గొల్లపూడి మారుతీరావు గారు ఇక లేరు - ..

know more
ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 250కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. మారుతీరావు 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు.
సంపాదకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన మాటల రచయితగా సినీ రంగంపైనా... వ్యాఖ్యాతగా బుల్లితెరరపైనా తనదైన ముద్రవేశారు. వక్తగా, కాలమిస్టుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించారు.

తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వ విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయనగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, సుబ్బారావులకి ఐదో అబ్బాయిగా మారుతీరావు జన్మించారు. విశాఖపట్నంలోని సీబీఎం ఉన్నత పాఠశాల, ఎ.వి.ఎన్‌.కళాశాలతోపాటు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు విద్యాభ్యాసం సాగింది. బీఎస్సీ (ఆనర్స్‌) పూర్తి చేసిన ఆయన 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత రేడియోలో ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఎంపికయ్యారు. హైదరాబాదు, విజయవాడల్లో పనిచేశారు. ఆ తర్వాత కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొందారు. సంబల్‌పూర్, చెన్నై, కడప కేంద్రాల్లో పనిచేశారు. 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలు పనిచేశారు. అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ హోదాలో పదవీ విరమణ చేశారు. చిరంజీవి కథానాయకుడిగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రానికి మాటల రచయితగా కూడా పనిచేశారు. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్‌ పేరున నాటక బృందాన్ని నడిపారు గొల్లపూడి. ఆడది, కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావాలు, నాటకాలకి నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు.. ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు. ఆ నాటకానికి పీవీ ఉపోద్ఘాతం రాశారట!|

విద్యార్థి దశలో ఉండగానే స్నానాలగది, మనస్తత్వాలు నాటకంలోనూ అభినయించారు. అప్పట్లో చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం వందేమాతరంని రచించి చిత్తూరు, మదనపల్లె, నగరిలలో ప్రదర్శించగా, వచ్చిన రూ: 50 వేలు నిధుల్ని ప్రధాన మంత్రి రక్షణ నిధికి అందజేశారు. ఆ నాటకాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖమంత్రి పి.వి.నరసింహారావు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959 డిసెంబరు 16న రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత పథర్‌ కే అన్సూ అనే పేరుతో హిందీలోకి అనువదించారు. 1963లో 'డాక్టర్‌ చక్రవర్తి' చిత్రానికి స్క్రీన్‌ప్లే రాశారు గొల్లపూడి. ఆయనకి అదే మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచయితగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డుని అందుకున్నారు. 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' తర్వాత నటుడిగా కూడా బిజీ అయిపోయారు. 250 చిత్రాలకిపైగా సహ నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. 'సంసారం ఒక చదరంగం', 'స్వాతిముత్యం', 'తరంగిణి', 'త్రిశూలం', 'అసెంబ్లీ రౌడీ', 'ముద్దుల ప్రియుడు', 'ఆదిత్య 369' తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నిర్వహించిన పోటీలకి సంబంధించిన జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించారు. జాతీయ చలన చిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్‌ పరిశీలన విభాగంలో పనిచేశారు.

మరిన్ని వ్యాసాలు

నయనాల నీలాలలో నిదుర.
నయనాల నీలాలలో నిదుర.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kaashi Prayana Kathalu - Anthima Pariksha
కాశీ ప్రయాణ కథలు - అంతిమ పరిక్ష
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
పల్నాటి యుధ్ధం.
పల్నాటి యుధ్ధం.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
కాటమ రాజు కథ.
కాటమ రాజు కథ.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Bhuvi nundi diviki
భువినుండి దివికి
- తాళ్ళూరి చంద్రశేఖర్
లాక్డౌన్ స్మృతులు
లాక్డౌన్ స్మృతులు
- మండా. సూర్యనారాయణ
Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు