నిర్మల భక్తి - ఆదూరి శ్రీనివాసరావు

Nirmala Bhakthi

ఒకనాడు శ్రీకృష్ణ భక్తుడైన అర్జునుని హృదయాన్ని గర్వం ఆవహించింది..అది శ్రీకృష్ణుడు గమనించి విహారార్ధం అర్జునుని ఒకచోటికి తీసుకెళ్ళినాడు.అది దాదాపు నిర్జనప్రదేశము.అక్కడ కేవలం చెట్టునుండీ పడిన ఫలాలను మాత్రంమే భుజిస్తూ ఏజీవికీ హింస చేయని వ్యక్తిని చూసి,ఆయన  పరమ భాగవతోత్తముడని గ్రహిం చాడు అర్జునుడు. ఐతే ఆబ్రాహ్మణుని మొలలొ మాత్రం పదునైన ఖడ్గం వ్రేలాడు తున్నది.

ఆశ్చర్యంతో అర్జునుడు ఆయన్ను సమీపించి "స్వామీ ! ఎవరికీ హించ తలపెట్టని ,కేవలం రాలిన పండ్లను మాత్రమే భుజించే తమరు పదునైన ఖడ్గమును మీమొలలో ఎందుకు కట్టుకున్నారు?శలవివ్వండి" అని అడి గాడు.    అందుకు ఆ బ్రాహ్మణుడు" నీవు అడిగేది వాస్తవమే, ఐతే నాకంట బడితే నేను నలుగుర్ని మాత్రం సంహరించ దలచుకున్నాను." అని పటపటా పళ్ళుకొరికినాడు.

"స్వామీ ఎవరానలుగురూ? శలవిస్తారా? నాకు తెల్సుకోవాలని కుతుహలంగా ఉంది" అని అడిగాడు. ఆయన తడుముకోకుండా, “ చెప్తాను, మొదటివాడు న్నాడే ఆపాపి  నారదుడు. వాని దుండగం చూడు. నా స్వామి  సుఖమును లేశమైననూ గమనించక  రాత్రనక పగలనకా, సర్వకాల  సర్వావస్తల యందూ , ‘నారాయణ!, నారాయణా ! అని జపిస్తూ  సదా తన కీర్తనలతో గానం చేస్తూ, సంగీతంతో నాస్వామికి నిద్ర లేకుండా చేస్తున్నాడు. నాస్వామి ఎప్పుడు ఆహారం తీసుకుంటాడు? ఎప్పుడు నిద్రపోతాడు? ఈభక్తుడు గానం చేస్తుంటే స్వామి ఉండలేడుకదా! . ఆదుర్మార్గుడు కనిపిస్తే శిరస్సుఖండించుదామని ఖడ్గమును సిధ్ధంచేసుకున్నాను.“ అని అన్నాడు. విస్తుపోయిన అర్జునుడు " రెండవ వారెవరు స్వామీ! "అన్నాడు .

”ఆ తెలివితక్కువ ద్రౌపది. ఆమె అవివేకము సాహసమూ చూడు.తింటున్న సమయంలో ఏడ్పుతో బొబ్బలిడ సాగింది.అప్పుడు ఈమెకోసం కామ్యక వనమునకు పరుగెత్తి, దూర్వాసుని శాపంనుండీ రక్షింపవలసి వచ్చినది. ఎంత గర్వము? తన ఎంగిలి కూడును నాస్వామి తినవలసి వచ్చింది.” అని అన్నాడు.”

"మూడవవాడు ఎవరు స్వామీ!" అని అర్జునుడు అడిగినాడు.

"ఆ నిర్దయుడు ప్రహ్లాదుడు .తనకోసం నాస్వామి సలసల కాగుతున్న నూనెలో ఉండవలసి వచ్చింది. మదపు టేనుగుల పాదాల క్రింద పడి త్రొక్కించు కున్నాడు.ఈయన కోసం వజ్రతుల్యమైన స్థంభమును పగుల కొట్టి బయటకు వచ్చినాడు”.అన్నాడు ఆ బ్రాహ్మణుడు 

“.ఐతే ఇక నాల్గవవాడు ఎవరుస్వామీ!" అని అడిగాడు అర్జునుడు.

"ఉన్నాడొక నిర్భాగ్యుడు.అర్జునుడు.నిజానికి అతడు దుర్జనుడు." అంటూ ఆవేశపడ్డాడు.

"అతడేంపాపం చేసినాడు స్వామీ!? "అని అడిగాడుఅర్జునుడు..

"చూడూ! నాజగన్నాధుని తీసుకుని పోయి కురుక్షేత్ర యుధ్ధమున నీచమైన తన సారధ్యమును వహింప జేసి నాడు .ఇది మహాప రాధము కాదా!” అన్నాడు.

వింటూ ఉన్న అర్జునుడు ఆపేదబాపని భక్తికి నిశ్చేష్టు డైనాడు. సహజంగా వయసుతోపాటు దూడకు కొమ్ములు పెరుగి నట్లుగా భక్తితోపాటు , గర్వమూ పెరుగుతూ ఉంటుంది. దానికి రావణాసుడే దృష్టాంతము. అర్జునునికి తాను కృష్ణ భక్తుడనే అభిమానం ఏర్పడింది. కనుక భక్తితోపాటు కావల్సినది వినయము.