
సిని నారదులు. 1. టి. రామకృష్ణ శాస్త్రి.
భక్త ప్రహ్లాద 1942 లో వచ్చిన పౌరాణిక చిత్రం. శోభనాచల ప్రొడక్షన్స్ వారు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం విష్ణు భక్తుడైన ప్రహ్లాద కథే ఈ సినిమా. ఈ కథ ఆధారంగా తెలుగులో వచ్చిన రెండవ చిత్రం ఇది. మరింత ఆధునిక సాంకేతిక విలువలతో కూడుకుని ఉంటుంది. ఆ రోజుల్లో సురభి తెలుగు నాటక సమాజం ఉపయోగించిన డ్రామా వెర్షన్ ఆధారంగా ఈ సినిమా డైలాగులను రూపొందించారు.
మొదటి భక్తప్రహ్లాద 1932 లో విడుదలైంది. ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమా కూడా.
దానవ చక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. విష్ణువు పేరు వినబడితేనే సహించలేని వ్యక్తి. అలాంటిది అతడికి పుట్టిన కుమారుడు, ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడౌతాడు. పసిప్రాయం నుండే విష్ణుభక్తిని అలవరచుకుంటాడు. విద్యనేర్చుకోను గురువు చండామార్కుల వద్దకు పంపితే విష్ణుభక్తిని తోటి విద్యార్థులకు కూడా బోధిస్తాడు. నయానా భయానా విష్ణుభక్తిని పోగొట్టలేక, చివరికి కన్నకొడుకునే చంపించే ప్రయత్నాలు చేస్తాడు దానవ చక్రవర్తి. తండ్రి చేయించిన అనేక హత్యా ప్రయత్నాల నుండి విష్ణుమూర్తి కటాక్షం వలన చెక్కుచెదరకుండా బయట పడతాడు.
చివరకు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంవాదంలో "విష్ణువు ఎక్కడుంటాడో చెప్పు అతడి సంగతి నేను చూస్తాను" అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు. ప్రహ్లాదుడు విష్ణువు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు అని చెప్పగా, ఈ స్తంభంలో ఉంటాడా అని ఒక స్తంభాన్ని గదతో పగల గొడతాడు. ఆ స్తంభం నుండి విష్ణుమూర్తి రౌద్రమూర్తి అయిన నరసింహావతారంలో బయటికి వచ్చి హిరణ్య కశిపుని సంహరిస్తాడు.
తారాగణం. వేమూరి గగ్గయ్య రాజేశ్వరి నారాయణరావు జి. వరలక్ష్మి రామకృష్ణ శాస్త్రి కుంపట్ల పరిపూర్ణ కోటేశ్వరరావు రామారావు కృష్ణవేణి
ఈచిత్రంలో నారద పాత్రధారి టి.రామకృష్ణ శాస్త్రి గురించి...
త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి
రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. త్రిపురారిభట్ల రామకృష్ణశాస్త్రి (ఏప్రిల్ 10, 1914 - మే 21, 1998) రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. రామకృష్ణశాస్త్రి 1920 1930వ దశకాల్లో చెందిన గాయకుడు. ఈయన తెనాలి శ్రీరామ విలాస సభలో దర్శకుడిగా పనిచేశాడు.రామకృష్ణ శాస్త్రి 1914, ఏప్రిల్ 10వ తేదిన రాఘవయ్య, కామేశ్వరమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని పెదరావూరు గ్రామంలజన్మించారు.
వంశ పారంపర్యముగా వచ్చిన 'తరంగ గానం'ను చిన్నవయసులోనే నేర్చుకన్నాడు. 9వ ఏట తెనాలి రామవిలాస సభలో బాలనటుడిగా చేరి అనేక నాటకాల్లో నటించాడు. ఈయన కొన్ని గ్రామోఫోను రికార్డుల్లో కూడా పాడాడు. 1926లో గుంటూరులో బాలమిత్ర సభను ప్రారంభించి, బాలనటులతో ఒక బృందాన్ని తయారుచేసిన దంటు వెంకటకృష్ణయ్య ఆహ్వానం మేరకు రామకృష్ణ శాస్త్రి ఆ సమాజంలోకి చేరి 'రోషనార'లో శివాజీ, 'కృష్ణలీలలు' లో యశోద, 'రామదాసు' లో రామదాసు పాత్రలు పోషించాడు. పువ్వుల సూరిబాబు, కళ్యాణి, నాగలింగం వంటి నటులు కూడా ఆ సంస్థలో ఉన్నారు.
నాటక సమాజాలు మూతపడిపోయినకాలంలో స్థానం నరసింహారావు, సి.యస్.ఆర్. ఆంజనేయులు లతో కలసి ఊరురా తిరిగి 'తులాభారం' నాటకంలో నారదుడుగా నటించి మెప్పించాడు. సినిమారంగంలో ఉంటూనే కలియుగ ఆంజనేయ బిరుదాంకితుడైన బేతా వెంకటరావు 'రామాంజనేయ యుద్ధం నాటకంలో నారదుని పాత్రలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ఇతర నాటక సమాజాలు ప్రదర్శించిన నాటకాలలో బిల్వమంగలుడు, శివయోగి, రామదాసు, కబీరు, నారదుడు పాత్రలలో నటించాడు.
నారదుడిగా రామకృష్ణ శాస్త్రి నటనను చూసిన దర్శకుడు చిత్రపు నరసింహారావు 1937లో తాన దర్శకత్వం వహించిన 'మోహిని రుక్మాంగద' సినిమాలో నారద పాత్రకు శాస్త్రిని ఎంపిక చేశాడు. అలా దాదాపు 12 సినిమాలలో నటించాడు.
నటించిన చిత్రాలు 1937: మోహిని రుక్మాంగద - నారదుడు 1938: భక్త మార్కండేయ 1940: మైరావణ 1941: దక్షయజ్ఞం 1942: ప్రహ్లాద 1942: సుమతి
1943: గరుడ గర్వభంగం
1952లో న్యూఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ సమక్షంలో స్థానం నరసింహరావు ప్రదర్శించిన 'శ్రీకృష్ణ తులాభారం' నాటకంలో నారద పాత్ర పోషించాడు.
రామకృష్ణ శాస్త్రి తన 84 ఏళ్ళ వయసులో 1998, మే 21న తెనాలిలోని తన అల్లుడి నివాసంలో మరణించాడు.