స్వీయ నియంత్రణ పాటించు,ప్రభుత్వానికి సహకరించు - దుర్గమ్ భైతి

Stay Safe Stay Home

ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది కి పైగా ప్రజలను బలిగొన్న కరోనా వైరస్ కనపడని శత్రువు వలే ప్రజలందరిని రోజు రోజుకి వనికిస్తూనే ఉంది.ఇంతటి భయానక పరిస్థితి ని ప్రపంచం ఎప్పుడు రుచి చూడలేదు. గతంలో ఉప్పెనలు, సునామిలు, భూకంపాలు,వ్యాధులు,ప్రకృతి  వైపరీత్యాలు ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాగా మిగతా దేశాలు బాధితులకు బాసటగా నిలిచేవి.ఇప్పుడు మొత్తం దేశాలన్నీ కరోనా సమస్య ను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఏ దేశమైనా వారి ప్రజలను రక్షించుకునేందుకు ఆరాట పడుతున్నవి.మిగతా ప్రపంచం గురించి ఆలోచించే స్థితిలో ఏ దేశం లేదు.

రెండు ప్రపంచ యుద్ధములు జరుగు చున్నప్పుడు కూడా ప్రజలు ఇలా ఉలిక్కి పడలేదు.యుద్ద వాతావరణం కొన్ని దేశాలకే పరిమితమైన అంశమో లేదా శత్రువుల బారి నుండి తమని తాము రక్షించుకుంటామనే భరోసా కావచ్చును.ప్రపంచం కుగ్రామమైన ప్రస్తుత తరుణంలో ఏ ఉపద్రవం జరిగినా దాని ప్రభావ ఫలితం చాలా దేశాలు అనుభవిస్తున్నాయి.

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గర కరోనా నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటారోనని ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరచాయి.  ప్రజల ప్రాణాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ నిర్ణయాలు సాహసోపేతమైనవి.విమానాశ్రయాల మూసివేత తో కరోనా వ్యాప్తి ని చాలా వరకు అరికట్టగలిగారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో  ప్రజానీకం ప్రభుత్వానికి సహకరించాలి.అందరు కరోనా సమస్య ను ఎదుర్కోవడానికి సంసిద్ధులు కావాలి. బాధితుల పక్షాన నిలబడి ,ప్రజలకు అండగా నిలబడాలి. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి ,ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలి.ప్రభుత్వం తీసుకుంటున్న  ప్రతి చర్య ప్రజల భద్రత కొరకు అనే విషయాన్ని గమనించాలి.

నిత్యం కరోనా లక్షణాలు గల వారి మధ్య నుండి ప్రాణాలను లెక్కచేయకుండా  భాదితులకు వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బంది కి దేశమంతా రుణపడి ఉంటుంది.వారి సేవలకు వెల కట్టలేము.నిజంగా వారు కనిపించే దేవుళ్ళు. ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రిలో పనిచేసున్న ప్రతి వైద్య సిబ్బందికి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను.కరోనా వ్యాప్తి చెందకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్న  రక్షణ యంత్రాంగం నిర్వహిస్తున్న విధులు చాలా గొప్పవి.కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదు కావడానికి ప్రధాన కారణం వీరు సమర్థవంతంగా విధులు నిర్వహించడమే.

ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పటికప్పుడు ఊర్లను,నగరాలను పరిశుభ్రం చేస్తూ ,కరోనా నివారణ లో పారిశుద్ధ్య కార్మికులు పోషిస్తున్న పాత్ర ప్రశంస నీయం. అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబాలను వదిలి దేశం కోసం నిస్వార్థంగా పని చేస్తున్న వీరందరి త్యాగం అసాధారణ మైనది. ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో దేశము కోసం పోరాటం చేశారు. ఇప్పుడు చేస్తున్న సమరం కూడా అలాంటిదే.

ప్రజలలో చైతన్యం తేవడానికి, మారుమూల గ్రామాల్లో అవగాహన కల్పించడానికి, మనందరి కోసం శ్రమిస్తున్న వారికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం లాంటి వినూత్న కార్యక్రమాలు ప్రస్తుత భయానక పరిస్థితులలో ప్రజల ఐక్యత కు చిహ్నం గా చెప్పవచ్చు. కరోనా ను ఎదుర్కొనే వారి కి అండగా మేమున్నామనే భరోసా కల్పించింది. వారి సేవలకు గౌరవం లభించింది.

కనీవినీ ఎరుగని రీతిలో స్తంభింపచేసిన కరోనా క్రిమి రక్కసి కి భయపడుతున్న ప్రజలకు ఎప్పటికప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొండంత ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నాయి.వ్యవసాయ రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను  ప్రారంభించడం అందులో ఒకటిగా చెప్పవచ్చు.

కరోనా నేపథ్యంలోప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యం అధికార యంత్రాంగాన్ని సమన్వయ పరుస్తూ కేంద్రములో  ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేపడుతున్న చర్యలను చాలా మంది ప్రశంసిస్తున్నారు.,ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించి ,కరోనా వ్యాధి నిర్మూలన లో తమ వంతు పాత్ర పోషించాలి.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు