జన్మలు ఎన్నిరకాలు - బ్రహ్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గురూజీ

జన్మలు ఎన్నిరకాలు

పూజ్య భగవత్ బంధువులారా.. మా గురుదేేవుల నుండి నేను నేర్చుకున్న విజ్ఞానాన్ని మీకు తెలియజేస్తున్నాను. పవిత్రమైన హిందూ పురాణ గ్రంధాలనుండి, ఇతిహాాసాల నుండి, పలువురు ఆధ్యాత్మిక గురువలనుండి నేను విన్నది, సేకరించిన అంశాలను ఇక్కడ విన్నవించుకొనుచున్నాను.

అసలు జన్మలు 3 రకాలు..

1).* దేవజన్మ._

2).* పశు, పక్షి, క్రిమి,కీటకాది జన్మలు

3).* మానవజన్మ.

చాలామందికి అనుమానం వస్తుంటుంది జన్మలు ఎలా వస్తాయి ? వాటి ప్రత్యేకతలేమిటి అని.

మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.

1).* దేవజన్మ :

అందులో అన్నీ పుణ్య కర్మలఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు దేవలోకాలలో దేవజన్మ నెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగభూమి. కనుక అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం లేదు. అందువల్ల పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు. తన కర్మఫలాలను అనుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయంకాగానే... “క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి” అన్న వేదోక్తిని అనుసరించి ఈ మర్త్యలోకాన్ని... అంటే మానవ లోకాన్ని చేరుకోవలసిందే !

మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే..!

ఈ దేవజన్మలో కేవలం మనోబుద్ధులుంటాయి గాని కర్మజేయుటకు సాధనమైన స్థూలశరీరం ఉండదు. కనుక భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు దేవజన్మ !

2). పశు, పక్షి, క్రిమి,కీటకాది జన్మలు

ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా నీచయోనులందు జన్మిస్తాడు. ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడతాడు. జంతుజన్మలలో కర్మలు చేస్తున్నట్లు కన్పించినా, ఆ కర్మలన్నీ బుద్ధిపరంగా ఆలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని చేసేవి కావు. కేవలం ప్రకృతి ప్రేరణలతో పరతంత్రంగా చేస్తాయి. కారణం ఈ జంతుజన్మలలో శరీరం మనస్సు ఉన్నాయి గాని బుద్ధి మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించుటయే గాని పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.

కనుక భగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడా ఉపయోగపడదు !

3).* మానవజన్మ.

ఇక పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు. పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు. అయితే ఇలా కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మనందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు పెద్దలు.

వేద ప్రామాణికంగా మొత్తం 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానవ జన్మను.. *“జంతూనాం నరజన్మ దుర్లభం”* అని ఆచార్య శంకరులు “వివేక చూడామణి” గ్రంధంలో తెలియజేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని వినియోగ పరుచుకోవలి.