అమృతానికి మారుపేరు అమ్మ. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

అమృతానికి మారుపేరు అమ్మ.

అమృతానికి మారుపేరు అమ్మ(మదర్స్ డే మే రెండొఆదివారం)
మనం ఈ భూమి పైకి రాక ముందే అమ్మతొ అనుబంధం ఏర్పడుతుంది. ప్రాణం పోసి తన రక్తమాంసాలను కలిపి జన్మనిచ్చినందుకే అమ్మకి "మాత్రుదేవోభవ" అని పెద్దలు దైవత్వం కలిగించారు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు.

నాస్తి మాతృ సమా ఛాయా: నాస్తి మాతృ సమాగతి:
నాస్తి మాతృ సమంత్రాణం నాస్తి మాతృ సమప్రియా!

తల్లిలా చల్లని నీడనిచ్చే మరో తరువేది ఈ లోకంలో లేదు అని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ లోకంలో చెడు సంతతి ఉంటుందేమో కాని చెడు తల్లి ఉండదని ఆర్యోక్తి. నేడు మనం ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్న"మదర్స్ డే" ని తొలుత గ్రీకు సాంబ్రాజ్య కాలంలో వసంత రుతువు సంబరాల్లో దేవతల తల్లి "రేహ" గౌరవార్దం జరుపుకునేవారు. రోమ్ లో "సెబలి" పేరిట ఈ ఉత్సవాలు జరిపేవారు. క్రీస్తుకు పూర్వం 250సం "నాటికే ఈ ఉత్సవం జరుపుకున్నట్లు తెలుస్తుంది. రోమన్లు ఈ పండుగను"హిలరియా" పేరున మూడు రోజుల పాటు జరుపుకునేవారు. తరువాత కాలంలో "చర్చి" బలపడటంతో, క్రీస్తుకు జన్మనిచ్చిన "మేరిమాత" గౌరవ సూచకంగా "మదర్స్ సండే" ఉత్సవాలు ఇంగ్లాండు లో 1600సం ప్రారంభం అయ్యాయి. అలా యూరప్ అంతటా "మేరిమాత" గౌరవార్దం జరుపుకోసాగారు. తొలిసారి అమెరికాలో మదర్స్ డే గురించి గళమెత్తిన మహిళ "జూలియావార్డ్ హోవే". ఈమె అమెరికా పౌర యుద్ద గీత రచయిత్రి. 1870 ప్రాంతంలో ఈమె ఈ వేడుకలకు ప్రయత్నం చేసింది. "అన్నాజరివిస్" అనే అమెరికా మహిళ నాటి నిరుపేద మహిళల స్ధితి గతులకు చలించి పోయి వారి కోసం ఒక నిధి ఏర్పాటు చేయాలని "మదర్స్ డే" వేడుకలు నిర్వహించటం ప్రారంభించింది. అలా 1914 నుండి మే మాసం రెండో ఆదివారాన్ని "మదర్సడే" అధికార పూర్వకంగా నిర్వహించసాగారు. నేడు ప్రపంచం అంతటా మదర్స్ డే వేడుకలు నిర్వహించుకుంటున్నారు.

మనం ఈ లోకంలోకి వచ్చాక తొలి సారి వాసన పట్టెది, గుర్తించేది అమ్మనే. తొలిసారి రుచి చూసేది కూడా అమ్మ పాలనే. మన నుండి ప్రేమ తప్పఏమి ఆశించని త్యాగమయి అమ్మ. కాని ఆ అమ్మకు నేడు ప్రేమా అనురాగాలే కరువయ్యాయి. ప్రపంచీకరుణ మహత్యంలో నేడు అమ్మఉనికే ప్రశ్నార్దంగా మారింది. అమ్మ పాలతో అబ్బిన తెలివి తేటలు, సంస్కారం, డబ్బు ముందు మొకరిల్లాయి. బోసి నోటితో కొరికినా నవ్వుతూ బోజ్జనింపిన అమ్మలు ఎందరో నేడు వంగిన నడుము, కుంగిన మనస్సుతో తమ కలలు చెదరి సంతతి ఆదరణకు దూరమై నరక జీవితాన్ని అనుభవిస్తూ, కన్నిరు తుడిచే వారే కరువై, మరణం కొరకు ఎదురు చూస్తూ వృద్ధాశ్రమాలలో జీవశ్చవాలుగా, మూగ రోదన చేసే తల్లులు ఎందరో. కన్నబిడ్డల తిరస్కారానికి గురై బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ల లో తలదాచుకొంటున్నారు. తల్లి బ్రతికి ఉండగనే కాటిలో వదిలి వెళ్ళిన సంస్కారహీనులు మనలో లేక పోలేదు. పిడికెడు మెతుకులకొరకు జీవన సమరం సాగించే వారిని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది అన్న మహ్మద్ ప్రవక్త చెప్పిన వాక్కు నిత్య సత్యం.మనకు ఈ జగాన్ని చూపించిన తల్లిని ఇదే జగంలో మనమెంత సుఖఃపెడుతున్నాం? ఈ లోకంలో ఐదుగురు తల్లులు ఉన్నారని శాస్త్రం చెపుతుంది.

రాజః పత్ని గురోఃపత్ని భతృ పత్నీ చదైవచ
పత్నిమాతా స్వమాతాచ పంచైతా మాతరః స్మృతాః!!

మహరాజు ధర్మపత్ని, గురుపత్ని, అన్నభార్య, భార్యతల్లి, వీళ్ళంతా తల్లితొ సమానులే. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావడంతొ, కాలక్రమంలో మర మనుషుల్లా యాంత్రిక జీవనం గడపటంతొ, ప్రేమానుబంధాలు, మానవీయ విలువలు, కనిపించకుండా పోతున్నాయి. డాలర్ల సంపాదనతొ విలాసవంతమై జీవనం, కృత్రిమ ఆనందాలు పొందవచ్చు. నిర్మలమైన తల్లిప్రేమ ముందు ఎన్నిడాలర్లు గుమ్మరించినా దిగదుడుపే. ఈ దేహన్ని ప్రసాదించిన తల్లిరుణం ఏమిచ్చి తీర్చుకోగలం. అమ్మఒడిలో తల పెట్టి సేద తీరిన ఆనందానికి వెలకట్టే షరాబు ఈ లోకంలో ఉన్నాడా? అమ్మ నా దగ్గర ఉంటుంది అనకుండా నేను అమ్మ దగ్గరే ఉన్నాను అనేవాళ్ళు నేడు ఎందరు? మనం ఎదటి స్త్రీని పిలిచేటప్పుడు అమ్మ అని పిలుస్తాం. అంటే మరొకరి తల్లిని కూడా మన తల్లిగా గౌరవించే గోప్ప సంప్రదాయంలోను. స్త్రీని అమ్మవారిగా పూజించే సంసృతిలో పెరిగిన మనం నేడు ఆ స్త్రీమూర్తులకు ఎలా గౌరవిస్తున్నామో అందరికి తెలిసందే. నేడు రోడ్లపై, దేవాలయాల వద్ద, పలు ప్రాంతాలలో, అభిమానం చంపుకుని, దీనాతి దీనంగా, ఆకలితో అలమటిస్తూ బ్రతకడంకొసం యాచన చేస్తున్న మాత్రుమూర్తులను చూస్తూ నేడు "మదర్స్ డే" నిర్వహించడం హర్షణీయమా? ఆలోచించండి. ఏనాడు మనపెద్దలు పిడికెడు మెతుకుల కొరకు రొడ్డున పడకుండా పదిలంగా తమ సంతతి వద్ద ఉంటారో అదే నిజమైన "మాతృదినోత్సవం"......