సంక్రాంతి - హైమాశ్రీనివాస్.

sankranti
సంక్రాంతి అంటే ' సమ్యక్ క్రాంతి ' అని అర్ధం,  క్రాంతి అంటేమార్పు.సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం సాగించడం అన్నమాట. ' చక్షోజాయత ' అనే వేదసూక్తిని అనుసరించి మన దృష్టిని అంతర్ముఖం గావించుకుని నిర్మల, నిశ్చల ప్రశాంతమైన హృదయమనే  హిమాచలమునకు మన బుధ్ధిని పయనించ జేయాలి.

సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేసించినపుడు చేసుకుంటాం. సంవత్సర కాలంలో సూర్యుడు ఒక్కోనెలలో ఒక్కోరాశికి మారటం సక్రమణం.ఒకసం. కాలంలో పన్నెండు సంక్రమణాలన్నమాట.అన్నింటిలో మకరసంక్రమణం ముఖ్యమైనది. ఈరోజునుంచీ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది.

ఉత్తరం+ అయనం = ఉత్తరాయణం .

ఈ ఉత్తరాయణం దైవప్రార్ధనలకు, ఆధ్యాత్మిక సాధనలకు , స్వాధ్యాయానికీ, తీర్ధయా త్రలకూ ,వేదవిహిత సంస్కారాలకూ అనుకూలకాలం.   మానవుని బుధ్ధికి అధిదేవత  సూర్యుడు.వేదప్రమాణాన్ననుసరించి ' చంద్రమా మానసో జాతః ' , ' చక్షోసూర్యో అజాయతః ' అన్నారు. అనగా చంద్రుడు మనస్సుకు, సూర్యుడు దృష్టికి అధిదేవతలు. మనస్సు నిరంతరం ఇంద్రియాలవైపే పరుగెడుతుంటుంది.మనస్సుకు అధిపతి ఐన బుధ్ధిచేత మనస్సును నియంత్రించి, దృష్టిని హృదయం వైపు  మళ్ళించాలి. సంక్రాతిం పండుగ ప్రకృతిలో మార్పుకు సంబంధించింది.' దినకరుండు శాంతుడై తోచె -----సంక్రాంతి పండుగొచ్చెన్  '   అన్నట్లుగా సూర్యుడు ప్రశాంతంగా ఉండే సమయమిది. ఈ పండుగ మూడురోజులు చేసుకుంటాం.భోగి, సంక్రాంతి, కనుమ.  పాతవస్తువులన్నీ భోగిమంటలో వేసి భస్మ చేస్తాం. అలాగేమన దుర్భావాలనూ భస్మం చేయాలని సూచన. పసిపిల్లలకు భోగి పండ్లుపోయడం, పేరంటాళ్ళ సంబరాలూ , ఒకరి నొకరు పలుకరించుకోడం, అన్యోన్యత అన్నీ పెరుగుతాయి.సంక్రాంతినాడు తీపి పొంగలి చేసుకుని సూర్యునికి నివేదించి ప్రసాదం స్వీకరిస్తాం.   పితృదేవతలకు తర్పణం వదలడం ఆచారం.బ్రాహ్మణునికి గుమ్మడికాయదానం , స్నేహితులకు, బంధువులకూ బెల్లం నువ్వుల ప్రసాదం పంచడం, సంక్రాతి ప్రత్యేకత.కనుమ గోవుల పండుగ, దీన్నే పశువుల పండుగగా వ్యవహరిస్తాం.బొమ్మలకొలువు ఈపండుగ ప్రత్యేకత. బాలికలలోని అఙ్ఞాత కళాభిరుచి బయల్పడే విధంగా ఈ బొమ్మలకొలువులు తీర్చిదిద్దుతారు.

అంతాకలసి పేరంటాలకు వెళ్ళడం దేవతా మూర్తులను కీర్తిస్తూ పాటలు పాడటం , ముత్తైదువుల పాదాలకు పసుపురాయటం, మన భారతీయ సంస్కృతికి ప్రతీకలు.పండుగ నెలపెట్టి నప్పటినుంచీ అంటే ఒక నెలముందునుంచే అందమైన ముగ్గులు పెట్టి వాటిలో ఆవు పేడతో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరిస్తారు. హరిదాసులు, గంగిరెద్దులు ,ఇవన్నీ నేటి నగర సంస్కృతిలోనిపిల్లలకు తెలీని చిత్రాలు.సినిమాల్లో చూడటం తప్ప.గోపికలు  పరమాత్ముని నాధునిగా [ మానవులంతా స్త్రీలే, అనాధనాధుడైన పరమాత్మ ఒక్కడే నాధుడు]  వరించే కాత్యాయనీ వ్రతాన్ని ఈ సంక్రాతి నాడు ప్రారంభిస్తారు.అనగా శరీర ధారణ వలన , మనకంటిన చెడునంతా దూరంచేసుకుని పరమాత్మతో ఐక్యమయ్యే విధానమని అర్ధం.ఇంద్రియాలకు అధిపతి మనస్సు,మనస్సుకు అధిపతి బుధ్ధి, బుధ్ధికి అధిపతి ఆత్మ,సర్వాధిపతి ఐన ఆత్మకు తమను తాము అధీనం చేసుకోడమే కాత్యాయనీ వ్రత ఉద్దేశ్యం. దీనిలో ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక భావన చాలాగొప్పది .ఈ సంక్రాతి పండుగ సౌభాగ్యదాయిని.ప్రకృతిమాతకు, సూర్యునికి, గోలక్ష్మికి,  ధాన్య లక్ష్మికి, కృతఙ్ఞత తెలుపుకోడమే ఈ పూజల అంతరార్ధం.పండుగకు ముందుగానే తిరుప్పావై గానం చేసి , దైవయఙ్ఞం ఋషీయఙ్ఞం, పితృయఙ్ఞం చేసి , ఆకలిగొన్నవారికి తృప్తిగా భోజనాలుపెట్టడం మనుష్యయఙ్ఞం.ఇట్టిగొప్ప సంక్రాతిపండుగ సందర్భంగా అందరికీ శుభాలు జరగాలని కోరుకుందాం.

మరిన్ని వ్యాసాలు

లాక్డౌన్ స్మృతులు
లాక్డౌన్ స్మృతులు
- మండా. సూర్యనారాయణ
Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు