కమలాకర కామేశ్వరరావు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కమలాకర కామేశ్వరరావు.

కమలాకర కామేశ్వరరావు.
దర్శక మాంత్రికుడు అయిన వీరు 1911, అక్టోబర్ 4 న బందరులో జన్మించాడు. ఆయన విద్యాభ్యాసం పూర్తిగా అక్కడే జరిగింది. ఆయన 1933లో బి.ఏ. పాసయాడు. అప్పటికే ఆయనకు సినిమా టెక్నిక్ మీద మంచి ఉత్సాహం ఏర్పడింది. వచ్చిన ప్రతి చిత్రమూ భాషతో నిమిత్తం లేకుండా తప్పక చూసేవాడు. చూసి ఊరుకోక ఫిల్మ్ టెక్నిక్ కు సంబంధించిన పుస్తకాలు తెప్పించి చదవడం ప్రారంభించాడు. స్వతహాగా ఉన్న ఆసక్తికి ఇలా పుస్తకాల ద్వారా పొందిన విజ్ఞానం తోడవడంతో ఆయన విడుదలైన సినిమాల మీద విమర్శలు వ్రాయడం ఆరంభించారు.
కృష్ణా పత్రికలో 'సినీఫాన్' అన్న పేరుతో సినిమా రివ్యూలు వ్రాసే వాడు. విడుదలైన తెలుగు సినిమాలను; న్యూథియేటర్స్, ప్రభాత్ వారి హిందీ
సినిమాలనూ కూలంకషంగా పరిశీలిస్తూ నిశితంగా విమర్శించేవాడు. బందరులో మొదటిసారి విడుదల కాని సినిమాలను బెజవాడ వెళ్ళి చూసి వచ్చేవాడు. సినిమాల్లో కథ, కథాసంవిధానం ఎలా వున్నాయి? ఆ సినిమాలు టెక్నికల్ గా ఎలా వున్నాయి? అన్న విషయాల మీద ఆయన విమర్శలు సాగేవి. తెలుగు, హిందీ సినిమాలే గాక ఆంగ్ల చిత్రాల గురించి కూడా వ్రాసేవాడు. 'గుడ్ ఎర్త్ ' అనే సినిమా లోని గొప్ప దనాన్ని గురించి వరసగా నాలుగు సంచికల్లో వ్రాశాడు.
ఆయన సినిమా విమర్శలకు ఎంతో విలువ ఉండేది. ఆ విమర్శలు విజ్ఞులందరికీ ప్రామాణికంగా ఉండేవి. ఆ విమర్శల్ని చదివి, వాటిలో 'బాగుంది' అని వ్రాస్తేనే ఆ సినిమాలను చూసేవాళ్ళు, బాగలేదని వ్రాస్తే చూడని వాళ్ళు కూడా ఉండేవారు. కృష్ణా పత్రిక స్థాపకుడు, సంపాదకుడు అయిన ముట్నూరు కృష్ణారావు కామేశ్వరరావు గురించి "మా సినీఫాన్" అని గర్వంగా చెప్పేవాడు.
ఆ రోజుల్లో పోటీ పడి ఒకేసారి విడుదలైన "ద్రౌపదీ వస్త్రాపహరణం", "ద్రౌపదీ మానసంరక్షణం" చిత్రాలను రెండింటినీ సరిపోలుస్తూ, తేడాలను విశదపరుస్తూ కామేశ్వరరావు కృష్ణా పత్రికలో వరసగా నాలుగు సంచికలలో వ్రాసిన విమర్శలు సినిమా పరిశ్రమలో సంచలనం కలిగించాయి. ఎందుకంటే 'వస్త్రాపహరణం' ఆర్థికంగా విజయవంతమైంది; 'మానసంరక్షణం' దెబ్బతిన్నది. కానీ కామేశ్వరరావు మాత్రం 'మానసంరక్షణం' 'వస్త్రాపహరణం' కంటే మంచి చిత్రమని ప్రశంసించాడు. వస్త్రాపహరణం లోని లోటు పాట్లను విమర్శించాడు. వస్త్రాపహరణంలో నాటి ప్రముఖ స్టేజి నటులంతా నటించారు. బహుళ ప్రచారంలో ఉన్న పద్యాలనేఆసినిమాలోవాడారు. హెచ్.ఎం.రెడ్డి ఆధ్వర్యంలో హెచ్.వి.బాబు దర్శకత్వంలో ఆ చిత్ర నిర్మాణం జరిగింది.
ఇక మానసంరక్షణం చిత్రానికి ఎన్.జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఇందులో దుర్యోధన పాత్ర ధరించింది బళ్ళారి రాఘవ కాగా అందులో యడవల్లి సూర్యనారాయణ. కథ నడిపిన విధానం, నటన మానసంరక్షణంలో బాగున్నాయని కామేశ్వరరావు వ్రాశాడు.
ఈ విమర్శలను నార్ల వెంకటేశ్వరరావు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి ప్రముఖులందరూ ప్రశంసించారు. రామబ్రహ్మం 'వస్త్రాపహరణం' సినిమాలో పనిచేశాడు. అయినా కామేశ్వర రావు విమర్శలను మెచ్చుకున్నాడు! ఈ 'వస్త్రాపహరణం', 'మానసంరక్షణం' చిత్రాల మీద వ్రాసిన విమర్శలే కామేశ్వర రావును చిత్ర పరిశ్రమలో ప్రవేశ పెట్టాయి.
హెచ్.ఎం.రెడ్డి 'కనకతార' తీస్తున్నరోజుల్లో కామేశ్వరరావు మద్రాసు
వచ్చాడు. తాను 'సినీఫాన్' అనే పేరుతో కృష్ణా పత్రికలో సినిమాల గురించి విమర్శలు వ్రాస్తూ ఉంటానని చెప్పి 'మానసంరక్షణం', 'వస్త్రాపహరణం' చిత్రాల మీద తాను వ్రాసిన విమర్శలు చూపించాడు - వాటిల్లో ఆర్థికంగా హిట్టైనా సరే, బాగాలేదని తాను వ్రాసిన వస్త్రాపహరణం సినిమా తీసిన హెచ్.ఎం.రెడ్డి కి! కానీ విమర్శలు పూర్తిగా చదివి హెచ్.ఎం.రెడ్డి ఆయన్ను అభినందించాడు!! "చాలా బాగుంది" అని మెచ్చుకున్నాడు!! పైగా తన సినిమాను విమర్శించి, దానికి పోటీగా ఇంకొకరు తీసిన సినిమాను ప్రశంసించిన కామేశ్వరరావుకు ఉద్యోగమివ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన.
గృహలక్ష్మి సినిమా ప్రారంభానికి ముందు కబురందుకుని కామేశ్వరరావు మద్రాసు చేరుకుని రోహిణీ సంస్థలో చేరాడు. అయితే ఆ సినిమాలో పనిచేసేనాటికి ఆయనకు సినిమాలలో పనిచేసిన అనుభవం లేదు కాబట్టి జీతం లేదు కానీ భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేశారు. కామేశ్వరరావు రోహిణీ వారి లాడ్జిలోనే వుండేవారు. (ఆ రోజుల్లో ఒక సినిమాలో పని చేసే వాళ్లందరికీ ఒకే లాడ్జిలో వసతి, భోజనాలు ఏర్పాటు చేసేవారు). రోహిణీలో చేరడంతో ఆయనకు పెద్దవారితో పరిచయాలు ఏర్పడ్డాయి. రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్, బి.ఎన్.రెడ్డి,
కె.వి.రెడ్డి, సముద్రాల రాఘవాచార్య మొదలైనవారు పరిచయమయ్యారు. కె.వి.రెడ్డి అప్పుడు రోహిణిలో క్యాషియర్ గా ఉండేవాడు. పెద్ద, చిన్న భేదం లేకుండా అందరూ ఒకే చోట భోజనాలు చేసేవారు. ఒక్కసారే ఒకే కార్లో షూటింగుకు బయల్దేరే వారు. అంతా ఒక కుటుంబంలా ఉండేవారు.
కామేశ్వరరావుకు ఆ సినిమాలో జీతమేకాదు, పని కూడా ఏమీ ఉండేది కాదు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఏదో ఒక సినిమా చూసేవాడు. రాత్రయాక లాడ్జిలో పడుకుని కె.వి.రెడ్డి, ఆయనా ఆ సినిమా గురించి చర్చించుకునేవారు.అలావారిద్దరూ బాగాసన్నిహితులైనారు. గృహలక్ష్మి
చిత్రం పూర్తయాక బి.ఎన్.రెడ్డి, రామ్‌నాథ్, ఎ.కె.శేఖర్ తదితరులంతా కలిసి వాహినీ సంస్థ స్థాపించారు. దాంట్లో కామేశ్వరరావు సహాయ దర్శకుడుగా చేరాడు. కె.వి.రెడ్డి ప్రొడక్షన్ మానేజరు, బి.ఎన్.రెడ్డి దర్శకుడు. వాహినీ వారి దేవత చిత్రం నుంచి కామేశ్వరరావు అసోసియేట్ గా పనిచేశాడు. ఆసియాలోకెల్లా అతిపెద్ద స్టూడియోగా పేరుపొందిన వాహినీ స్టూడియోకు శంకుస్థాపన జరిగినప్పుడు అక్కడుండి మట్టి వేసిన వారిలో కామేశ్వరరావు ఒకడు.
బందరులో కామేశ్వరరావుకు పింగళి నాగేంద్రరావుతో పరిచయముంది. ఆయన వింధ్యరాణి చిత్ర నిర్మాణ సమయంలో మద్రాసు వచ్చాడు. అప్పుడు కామేశ్వరరావు ఆయనను కె.వి.రెడ్డికి, బి.ఎన్.రెడ్డికి పరిచయం చేశాడు. అలా తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన రచయితను పరిశ్రమకు పరిచయం చేసింది కూడా కామేశ్వరరావేనని చెప్పవచ్చు.అంతలో కారణాంతరాల వల్ల వాహినీ స్టూడియో చేతులు మారి విజయా సంస్థ స్టూడియోను నిర్వహించసాగింది. విజయా వారు కామేశ్వరరావును కూడా తమ సంస్థ లోకి తీసుకున్నారు. తొలుత విజయా వారి పాతాళభైరవి సినిమాకు ఆయన పనిచేశాడు. తర్వాత విజయా వారే నిర్మించిన చంద్రహారం సినిమాతో కామేశ్వరరావు తొలిసారిగా దర్శకుడయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబడిన ఈ చిత్రం విజయావారి మునుపటి చిత్రాల వలె ఆర్థికంగా విజయవంతం కాలేకపోయింది. కానీ విమర్శకుల మెప్పును మాత్రం పొందింది. ఆ చిత్రంలోని టెక్నిక్ కు ఎందరో విమర్శకులు జోహార్లర్పించారు. ఆ సినిమాలోని కొన్ని దృశ్యాలు విదేశాల్లో టెలివిజన్ లో ప్రసారమయ్యాయి.
దర్శకత్వం వహించిన సినిమాలు:సవరించు
చంద్రహారం (1954)గుణసుందరి కథ (తమిళం)పెంకి పెళ్ళాం (1956)
పాండురంగ మహత్యం (1957)శోభ (1958)రేచుక్క-పగటిచుక్క (1959)
మహాకవి కాళిదాసు (1960)గుండమ్మకథ (1962)మహామంత్రి తిమ్మరుసు (1962)నర్తనశాల (1963)పాండవ వనవాసం (1965)
శకుంతల (1966)శ్రీకృష్ణ తులాభారం (1966)శ్రీకృష్ణావతారం (1967)
కాంభోజరాజు కథ (1967)వీరాంజనేయ (1968)కలసిన మనసులు (1968)మాయని మమత (1970)శ్రీకృష్ణ విజయం (1971)
బాల భారతం (1972)శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మహత్యం (1980), మొదలగు చిత్రాలకు దర్శకత్వం వహించారు.

 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు