
తెలంగాణ రైతాంగ చరిత్రలో విశిష్టమైన మలుపు తిప్పిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి. ఆయన పేరు వినగానే కమ్యూనిస్టు ఉద్యమం, రైతాంగ హక్కుల కోసం సాగించిన సాయుధ పోరాటం, సామాజిక న్యాయం, స్వాతంత్ర్య సమరంలో ఆయన పాత్ర మనసుకు గుర్తుకొస్తాయి.
1908 జూన్ 4న ఉమ్మడి నల్లగొండ జిల్లా బొల్లేపల్లిలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్ననాటి నుంచే భూస్వామ్య దౌర్జన్యాలను చూశారు. స్వంత వర్గానికే చెందిన అన్యాయాలను ఎదిరించి, పేద రైతుల పక్షాన నిలిచి, పోరాట స్ఫూర్తి కలిగిన ధీరుడిగా గుర్తింపు పొందారు.
రెడ్డి హాస్టల్లో విద్యాభ్యాసం ప్రారంభించి, చాదర్ఘాట్ హైస్కూల్లో ఎస్.ఎల్.సి పూర్తి చేసి, నిజాం కాలేజీలో ఇంటర్ చదివారు. విద్యార్థి దశ నుంచే జాతీయోద్యమ ప్రభావం ఆయనలో ఆవిర్భవించింది. 1930లో బద్దం ఎల్లారెడ్డితో కలిసి కాకినాడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం ఆయన రాజకీయ జీవనానికి ఆరంభం.
మహాత్మా గాంధీ పిలుపు మేరకు బొల్లేపల్లిలో ఖాదీ కేంద్రాన్ని ప్రారంభించి, ఖద్దరు ధరించిన తొలి యువకుడిగా నిలిచారు. ఆర్థిక స్వావలంబన ద్వారానే జాతీయ విముక్తి సాధ్యమని ఆయన నమ్మకం. 1933లో హరిజన సేవాసంఘ కార్యదర్శిగా ఎన్నికై, అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు. వందకు పైగా పాఠశాలలు, రెండు హాస్టళ్లు స్థాపించి బడుగుజీవుల విద్యా విస్తరణకు శ్రమించారు.
1934లో గాంధీజీ హైదరాబాద్ వచ్చినప్పుడు, ఆయన భార్య సీతాదేవి తన నగలన్నీ అమ్మి స్వరాజ్యనిధికి విరాళంగా ఇచ్చిన సంఘటన వారి కుటుంబ దేశభక్తి భావాన్ని ప్రతిబింబించింది.
మూడుసార్లు ఆంధ్ర మహాసభ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన, నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో ముందుండేవారు. ముఖ్యంగా 1938లో కాంగ్రెస్పై నిజాం నిషేధాన్ని ఎత్తివేయాలని ఐదుగురు నాయకులు చేసిన సత్యాగ్రహంలో ఏకైక తెలుగు నాయకుడు ఆయనే.
తరువాత సోషలిస్టు రష్యా అభివృద్ధి ఆయనను ఆకర్షించింది. కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంతో రైతాంగాన్ని సమీకరించి, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. సుమారు మూడు వేల గ్రామాలను విముక్తి చేసి, లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసి భూమిలేని పేదలకు పంచడం ఆయన చరిత్రాత్మక కార్యం. అందుకే ఆయనను “రైతాంగ పోరాట పితామహుడు”గా గౌరవించారు.
1940వ దశకంలో హైదరాబాద్లో వ్యాధులు వ్యాపించినప్పుడు ప్లేగు నివారణ కమిటీలో పనిచేశారు. రైతాంగ పోరాటంలో తన స్వంత భూముల్లో 500 ఎకరాలు పేదలకు పంచిపెట్టి సమానత్వ సూత్రాన్ని ఆచరణలో చూపారు.
1952లో నల్గొండ పార్లమెంట్ స్థానానికి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయన విజయాన్ని గుర్తించి సత్కరించారు. నందికొండ ప్రాజెక్టు, నడికుడి రైల్వే జంక్షన్ సాధనలో ఆయన పాత్ర విశేషం.
1967లో స్వచ్ఛందంగా రాజకీయాలనుంచి వైదొలిగినా, ప్రజా ఉద్యమాలపై ఆసక్తి తగ్గలేదు. రాజకీయాలను వ్యక్తిగత లాభం కోసం కాదు, సమాజ పరివర్తన కోసం వేదికగా ఆయన చూశారు.
తన సిద్ధాంతాన్ని తుదిశ్వాసవరకు ఆచరించిన రావి నారాయణ రెడ్డి, దేశసేవకే జీవితాన్ని అంకితం చేశారు. భారత ప్రభుత్వం ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది.
రావి నారాయణ రెడ్డి జీవితం ఒక సమగ్ర పోరాటగాథ. స్వాతంత్ర్యం, సామాజిక న్యాయం, రైతాంగ విముక్తి అన్నీ ఆయన జీవనయాత్రలో కలిసిపోయాయి. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, రైతు బాట నడిచిన త్యాగనేతగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.