నారిమణి. - కొండగుంట వెంకటేశ్ బాబు

naareemani

“ఒసే బిచాని ఎక్కడ చచ్చావు. పిలుస్తుంటే పలకవేం” అత్తగారి గొంతు గట్టిగా వినిపించేసరికి ఆలోచనల నుంచి తేరుకుంది బచాని. దాదాపు గంటసేపటినుంచి ఆమె కిటికి దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. ఎందుకో కారణం తెలియదు గాని ఉన్నట్టుండి భర్త జటావత్ ఆమెకు గుర్తుకువచ్చాడు. సరిగ్గా ఒక సంవత్సరం ముందు జాటవత్ ఆమెను రెండుసంవత్సరాల పసిబాబును విడిచిపెట్టి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. అతను మాములుగా చనిపోతే బాగుండేది. కాని ఉగ్రవాదుల దాడులో మరణించాడు.

ఆ రోజు జరిగిన సంఘటన బిచాని జీవితాంతం మరచిపోలేదు. ఆ రోజు మాములుగా పాకిస్ధాన్ భారత సరిహద్దు ప్రాంతమైన ఫిరోజ్ పూర్ మాములుగా మేలుకుంది. అందరు సంతోషంతో తమ రోజువారి పనిలో పడిపోయారు. బిచాని భర్తకు టి ఫిన్ కట్టి పొలానికి సాగనంపింది. జాటావత్ టిఫిన్ క్యారియర్ తీసుకుని భార్యను ఆప్యాయంగా దగ్గరికి లాక్కున్నాడు. ఆమె చంకలో ఉన్న బాబును గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు. తరువాత కన్నతల్లి దగ్గరికి వెళ్ళి వెళ్ళోస్తానని చెప్పి బయలుదేరాడు. బిచాని బాబును ఎత్తుకుని భర్తను గుమ్మం వరకు సాగనంపింది. జాటావత్ ఆమెకు చేతులు ఊపి సైకిల్ మీద పొలానికి వెళ్ళిపోయాడు.

ఎందుకో కారణం తెలియదు కాని అకస్మాతుగా బిచాని కుడి కన్ను అదిరింది. ఆడవాళ్ళకు కుడికన్ను అదిరితే ఆ ఇంటికి ఏదో ఆపదకాని అరిష్టం కాని జరగబోతుందని బిచాని కులంలో ఒక నమ్మకం ఉంది. అది మూఢనమ్మకమో లేక నిజమో ఎవరికి తెలీదు. కాని ఎవరికైన అలాంటి అనుభవం జరిగితే అది భయంవల్లో నమ్మకం వల్లో చాల భయపడతారు. దానికి బిచాని అతీతురాలు కాదు.

అందుకే మొదటిసారి కుడికన్ను అదరగానే సహజంగానే భయపడింది బిచాని. ఈ విషయం ముందు అత్తగారితో చెప్పాలని భావించింది. కాని అనవసరంగా ఆవిడను భయపెట్టటం ఎందుకని నోరు మూసుకుంది. ఆ రోజు సాయంత్రం వరకు అన్యమనస్కంగానే ఉంది బచాని. ఏ క్షణంలో ఎలాంటి భయంకరమైన వార్త వినవలసివస్తుందో అని తెగ భయపడిపోయింది.సాయంత్రం అయిదు గంటలవరకు ఆమె ఊహించినట్టుగా ఏం జరగలేదు. ఆ టైంకు జటావత్ పొలంపనులు పూర్తిచేసుకుని టిఫిన్ క్యారియర్ తీసుకుని సైకిల్ మీద ఇంటికి బయలుదేరాడు. ఫిరోజ్ పూర్ భారత్ పాకిస్ధాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. అప్పుడప్పుడు పాకిస్ధాన్ సరిహద్దులోంచి ఉగ్రవాదులు రహస్యంగా ఫిరోజ్ పూర్ లో ప్రవేశించి రక్తపాతం సృష్టించటం చాల రోజులనుంచి జరుగుతోంది. అందుకే భారత ప్రభుత్వం కొంతమంది మిలిట్రి అధికారులను ఆ ప్రాంతంలో నియమించింది. వాళ్ళు రాత్రి పగలు అని తేడాలేకుండ గస్తీ తిరుగుతూ ఉగ్రవాదల జాడ తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

అక్కడ మిలిట్రి క్యాంప్ రావటంతో ఫిరోజ్ పూర్ ప్రజలకు చాల ధైర్యం కలిగింది. ఒకవేళ అనుకోకుండ ఉగ్రవాదులు దాడిచేసిన మిలిట్రి వాళ్ళు చూసుకుంటారు అని నమ్మకంతో ఉన్నారు. అందుకే ఆ రోజు పొలం పనులు అయిన వెంటనే జటావత్ భార్యకు మల్లెపువ్వులు బాబుకు కొన్ని ఆటసామానులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతనితో పాటు ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళు కూడా బయలుదేరాడు. అందరు సరదాగా నవ్వుకుంటు పిచ్చాపాటి మాట్లాడుకుంటు సైకిల్ నడుపుతున్నారు. సరిగ్గా అందరు జటావత్ ఇంటి సమీపంలోకి వచ్చేసరికి ఊహించని భయంకరమైన పరిణామం ఎదురయింది. ఉగ్రవాదులు ఎలా వచ్చారో ఎక్కడనుంచి వచ్చారో తెలియదు. మిలిట్రి వాళ్ళ కళ్ళు ఎలా కప్పారో తెలియదు కాని పదిమంది ఉగ్రవాదులు వాళ్ళకు ఎదురుగా వచ్చారు. అందరి చేతులలో సబ్ మెషిన్ గన్స్ ఉన్నాయి. జటావత్ తో పాటు అతనితో ఉన్నవాళ్ళకు పై ప్రాణాలు పైనే పోయినట్టుగా అయింది. భయంతో అందరు వణికిపోయారు.

ఒక్క క్షణం పాటు ఆ ఉగ్రవాదులు తీక్షణంగా జటావత్ అతని సహచరులవైపు చూశారు. తరువాత వాళ్ళ నాయకుడు మిగత వాళ్ళ వైపు చూసి కళ్ళతో సైగచేశాడు. అంతె మరుక్షణం ఉగ్రవాదల చేతులలో ఉన్న తుపాకులు భయంకరంగా చప్పుడు చేశాయి. తప్పించుకోవటానికి కాని అక్కడనుంచి పారిపోవటానికి కాని ఎవరికి అవకాశం దొరకలేదు. మొదటి గుండు జటావత్ శరీరాన్ని చిధ్రం చేసింది. గుండు తిన్నగా అతని గుండెలోకి దూసుకుపోయింది. అరవటానికి కాని కనీసం మూల్గటానికి కాని జటావత్ కు అవకాశం దొరకలేదు. ఉన్నవాడు ఉన్నట్టుగా సైకిల్ మీద నుంచి నేలమీద కూలిపోయాడు. ఆ తరువాత ఏం జరిగిందో అతనికి తెలియదు. రెండు క్షణాలపాటు మిషన్ గన్ మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లీ పోయింది. జటావత్ తో సహ ఇంకో పదిమంది రక్తపు మడుగులో పడిపోయారు. తుపాకిల శబ్ధం ఆ నిశబ్ధం వాతావరణంలో భయంకరంగా వినిపించింది. చాల మంది తమ ఇంట్లోంచి వచ్చి చూశారు. కొంతమంది భయంతో గట్టిగా అరిచారు. అదే సమయంలో అటువైపు వస్తున్న పోలీస్ వ్యాన్ వెంటనే ఆగింది. అందులోంచి నలుగురు పోలీస్ సిబ్బంది ఒక ఆఫీసర్ దిగారు. అందరు తుపాకులు సరిచేసుకుని ఉగ్రవాదుల వైపు దూసుకువచ్చారు. ఉగ్రవాదులు వెంటనే తమ తుపాకులు పైకి పేల్చి పరిగెత్తారు. పోలిసులు వాళ్ళను పట్టుకోవటానికి ప్రయత్నించారు కాని వాళ్ళు పాకిస్ధాన్ సరిహద్దు వైపు పరిగెత్తారు. క్షణంలో కళ్ళకు కనిపించకుండ మాయమయ్యారు.

జరిగింది తెలుసుకున్న బిచాని బాబును ఎత్తుకుని సంఘటన జరిగిన స్ధలానికి చేరుకుంది. ఆమె అత్తగారు గట్టిగా ఏడుస్తూ కొడుకును కలవరిస్తూ బిచానిని అనుసరించింది. రక్తపు మడుగులో ఉన్న భర్తను చూడగానే బిచాని మైండ్ బ్లాంక్ అయిపోయింది. నవనాడులు కృంగిపోయినట్టు అచేతనంగా ఉండిపోయింది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండ ఒక విధమైన ట్రాన్స్ లో ఉండిపోయింది. జటావత్ తల్లి పరిస్ధితిచెప్పటానికి వీలులేదు. కొడుకు శవం మీద పడి ఏడ్వసాగింది.

