వందేమాతర గీతానికి 150 ఏళ్ళు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

వందేమాతర గీతానికి 150 ఏళ్ళు.

బంకించంద్ర ఛటర్జీ .

( వందేమాతరం గీతం పుట్టి 150 ఏళ్ళు అయిన సందర్బంగా )

(27 జూన్, 1838 - 8 ఏప్రిల్, 1894) (బంకించంద్ర ఛటోపాధ్యాయ; బెంగాలీ:'ఛటోపాధ్యాయ్' ని బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు. ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.

ఆధునిక భారతీయ సాహిత్య చరిత్రలో బంకించంద్ర చటర్జీ అగ్రగణ్యుడు. ఒక్క బెంగలీ సాహిత్యాన్నే కాక సమస్త భారతీయ సాహిత్యాలను ఆయన పంతొమిదో శతాబ్ది ఉత్తరార్ధంలో, ఇరవయ్యో పూర్వార్ధంలో అంటే సుమారు ఒక శతాబ్దం పాటు ప్రభావితం చేసాడు. పూర్వకాలంలో కానీ, ఇటీవల కాలంలో కాని ప్రపంచ సాహిత్య చరిత్రలో జాతుల విముక్తి పోరాటాలలో, స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక మహా కవి రచించిన దేశభక్తి గీతం తన జాతి జనులను ఉత్తేజపరిచి, ఉద్యమింపచేసిన సంఘటన, బంకించంద్రుడి విషయంలోలాగ మరొక దేశంలో, మరొక దేశ స్వతంత్ర్యోద్యమంలో సంభవించలేదు.

భారతదేశ స్వతంత్ర్యోద్యమం ఒక నిర్ణాయక ఫలసిద్ధి దిశగా చైతన్యవంతమవుతున్నప్పుడు వందేమాతరం గీతం దాని వేగాన్ని త్వరితం చేసింది. వంగదేశంలో కొందరు సాహిత్య విమర్శకులు, ఆధునిక కాలంలో బకించంద్రుడి వంటి నవలా రచయిత ఇంకొకరు లేరంటారు. ఆయన సృష్టించిన పాత్రలు కాల్పనిక సాహిత్యనికి చెందినవే ఆయన సృజనాత్మక సంవేదనలలో ఆయనకాయనే సాటి అని ఆ సాహిత్య విమర్శకుల అభిప్రాయం. ఆయన సాహిత్య ప్రతిభ బహుముఖమైనది. నవలలు, వ్యాసరచన, సాహిత్య విమర్శ, వ్యాఖ్యానరచనలో బంకించంద్రచటర్జీ వంగ సాహిత్యంలో కొత్త వరవడి సృష్టించాడు.

నవలా రచనలో తక్కిన ఆధునిక భారతీయ సాహిత్యాలకు కూడా ఆయనే దారిచూపాడు. అంతరాంతరాలలో ఆయనకు పురా భారతీయ సంస్కృతి పట్ల, హిందూ మతాచార విశ్వాసాల పట్ల అభిమానం ఉండేదని కొందరు సాహిత్యవేత్తల అభిప్రాయం. యూరప్ మేధావులు, సాహిత్యవేత్తలు భారతీయ తత్త్వ చింతనను సరిగా అర్థం చేసుకోలేదని వారిపట్ల ఆయనకు ఒక అభియోగం ఉండేదని కొందరు బెంగాలీ సాహిత్య విమర్శకులు భావిస్తారు. ఏమైనా బంకించంద్ర చటర్జీ (1838-1894, రబీంద్రనాద్ ఠాగోర్ (1861-1941, శరత్చంద్ర చటర్జీ (1876-1938) 20వ వంగ సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేశారని అజిత్ కుమార్ అనే సాహితీవేత్త అభిప్రాయం.

బంకించంద్ర చటర్జీ రచనలు ఉదాత్త ఆదర్శాలకు, రవీంద్రుడి రచనలు కాల్పనిక సౌందర్య తాత్త్వికతకు, శరత్ రచనలు సమాజ వాస్తవికతకు దర్పణాలని ఆయన అంటారు. మానవుడు చేరుకోగల ఉదాత్త శిఖరాలను బంకించంద్రుడి పాత్రలు అధిరోహిస్తాయి. ఉదారాశయాలు, ఉజ్జ్వల భావాలు, ధీరోధాత్త సాహసం, ప్రణయం, శృంగారం, ఆయన తన నవలలలో చిత్రించాడు. అనూహ్యమైన, మానవాతీతమైన త్యాగాన్ని ఆయన పాత్రలు ప్రకటిస్తాయి. బంకించంద్రుడిలో మాతృదేశాభిమానం ఆరాధన అపూర్వం. ఆనందమఠంలో ఆయన చిత్రించిన పాత్రలు ఎటువంటి త్యాగానికైన, సాహసానికైన వెనుదీయని ప్రతీకలు.

పురాతన భారతీయ వాఙ్మయంలో ధర్మప్రతిష్ఠాపన, నీతి, ఆధర్శమూ, సత్యమూ, అనుపాలించే పురాణ పాత్రలలాగ బంకించంద్రుడి కాల్పనిక, వీర శౄంగార, ఐతిహాసిక నవలల్లో ఆయన సౄష్టించిన పాత్రలు పాఠకులను సమ్మోహితులని చేసి ఆకర్షిస్తాయి. అట్లా అని ఆ పాత్రలు జీవ ఛైతన్యాన్ని, వాస్తవిక మూర్తిమత్వాన్ని విస్మరించవు. బహుశా అటువంటి పాత్రలను సృష్టించడానికి ఆయన ఎందుకు పూనుకున్నాడంటే ఆయన సమకాలీన సమాజంలో అటువంటి భావోద్విగ్నతలు కల రచనలే ఆయనకు కనపడలేదు కనుక. అటువంటి సృజనాత్మక చిత్రణ కూడా లేదు. అందువల్ల ఆయన చారిత్రిక పాత్రలను, పూర్వ చారిత్రిక వైభవ సన్నివేశాలను, సౌందర్య భావకతను, భావకతా సౌందర్యాన్నీ ఆలంబనం చేసుకొని రచనలు చేశాడని కొందరు సాహితీవేత్తలంటారు.

ఆయన స్త్రీ పాత్రలు సంప్రదాయ జీవిత శృంఖలాల మధ్య నిరాశోపహతంగా జీవించవు. సాహసం, నిర్భీకత, ప్రణయోద్వేగం, మానవానుభూతులు, శృంఖలవిచ్ఛేధం, జీవన సహజాత ఉధృతుల మధ్య అవి జీవిస్తాయి. అటువంటి స్త్రీ పాత్రలు పురుషులకేమాత్రం తీసిపోరు అని వంగ సాహిత్య విశ్లేషకులు, విమర్శకులు, బంకించంద్ర చతోపాధ్యయను ప్రసంసించారు. నవలా రచనలో ఆయన సృష్టించే సంఘటనలు చదివేవారిని అమితమైన ఉత్కంఠకు లోను చేస్తాయి. ఇతివృత్త నిర్వహణలో, సన్నివేశ పరికల్పనలో ఆయన సృజనాసక్తి, ప్రజ్ఞ, ప్రతిభ అసదృశమైనవి. ఆయన నవలలు చదువుతుంటే రమణీయ లోకాలలో సంచరిస్తున్న సాహిత్యానుభవం కలుగుతుంది పాఠకులకు. గంధర్వలోకాలలో విహరింపచేస్తాయి ఆయన భావలు. అట్లా అని కేవలం కాల్పనిక జగత్తు అనుకోకూడదు ఆయన సాహిత్య సృష్టిని. ఆకాశంలో మబ్బుల గుంపులోను, శతాబ్దాల కింద కట్టిన అతి విశాల గంభీరమైన కోటనో, విశాల వినీల సముద్రతీరాన్నో చూసిన మానవుడికి ఏ ఊహాజగత్తు సాక్షాత్కారమవుతుందో బంకించంద్ర చటోపాధ్యాయ రచనలు, ముఖ్యంగా నవలలు అటువంటి మానసికోత్తేజాన్నీ కలగజేస్తాయి.

కేవలం వాస్తవ జగత్తునే స్రుష్టించటంలో స్రుజనాత్మక ప్రతిభకు స్థానమెక్కడ ఉంటుంది? జగత్తులోని వాస్తవికతను చిత్రించడం వంతిది కాదు వాస్తవిక జగత్తును చిత్రించటం. కళాకారుడు తన సృజన ప్రతిభలో కృతకృత్యుడవుతడు. రామణీయకాన్ని ఆవిష్కరిస్తాడు. ఉద్యానవనానికీ, పెరటితోటకూ ఉండే వ్యత్యాసమే మహారచయితకూ, సామాన్య రచయితకూ మధ్య ఉంటుంది. భావుకతా పరమావదిని స్పృశిస్తాయి గొప్ప రచనలు.

రచనలు

కాల్పనికాలు

దుర్గేశ్ నోందిని (మార్చి 1865) కపాలకుండల (1866) మృణాళిని (1869) విషభ్రిష్క (విషవృక్షం, 1873) ఇందిర (1873, 1893) జుగలంగురియా (1874) రాధారాణి (1876, 1893) చంద్రశేఖర్ (1877) కమలకంటేర్ దప్తార్ (1875) రజని (1877) కృష్ణకంటేర్ ఉఇల్ (1878) రాజసింహ (1882) ఆనంద్ మఠ్ (1882) దేవి చౌధురాణి (1884) కమలకంఠ (1885) సీతారాం (మార్చి 1887) ముచీరామ్ గురేర్ జీవంచరిత

ధార్మిక రచనలు

కృష్ణ చరిత (1886) ధర్మతత్వ (1888) దేవతత్వ శ్రీమద్ వగవత్ గీత

రచనల సంకలనం

లలితా ఓ మానస్ (1858)

వ్యాసాలు

లోక్ రహస్య (1874, 1888) బింజన్ రహస్య (1875) బిచిత్ర ప్రబంధ (1876) (1892) సామ్య (1879) సేకరణ.