ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

ఈ వారం ( 19/4-25/4 ) మహానుభావులు

జయంతులు

ఏప్రిల్ 19

శ్రీ చక్రవర్తుల నాగభూషణం :  “ నాగభూషణం “ గా ప్రసిధ్ధిచెందిన వీరు, ఏప్రిల్ 19, 1921 న అనకర్లపూడి లో జన్మించారు.   తెలుగు సినిమారంగస్థల నటుడు. తెలుగు సినిమాలలో ప్రత్యేకంగా సాంఘిక చిత్రాలలో ప్రతినాయకులకు గుర్తింపు తెచ్చిన నటుల్లో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన నటుడు. విలన్ చెప్పే డైలాగులకు కూడా క్లాప్స్ కొట్టించిన ఘనుడతను. 1962 లో “ మంచిమనసులు “ సినిమాతో గుర్తింపు సాధించి, రెండు దశాబ్దాలపాటు ఉజ్వలంగా ప్రకాశించారు.

ఏప్రిల్ 23

శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి:  వీరు ఏప్రిల్ 23, 1891 న పొలమూరు లో జన్మించారు.

20 వ శతాబ్దపు కథకుల్లో విశిష్టంగా చెప్పుకోదగ్గ రచయిత. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించారీయన. వీరు 75 కథలు రాసారు. ప్రముఖ వ్యావహారిక భాషావాది.

ఏప్రిల్ 24

  1. శ్రీ విస్సా అప్పారావు : వీరు ఏప్రిల్ 24 , 1884 న పెద్దాపురం లో జన్మించారు. ప్రముఖ భౌతిక శాస్త్రాచార్యులు.   మద్రాసు సంగీత ఎకాడమీ మూలస్థంభాలలో వీరొకరు.

 

2.శ్రీ నండూరి రామ్మోహనరావు : వీరు ఏప్రిల్ 24, 1927 న  ఆరుగొలను లో జన్మించారు. తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు. ప్రముఖ రచయిత కూడా.  “ నరావతారం “ , “ విశ్వరూపం “ వీరి ప్రముఖరచనలు.  జనసాన్యానికి సైన్సు, సులభ భాషలో అందచేసారు.

 

  1. శ్రీ ఏడిద నాగేశ్వరరావు :  వీరు ఏప్రిల్ 24, 1934 న తూ.గో.జి కొత్తపేటలో జన్మించారు.  ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. “ పూర్ణోదయా క్రియేషన్స్ “ నిర్మాణ సంస్థ ద్వారా ఎన్నో సినిమాలు నిర్మించారు. 1962 నుంచి 1974 మధ్య కాలంలో సుమారు 30 సినిమాల్లో నటించారు. వంద చిత్రాలకి పైగా డబ్బింగ్‍ చెప్పారు. 

వర్ధంతులు

ఏప్రిల్ 19

శ్రీ గిడుగు వెంకటసీతాపతి : వీరు ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త.  వీరి బాలసాహిత్యంలో ప్రాచుర్యం  పొందినది చిలకమ్మపెళ్ళి. వీరు రచించిన తెలుగు కావ్యాలలో ముఖ్యమైనవి: 'భారతీ శతకము', 'సరస్వతీ విలాసము', 'కొద్ది మొర్ర'. వీరు రాసిన 'బాలానందము' వంటి బాల సాహిత్య రచనలు విశేష ప్రజాదరణ పొందాయి.

వీరు ఏప్రిల్ 19, 1969 న స్వర్గస్థులయారు.

ఏప్రిల్ 20

శ్రీ మోపర్తి సీతారామారావు  “  MS  రామారావు గా ప్రసిధ్ధులు. తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన రామాయణ భాగం సుందరకాండము ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం. తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను తెలుగులోకి అనువదించి ఆకాశవాణిలో పాడారు. ఈ రెండూ ఈయనకు మంచి గుర్తింపును, ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

 వీరు ఏప్రిల్ 20,  1992 న స్వర్గస్థులయారు.

ఏప్రిల్ 24

శ్రీసత్యసాయిబాబా : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.  వీరిని  “ వేదాంతి “ “ భగవంతుని అవతారం “ అని ఎంతోమంది విశ్వసిస్తారు.

వీరు ఏప్రిల్ 24, 2011 న స్వర్గస్థులయారు.

ఏప్రిల్ 25

శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి :  అలనాటి తెలుగు సినిమా నటి, గాయకురాలు. తెలుగుతమిళకన్నడహిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించారు.. నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడంచేత ఆమె పాట కచ్చేరీలు తరుచూ చేస్తూండేవారు .వీరు ఏప్రిల్ 25, 2005 న స్వర్గస్థులయారు.

 

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు