ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అరవింద సమేత..' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా దాదాపు షూటింగ్ పూర్తైంది. ఇక ప్రమోషన్సే తరువాయి. ఆల్రెడీ ఆడియో డైరెక్ట్గా మార్కెట్ లోకి విడుదలై సందడి చేస్తోంది. ముఖ్యంగా 'పెనివిటీ..' సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆడియో రిలీజ్ సింపుల్గా అయిపోయినా, ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఘనంగా ప్లాన్ చేస్తున్నారట.
త్వరలో 'అరవింద సమేత..' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిత్ర యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇక పోతే ఓవర్సీస్ మార్కెట్ విషయం లోనూ త్రివిక్రమ్ ప్రత్యేక దృష్టి పెట్టాడట. త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్లో మంచి మార్కెట్ ఉంది. ఈ మధ్య 'నాన్నకు ప్రేమతో..', 'జై లవకుశ' సినిమాలతో ఎన్టీఆర్ కూడా ఓవర్సీస్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న 'అరవింద సమేత..'పై భారీ అంచనాలున్నాయి ఓవర్సీస్ లో. అక్కడ రిలీజ్ విషయంలోనూ ప్రత్యేక శ్రధ్ద తీసుకుంటున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్.
హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడి పాత్రలో చిత్తూరు యాసలో డైలాగులు పలకనున్నాడు. హాట్ బ్యూటీ పూజా హెగ్దే, తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కమెడియన్ కమ్ హీరో సునీల్ పాత్ర ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దసరా కానుకగా ఈ సినిమాని అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
|