మరునాడు జరగవలసిన తతంగం జరిగిపోయింది. కొంత మంది ప్రభుత్వ అధికారులు వచ్చి బిచానిని ఓదార్చారు. జటావత్ తో చనిపోయిన వాళ్ళందరికి నష్టపరిహారం ఇస్తామని వాగ్ధానం చేశారు. లోకల్ యం.యల్. ఏ తన కార్యకర్తలతో వచ్చి నానా హంగామా చేశాడు. ప్రభుత్వం దగ్గర నుంచి పది లక్షలు ఇప్పిస్తానని గట్టిగా అన్నాడు.

భర్త పోయిన షాక్ నుంచి తేరుకోవటానికి బిచానికి పదిరోజులు పట్టింది. ఉన్నభూమిని సాగుచేసుకుంటు రోజులు గడుపుతోంది. ఇటు అధికారులు అటు రాజకీయనాయకులు చెప్పిన డబ్బు మాత్రం ఆమెకు కాని చనిపోయినవారి మిగత కుటుంబాలకు కాని రాలేదు. వాళ్ళను ప్రభుత్వం పూర్తిగా మరచిపోయింది.

అయితే రక్షణ శాఖ ఈ సంఘటనను అంత తేలికగా తీసుకోలేదు. ఉగ్రవాదులను పూర్తిగా అణచాలంటే అందుకే ఒక ప్రత్యెక యానిట్ కావాలని భావించింది. అందుకే డెల్టా ఫోర్స్ అనే యాంటి ఉగ్రవాద సంస్ధను ఏర్పాటు చేసింది. ఆ సంస్ధకు నాయకుడు మాలిక్. ప్రతి రోజు కొన్ని గంటలు ఆ సంస్ధకు చెందిని కమెండోస్ ఫిరోజ్ పూర్ అడవుల ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నారు. కాని వాళ్ళకు మాత్రం ఉగ్రవాదలు ఎదురుపడలేదు. ఇది గతం.

ఇక ప్రస్ధుతానికి వస్తే కొడుకు పోయిన తరువాత బిచాని అత్త మనస్సు పూర్తిగా మారిపోయింది. తన కొడుకు చావుకు బిచాని కారకురాలని ఆవిడ భావిస్తోంది. బిచానిని ప్రేమించి పెళ్ళిచేసుకోవటం వల్లే తన కొడుకు అర్ధాంతరంగా చనిపోయాడని ఆమె నమ్మకం. అందుకే రోజు బిచానిని అనరాని మాటలతో బాధిస్తాంది. కారణం లేకుండ తిడుతుంది. రాచి రంపాన్న పెడుతోంది. కాని బిచాని మాత్రం పల్లెత్తు మాట అనేదికాదు. దానికి కారణం జటావత్. అతని తల్లిలో ఆమె జటావత్ ను చూసుకుంటుంది. అందుకే ఎదురుచెప్పకుండ అన్ని పనులు నోరు మూసుకుని చేస్తోంది.

అత్తగారి కేక విని తన ఆలోచనలనుంచి బయటపడింది బిచాని. బాబును ఎత్తుకుని హాలులో కి వెళ్ళింది. అక్కడ అత్తగారు పాన్ దాన్ లోంచి పాన్ తీసుకుని నములుతోంది.

“ఏంటి అత్తయ్య పిలిచారు “అంది మెల్లగా బిచాని.

“పిలవలేదు. అరిచాను. ఇంట్లో కట్టెలు నిండుకున్నాయి. వెళ్ళి కట్టెలు తీసుకురా. బాబును కూడా వెంట తీసుకువెళ్ళు. వాడు నా దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండలేడు”అందామే. అలాగే అని తలూపి బిచాని లోపలకు వెళ్ళింది. ఒక తాడు తీసుకుంది. బాబును వీపు వెనుక కట్టుకుని ఇంట్లోంచి బయటపడింది. మెల్లగా రోడ్డు మీద నడుస్తూ అడవిలాంటి ప్రదేశం చేరుకుంది. అక్కడే ఆమెకు కావల్సిన కట్టెలు దొరుకుతాయి. ఆ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా నిస్తేజంగా ఉంది. ఎక్కడ చిన్న అలికిడి వినిపించటంలేదు. ఆమె కాళ్ళ కింద ఎండుటాకులు చిన్నగా చప్పుడు చేస్తున్నాయి. మెల్లగా కట్టెపుల్లలను ఏరుకుంటు సంచిలో వేసుకుంటుంది బిచాని. అలా కొంచం దూరం నడిచిన తరువాత ఉన్నట్టుండి ఆగిపోయింది బిచాని. చెవులు రిక్కించి వింది. వెనుక నుంచి ఎవరివో ఆడుగుల చప్పుడు వినిపిస్తోంది. వస్తుంది ఒకరు కాదు. ఇంకా చాల మంది వస్తున్నట్టుగా అడుగుల చప్పుడు వినిపిస్తోంది.

ముగింపు వచ్చే సంచికలో.................

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల