నాన్న పచ్చి అబద్దాల కోరు - మహేశ్వరి గంటాల

nanna pachi abaddala koru book review

మంచిపుస్తకం ఓ మంచి స్నేహితుడితో సమానం  ఈ కవితాసంపుటి చదివాక ఇది నిజమే అనిపించడంలో ఆశ్చర్యం లేదు.

ముందుగా నిరుపేదలైన తన తల్లితండ్రులు తనని పనికి పంప కుండా తనని అక్షరాస్యుణ్ణి చేసిన వారి పాదపద్మములకు శిరస్సువంచి  అక్షరసుమాలతో సమర్పించిన నమస్సుమాంజలి వీరి విధేయత అభినందనీయం.సాహిత్యం అంటే ప్రాణమనీ, ప్రేమించేది అక్షరాలనే అంటూ ,పుస్తకాలే తన నేస్తాలు, ఆస్తులని సాహిత్యం మీద తన ఇష్టాన్ని చక్కగా చెప్పారు. అలాగే తన జీవిత భాగస్వామి ని పరిచయం చేస్తూ కుటుంబం మీద తన ప్రేమను చాటుకున్నారు.

మొదటి శీర్షిక అయిన "నాన్న పచ్చి అబద్దాల కోరు" చూడగానే అరె ఏంటీ ఇలా అనేశారే అనిపించింది. కానీ మన సంతోషాలను చూడడానికి నాన్న చెప్పె అబద్దాలు నాన్న డైరి చదివేదాక తెలియలేదంటూ మొదటి శీర్షిక లోనే కంటతడిపెట్టించారు.అమ్మకు చెప్పకురా అంటూ ఓ తండ్రి ఆవేదన,ఓ బిడ్డ స్వార్థాలను చూపించిన విధానం ఆలోచించేలావుంది.ఆడవాళ్ళు సమాజంలో  ఎదుర్కొంటున్న వివక్షను " అనాదిగా ఆటబొమ్మ " లో చూపిస్తూ ఆడవాళ్ళు ఆవేదనను తన అక్షరాలలో చూపే ప్రయత్నం హర్షనీయమే. తన వాళ్ళను వదలలేక వదిలి వచ్చిన శ్రీమతికి " తాళిబంధం" అందరినీ ఎలా మరిపిస్తుందో చెప్తూ భార్యకు ,భర్తంటే ఎంతిష్టమో తాళిబంధానికున్న శక్తిని చెప్పిన తీరు ప్రతి శ్రీమతికి నచ్చేతీరుతుంది.

" అమ్మకోక " స్పర్శను మళీ తాకించి అమ్మను గుర్తుచేశారు. ఒక్క సారైనా క్షమాపణలు చెప్పానా అంటూ " అర్థాంగి " మనసు గెలిచిన తీరు అమోగం.ఏ బాధనైన చూపించేది కన్నీటితోనే అటువంటి కన్నీరుని మునిపంటిన భరిస్తున్నప్పుడు కనబడకే  కన్నీటీచుక్క  అని తన అక్షరాలతో ఓదార్పు నిచ్చారు. పాఠకులకు, తల్లి తండ్రులు, కష్టం తెలియక వ్యసనాలకు భానిసైన కొడుకును " మరోకూలి "గా చూపించి ఓ బాధ్యతలేపని కొడుకు తీరుని ఎండగట్టారు. మనసారా చూడాలని చిరునవ్వు ను ఆహ్వానించిన తీరు పెదవిపై చిరునవ్వు కు  కాస్త చోటిచ్చింది.మాటరాని మౌనం మనసుల జ్ఞాపకాల అంతరాలను చెప్తాయి. కన్నీటికి మాటొస్తే ,బాలికలను బ్రతకనిద్దాం,శిథిలాలయం,నీటికోసం నినాదం, మరో మునిమాపువేళ,మనలోని ఆలోచనలకు పదును పెడుతాయి.

మరమనిషిగా మారిన మనిషి నన్ను నన్ను గా మిగల్ఛమని దేవుని కోరుకోవడం ద్వారా తను ఏం కోల్పోతున్నాడో చెప్తుంది.మనసు ను ఎందుకు పట్టుకెళ్ళావని చమత్కరించి మనసు వ్యధను చెప్పారు. ఆకలితో పట్నం వైపు అడుగులు వేసే వలసజీవుల ప్రాణాలను తట్టి లేపారు. అమ్మాయి నవ్వు ముందు నక్షత్రాలు తక్కువేనని అందంగా చెప్తూనే, ఏడవకమ్మా అంటూ ఓదార్చారు. అదేవిధంగా తన అక్షరాలే సూర్య కిరణాలై యువతలో  నేతాజీలాంటి నాయకులను తెస్తానని చెప్పడంలో  తన కలం ద్వారా  యువతలో చైతన్యం తెస్తానని చాలా గొప్ప గా చెప్పారు. అలాగే నాన్న తెచ్చె తినుబండారాల కోసం, పిల్లలు తన తండ్రిని నడుస్తున్న పండ్లచెట్టులా ఊహించడం లో ఓ తండ్రి బాధ్యత, పిల్లల సంతోషం కనబడింది. నీ వంటే ఏమిటో నీ అంతరాత్మను అడగమంటూనే,పల్లె పలకరింపులను పరిచయం చేశారు.నేను నేనేనా,జంటగా పోదాం, అనురాగపు చినుకులు, ప్రియమైన తలగడ,మైమరపు ప్రేమను తాకివచ్చాయి.ఉమ్మడి కుటుంబం లోని ఆనందాలను,నిజమైన నేస్తాలను చక్కగా చూపించారు.

చాటింగ్ లు ,చీటింగ్ లు అంటూ మనమే మరిచిన విలువలను నవనాగరికథలో  చూపిస్తూ ,ఇంకా ఏం మిగులున్నాయని అంటూ బాగా ప్రశ్నించారు. మనసున్న మనిషిగా ,ఏమైందో ,నివేదన, ప్రేమలేఖ, ప్రేమకుటీరం,నీకు ఏమి కాని నేను,ఇప్పుడెందుకు ఏడుస్తారు,గురువు గారికి ఎన్నిరూపాలో,మరువకుమా, అక్షరతోరణాలు, సురేంద్ర రొడ్డ గారి అధ్భతమైన భావవ్యక్తీకరణకు నిదర్శనమైతే , శాపగ్రస్తులంటూ అనాథలను గురించి తను రాసిన విధానం హర్షనీయం.ఇక్కడ ఎవరికీ ఎవరూ తక్కువేం కాదని అందరూ జీవిత రంగస్థలం లో మహానటులేనని మనుషులు మనస్తత్వాన్ని చదివేశారు.మనసుకు తెలుసు,ఒక్కేఒక్కరోజు, మధురభావాలు,నిరీక్షణ,అమ్మ మనసు,అనురాగకడలి,ప్రేమ,మనసా...ఏమిటో నీమాయ,ఇకచూడలేరేమో, మనసు మరణం,కన్నీటి చుక్కా కారిపోకే,ఆకాంక్ష, అమ్మవేదన,గురుతుండిపోవూ,మా అమ్మ అమృతపలుకులు,నిరంతర ప్రేమికులు,ఎప్పుడు ననుచేరునో,ఆశ కొత్త రెక్కలతోఆమె,అమ్మా నీకు వందనం,దోచుకెళ్ళకే కన్నీళ్లు ను,చీర,అమ్మ మనసులో చూడు,మగాడు, దివ్యపరిమళం,అన్వేషణ,నేనోబొమ్మనా,ప్రయమైన నేస్తం,కవిత ఓ కవితా,ప్రియా, ఇలా  ఈ ప్రతి శీర్షిక లోని అక్షరాలు,భావాలు, రచయిత గారి సాహిత్యాభిలాషకు నిదర్శనం.

చివరగా  "నాన్న పచ్చి అబద్దాల కోరు" మనసును ఆలోచింప చేసేలా, చదువుకొని  దాచుకోగల కవితాసంపుటి  . ఉపాధ్యాయులు గా ఎందరో పౌరులను తీర్చిదిద్దిన సురేంద్ర రొడ్డ గారు సాహిత్యంలోనూ నాలాగా కొత్తగా సాహితీలోకంలోకి అడుగులు వేసిన వారికి ఆదర్శం కావాలని ,మరియు వారి నుండి మరిన్ని రచనలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా .(పుస్తకం కొరకు సురేంద్ర రొడ్డ గారి నెంబర్ 9491523570)