అమ్మాయిలూ అంతలా ఓపెన్‌ అయిపోవద్దూ.! - ..

girls be carefull

మేం వయసుకు వచ్చాం.. మా అందానికి ఆకాశమే హద్దు.. అని యువత చెలరేగిపోవడం మామూలే కదా. అందరూ కాదు కానీ, చాలా మందిది ఇదే పద్దతిప్పుడు. అమ్మాయిలూ, అబ్బాయిలూ స్నేహంగా మెలగడం ఈ క్రమంలో హద్దులు దాటేయడం గురించి ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఈ అతి చనువు చాలా అనర్ధాలకు దారి తీస్తోంది. స్నేహ సంబంధాలు శారీరక సంబంధాలుగా మారిపోతున్నాయి. పరస్పర అంగీకారంతో ఈ శారీరక సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే క్షణికావేశంలో చేసే తప్పులు కొందరి జీవితాలకు పెను శాపంగా మారుతున్నాయి. సీక్రెట్‌ కెమెరాలతో ఆ మధుర క్షణాల్ని చిత్రీకరించి ఆ తర్వాత బ్లాక్‌ మెయిల్స్‌కి పాల్పడుతున్నారు. ఈ దారుణానికి ఒడికడుతున్నది కేవలం అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా.

వయసొచ్చింది. ఎంజాయ్‌ చేసేశాం అని అప్పటికి దులిపేసుకుంటున్నారు కొంతమంది. కానీ ఈ తొందరపాటు ఆ తర్వాత పెళ్లిళ్లయ్యాక వారి వారి వైవాహిక సంబంధాల్ని అయోమయంలో పాడేస్తున్నాయి. బోయ్‌ ఫ్రెండ్‌తో మధుర క్షణాలు భర్తకు తెలిసిపోవడం, గాళ్‌ ఫ్రెండ్‌తో సరసాలు భార్యకు తెలిసిపోవడం, ఆ తర్వాత జరిగే పరిణామాలు వెరసి, నిండు జీవితాలు నిలువునా కూలిపోతున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక ఈ తరహా దారుణాలు ఇంకా ఎక్కువైపోయాయి. మాటలతో మొదలైన పరిచయాలు నగ్నంగా వీడియోలు తీసుకునేదాకా వెళ్తున్నాయి. బంగారం, బుజ్జీ, కన్నా.. అంటూ గోముగా పిలుస్తూ అటువైపు నుండి కావాల్సిన కంటెన్ట్‌ని రాబట్టేసుకుంటున్నారు. అవతలి వ్యక్తి పాతికేళ్ల కుర్రాడా? అరవై ఏళ్ల ముసలాడా? అని కూడా చూడట్లేదు. సేమ్‌ టు సేమ్‌ మహిళల విషయంలో కూడా ఇంతే. మహిళలూ, పురుషులూ, అబ్బాయిలూ, అమ్మాయిలూ విచ్చలవిడిగా తమ నగ్నత్వాన్ని స్మార్ట్‌గా షేర్‌ చేసేసుకుంటున్నారు.

దురదృష్టవశాత్తూ విదేశాల్లో ఇలాంటి పోకడలు తక్కువే. ఇటీవల కాలంలో మన భారతదేశంలో చాలా ఎక్కువ వెలుగు చూస్తున్నాయి. కొంప మునిగిపోయాక పోలీసులనాశ్రయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండడంతో సైబర్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆ కేసులపై ఎలా వ్యవహరించాలో అర్ధం కాక నానా తంటాలు పడాల్సి వస్తోంది. పరస్పర అంగీకారంతో ఇవి జరుగుతున్నాయి. మనస్పర్ధలు వచ్చాక పోలీసులనాశ్రయిస్తున్నారు. కేసుల పరిష్కారంలో బాధితులే నిందితులు అని కూడా తేలుతోంది. ప్రధానంగా యువత ఇలాంటి వైపరీత్యాలకు కారణమవుతున్నారు. తమ పిల్లల బాగోతం గురించి తెలుసుకుని తల్లితండ్రులు అవమాన భారంతో బలవన్మరణాలకు పాల్పడాల్సి వస్తోంది. కుటుంబాలు చితికిపోతున్నాయి. సంస్కృతీ, సాంప్రదాయాలు చాలా గొప్పవి. కానీ ఈ స్మార్ట్‌ మాయాజాలం మన వ్యవస్థను సర్వ నాశనం చేసేస్తోంది. స్మార్ట్‌గా ఉండడి. కానీ అంతలా ఓపెన్‌ అయిపోకండి. బీ కేర్‌ ఫుల్‌.!