సావిత్రి ఐదు గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకునే వేళకి తాళం తెరిచి ఉంది.
ఆమె భర్త ఆనంద్ సాధారణంగా ఆఫీసు నుండి ఏడు గంటలకు తిరిగి వచ్చేవాడు. కాబట్టి ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. కాస్త కంగారుగా లోపలికి వచ్చేసరికి, భర్త ఆనంద్ సోఫాలో కూలబడి కనిపించాడు. అతగాడి ముఖం కోపంతో ఎర్రబడివుంది.
“ఈటైంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నావ్?” అరిచాడు అసహనంగా .
ఆమె అంది, " ’సునీతా పిల్లల ఆసుపత్రి’ దాకా వెళ్ళివస్తున్నానండి"
భర్త కోపంగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు ఊగిపోతూ. “పిల్లల ఆసుపత్రికా? మనకు పిల్లలు పుట్టే యోగం లేదని తెలిసీ ఆసుపత్రికి ఎందుకెళ్ళావ్? నన్ను అవమానించాలనేగా నీ ఉద్దేశం?" ఆనంద్ ముఖం జేవురించింది. తను తండ్రి అయే అదృష్టం లేదన్న అపరాధ భావం అతగాడి మాటల్లో ఎప్పట్లానే ధ్వనించింది.
"అయ్మయ్యో! అంత మాట అనకండి!" ఆత్మాభిమానం దెబ్బ తిన్న సావిత్రి గొంతు కంపించింది.
“మరెందుకే వెళ్ళావ్? వంట్లో బాగోలేదా? నేను ఆఫీసు కేళ్ళే వరకూ బానే ఉన్నావుగా!? మరీ అంత నలతగా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పచ్చుగా? నేను తీసుకెళ్ళనన్నానా? "
“మీకోసం చాలా సార్లు ట్రయ్ చేశానండీ! రెస్పాన్స్ లేదు"
ఆఫీసు మీద ఐ.టి రైడింగ్ జరిగింది. అందరి ఫోన్లూ చెకింగ్ పూర్తయేదాకా తమ అధీనంలో లేవు. ఆ విషయం అప్పుడు గుర్తుకొచ్చింది ఆనంద్ కి. కానీ భార్య ప్రవర్తన మీద సందేహం మాత్రం అట్లాగే మిగిలివుంది. భర్త ఆలోచనలను గ్రహించింది సావిత్రి. అతగాడి చేతిలో ఓ కాగితం ముక్క పెట్టింది మౌనంగా.
ఆరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ కటింగ్ అది. సునీతా పిల్లల ఆసుపత్రి ప్రకటన అందులో ఉంది. ఏడాది వయసు శిశువు రక్తస్రావం వల్ల తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉంది. బ్లడ్ గ్రూప్ ఎబి నెగెటివ్. అరుదైన ఆ బ్లడ్ గ్రూప్ గల రక్తదాతలు దయచేసి వెంటనే ఆసుపత్రిని సంప్రదించండి."
ఆశ్చర్యంగా తలెత్తి చూసిన భర్త వంక చూస్తూ నిదానంగా అంది సావిత్రి. "నాదీ ఆ బ్లడ్ గ్రూపే కదా! ఈ రేర్ గ్రూప్ బ్లడ్ వెంటనే దొరకటం చాలా కష్టం. అదృష్టం బాగుండి ఈ ప్రకటన మధ్యాహ్నం నా కంటబడింది. బోలెడంత డబ్బుపోసి బిడ్డను కాపాడుకోలేని పేద కుటుంబం అని తెలిసింది. ఒక వంశాన్ని నిలబెట్టే అదృష్టం నాకు ఎలాగూ లేకపోయింది. మరో పేద తల్లికి ఆ దురవస్థ పట్టకూడదనే నేను రక్తదానానికి సిద్ధపడిందండీ! బైల్దేరేముందు అందుకే మీకు కాల్ చేసింది. మీ దగ్గర నుంచి సమాధానం వచ్చే వ్యవధానం లేకపోయింది"
కన్నీళ్ళతో నిలబడి వున్న భార్యను అమాంతం గుండెలకు హత్తుకున్నాడు ఆనంద్.

