నందనాడుర్ .
గొప్ప శివ భక్తు . అతడు తమిళనాడులో ఆతనూర్ అనే చిన్న గ్రామంలో, ఒక దళితుల కుటుంబంలో జన్మించాడు. నందనార్ ఒక బ్రాహ్మణుడి దగ్గర పనికి చేరాడు.
తన స్నేహితులతో ఒక రోజు తన ఊరికి దగ్గరలో ఉన్న తిరుప్పున్కూరు అనే గుడికి వెళ్ళాడు. నందనార్ తక్కువ కులానికి చెందిన వాడు కావడం వల్ల, అతనికి దర్శనానికి వెళ్లే అనుమతి లేక పోయింది. నంది విగ్రహం అడ్డుగా ఉండటం వల్ల అతనికి దూరం నుండి దర్శనం కుదరలేదు.
ఎంతో ఆర్తితో నందనార్ శివుడిని దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించాడు. శివుడు నందనార్ భక్తికి ప్రసన్నలయ్యారు. అప్పుడు ఎదురుగా ఉన్న నంది పక్కకి తప్పుకుంది.
ఒక్క క్షణం శివుని దర్శనం చేసుకున్న నందనార్ ఎంతో ఆనందించాడు.
తిరుప్పున్కూరులో ఉండగా, నందనార్ చిదంబరం నటరాజ స్వామి గుడి ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాడు. ఆ ఆలయానికి వెళ్ళి స్వామిని చూడాలి అని ఎంతో తపన పడ్డాడు. స్నేహితులందరితో ఆ మరునాడే చిదంబర ఆలయానికి ప్రసన్నలయ్యారు స్వామి దర్శనం చేసుకుంటానని చెప్పాడు. కానీ అతనికి కుదరలేదు. అలా ప్రతి రోజూ ఆ మరునాడు తప్పక వెళ్తాను అని అంటూ ఉండేవాడు. దాంతో స్నేహితులందరూ అతనిని ఎంతో హేళన చేసేవారు. అతనిని ‘తిరు నాళై పొవార్ ‘ అని పిలిచేవారు.ఆంటే మరునాడు వెళ్ళే దివ్య పురుషుడని అర్ధం.
నందనార్ చిదంబరం గుడికి వెళ్ళడానికి ఒక రోజు సెలవ ఇమ్మని ఎంత గానో తన యజమానిని ప్రాధేయపడ్డాడు. మొత్తానికి యజమాని నందనార్ కి తక్కువ సమయంలో ఒక కష్టమైన పనిని పూర్తి చేయగలిగితే గుడికి వెళ్ళటానికి ఒక రోజు సెలవని ఇస్తానని చెప్పాడు.నందనార్ భక్తి ,విశ్వాసములకు మెచ్చి శివుడు ఆ పనిని తక్కువ సమయంలో పూర్తి చేయగలిగే శక్తిని అతనికి ప్రసాదించాడు. పని పూర్తి కాగానే నందనార్ ఎంతో ఉత్సాహంతో చిదంబర ఆలయానికి శివదర్శనానికి వెళ్ళాడు.
అతను దళిత జాతికి చెందిన వాడు కావడంతో గుడి లోపలి వెళ్ళటానికి భయపడ్డాడు. అక్కడ జరుగుతున్న హోమాన్ని దూరం నించి చూసి,వేద మంత్రాలను విని, గుడి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ నటరాజు స్వామిని దర్శించాలని ఎంతో ఆర్తితో గుడి చుట్టూ ఎన్నో సార్లు తిరిగి అలసిపోయి పడుకుండిపోయాడు.అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న నందనార్ కి శివుడు కలలో కనిపించి, అతనిని చితి మంటల మీద నడుచుకుంటూ, గుడిలోకి ప్రవేశించమని చెప్పారు.
అదే సమయంలో గుడిలో పూజారులకి చితి మంట సిద్ధం చెయ్యమని, శివుడు కలలో కనిపించి చెప్పారు ‘
మరసటి రోజు పూజారులు శివుని ఆజ్ఞ ప్రకారం చితి మంట సిద్ధం చేశారు.చితి వద్దకు నడిచి వచ్చిన నందనార్ ని చూసి అక్కడున్న పూజారులు అతని కోసమే శివుడు చితిని సిద్ధం చెయ్యమన్నారని తెలుసుకున్నారు.
నందనార్ శివుడి నామం చెప్పుకుంటూ , చితి మంటల లోకి దిగాడు . ఆ మంటలో దిగిన నందనార్ తిరిగి బంగారు ఛాయతో మెరుస్తూ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నందనార్ విభూతి నామాలతో జంధ్యము వేసుకున్న బ్రాహ్మణుడిలా కనిపించాడు. స్వర్గము నుండి దేవతలందరూ పూల వర్షము కురిపించి నందనార్ ని ఆశీర్వదించారు. అక్కడున్న పూజారులతో గుడిలోకి ప్రవేశించి ఆ నటరాజ స్వామిని దర్శించి,ఒక జ్యోతి రూపములో తన స్వామిలోనే ఐక్యమైపోయాడు.

