నిన్నటివన్నీ ఇప్పుడు అవసరం లేదు - వి. మూర్తి

yesterday things are not necessary today

కొన్ని ఆచారాలు, పద్దతులు ఎప్పటికీ అనుసరణీయం. మరికొన్ని కాలానుగుణంగా మార్చుకోవాల్సి వుంటుంది. విడిచి పెట్టాల్సి వుంటుంది. ఈ విచక్షణ లేకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. కొత్త ఇంటిలో గృహ ప్రవేశం అంటే ముందుగా ఆవును తిప్పాలని పెద్దలు అంటారు. అది అవసరమా? అనవసరమా? నేటికి సాధ్యమా? లాంటి సందేహాలు అనేకం వున్నాయి.

అసలు ఆవును ఎందుకు తిప్పాలో ముందుగా చూస్తే, ఇప్పుడు తిప్పాలో వద్దో డిసైడ్ చేసుకోవచ్చు.

పూర్వం మట్టి గచ్చులు వుండే కాలం,. ఎప్పటికప్పుడు పేడతో అలికి ముగ్గులు పెట్టుకునే కాలంలో పుట్టిన ఆచారం ఇది. అప్పట్లో ఆవు కొత్త ఇంట్లో తిరిగి పేడ వేసినా అలికేసుకోవడమే. పైగా ఉపయోగం కూడా. అయితే ఇక్కడ రెండు మంచి విషయాలు వున్నాయి,. ఒకటి ఆవును లక్ష్మీదేవికి చిహ్నంగా భావించడం హిందూ సంప్రదాయం. కొత్త ఇంట్లో తొలుత లక్ష్మీదేవి కాలు పెట్టాలన్నది దీని వెనక వున్న భావన. అంతే కాదు. కొత్త ఇంటిలో తొలిసారి అడుగు పెట్టినపుడు ఆడపిల్ల, నిండు బిందె నీటితో అడుగుపెట్టాలంటారు. అది కూడా లక్ష్మీదేవికి ప్రతి రూపమే. పూర్ణకుంభం అన్నమాట. ఇవన్నీ భావనలకు సంబంధించినవి. లాజిక్ లకు నిలిచేవి కావు. కానీ ఒక విషయం మాత్రం మెచ్చుకోవచ్చు. ఆవును కూడా కుటుంబ సభ్యులతో సమానంగా చూసి, కొత్త ఇంటిలోకి అడుగు పెట్టించడం.

ఇక వర్తమానంలోకి వస్తే, ఇప్పుడు ఇది ఎంతవరకు అవసరం? అపార్ట్ మెంట్ కల్చర్ పెరిగిపోయిన నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యం? కేవలం శాస్త్రం కోసం మూగ జీవాన్ని అంతస్తులు ఎక్కించడం సబబా? మూగజీవాన్ని ట్రక్ లో వుంచి, తీసుకువచ్చి, ఇబ్బంది పెట్టి పైకి ఎక్కించి, ఇంట్లో తిప్పితే శుభం ఎలా సాధ్యమవుతుంది. అంతకన్నా, గృహ ప్రవేశం సందర్భంగా ఓ పెడో, రెండు పెడలో అరటిపళ్లు కొని నాలుగు ఆవులకు తినిపిస్తే, ఆ పేరిట అన్నా అవి హాయిగా ఆరగిస్తాయి. ఆ భావన మనకూ శుభాన్నివ్వవచ్చు. కొన్ని పద్దతులు లాజిక్ కు నిలుస్తాయి. మరి కొన్ని మానసిక ఆనందాన్నిస్తాయి. ఇంకొన్ని కేవలం పాటింపు కోసమే వుంటాయి. ముందు అలాంటి వాటిని వదలాలి. మానసిక ఆనందం అన్నది ఎవరి వ్యక్తిగతం కాబట్టి వాటి విషయంలో ఎవరి ఇష్టం వారిది.. ఇక మిగిలినవి లాజిక్ కు నిలబడని వాటిని మాత్రం ఆలోచించి పాటించాలి.

మొన్నామధ్య రైలులో వెళ్తుంటే, గోదావరి నది రాగానే ఎదురు బెర్త్ పై అమ్మాయి కిటికీ కోసం చూసి, అది ఎసి బోగీ అని గుర్తుకు వచ్చి, గేటు దగ్గరకు పరుకెత్తింది. ఏం చేసి వచ్చారు అని అడిగాను. తెలిసి కూడా. గోదావరిలో ఓ నాణెం వదిలి వచ్చిందా అమ్మాయి. ఎందుకు వదిలినట్లు? ఎప్పుడో పెద్దలు చెప్పారు అంతే.

నిజానికి నది నీళ్లు, చెరువు నీళ్లు తాగే రోజుల్లో పుట్టిన ఆచారం అది. ఎందుకంటే ఆ రోజుల్లో రాగి నాణేలు వుండేవి. వాటిని నదుల్లో, చెరువుల్లో పడేస్తే ఆ నీటికి కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. అవి తాగిన వారికి మంచిదని. ఇప్పుడు రాగి పాత్రల్లో తాగమని చెబుతున్నారు కొందరు. దాని వెనుకు వున్న లాజిక్ ఇదే. మరి రాగి నాణేలు ఇప్పుడు లేవు. పైగా నదుల నీళ్లు, చెరువుల నీళ్లు తాగడం లేదు. మరెందుకు ఆ నికెల్ కాయిన్లను నీళ్లలోకి వదలడం? డబ్బులు దండగ. ఇలా లాజిక్ తో ప్రారంభించి, ఇప్పటి కాలానికి అందని వాటిని మాత్రం మొహమాటం లేకుండా వదలాలి. తప్పదు. కాలానుగుణంగా మారాలి.

మరిన్ని వ్యాసాలు

Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు
Kashi Prayana Kathalu - vikatakavi telivi
కాశీ ప్రయాణ కథలు - వికటకవి తెలివి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - Chaturaasrama Dharmmalu
కాశీ ప్రయాణ కథలు - చతురాశ్రమ ధర్మాలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు