్మ కవి త్వంలో అటనట కన్పిస్తుంది. 'తన కన్నుల్లో నీరు తెచ్చుకునే వాడికంటే/ అన్యులకన్నుల్లో నీరుతెచ్చే వాడే కవి!/ ఒరే ప్రజలారా? నేను కవిని/ మీరు నాకు అప్పగించబడిన పిల్లలు/ మీ ముసలి నమ్మ కాలు మీ రక్తంలో/ భయాల్ని పొదుగుతున్నాయి/ మీ రక్తం పారబోసి నా కవిత్వం/ నింపుకోండి' అనం గలిగిన కవి ధీమా శర్మ గారిది. ప్రజల పట్ల కవికి వుండవలసింది పితృస్థానం అనడంలో ఎంత ఉదా త్తత! అందులో ఎంత బాధ్యత?
ప్రజాకాండలో 'మనమంతా భూమిపుత్రులం/ మనకు మాత్రం భూమి లేదు/ అంటారు. "దేశంలో రాజకీయ వాయుపీడనం చేత/ దేశభక్తిత రిగిపోయి దైవభక్తి పెరిగింది/ గుళ్ళమీద భక్తజ నులు గుంపులుగుంపులుగా దూకి/ చేసే భజనల దెబ్బకి శివుడో మాధవుడో ఎవడో/వాడి గూబగు య్యిమని ఏడుపు మొహమేస్తాడు' అంటారు. దాపరికం లేకుండా వుండే భావప్రకటన ఈ కవిది
ఆకాశాన్ని ఎదిరిస్తూలేస్తున్న బిల్డింగుల భయంకర స్వరూపాల ముందు నిలుచుండే మనిషి నలుసుగా కన్పడుతున్నాడని సోదర మానవ బాధ వ్యక్తంచేస్తారు.
'లక్షాతొంభయి కుంభకోణములు నిర్లక్ష్యంబుగా సల్పుచున్
కుక్షిన్ నింపెడు కుంభకర్ణులను భూగోళంబు గోళంబుగా
భక్షింపంగల బ్రహ్మరాక్షసులు శుంభద్గండ భేరుండముల్
పక్షీంద్రుల్ తమ జీర్ణశక్తి కవిగోబాబూ నమస్కారములొ
అనే ఈ ఒక్క పద్యం చాలు రాజకీయ పాలక దుర్మార్గుల పట్ల గుంటూరు వారికి గల కసికి తార కాణ. రాజకీయ నాయకులు ఎంత తిన్నా హరాయించుకోగలవారట అందుకే కవివారి జీర్ణశక్తికి నమస్కార సమర్పణ చేస్తున్నారు. జనవంశమ్ లోని అన్ని కాండలూ కవిత్వ అఖండ దీపాలు ప్రజావ్య తిరేకుల పట్ల యుద్ధకాండలే!
ఆంధ్ర మహాభారతంలో నన్నయ్యగారు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని అధ్యాత్మ విధులు వేదాం తమనియు అంటూ ఓ పద్యం భారతంలో ఇన్ని వున్నాయంటూ చెప్పారు. ఆ విధంగా శేషేంద్రశర్మ గారి ఆధునిక ఇతిహాస అనుబంధ కావ్యం ఈ జన వంశమ్లో ఎన్నో వున్నాయి.
ఇది ఆధునిక కవితా బృహత్సంహిత. కవిత్వప్రియులకు ప్రజాసంక్షేమ కవిత్వ ప్రియులకు దరిచేర వలసిన కావ్యం. ఒక రకంగా ఇది ఆధునిక కవితా క్రీడాభిరామం.