కాశీ ప్రయాణ కథలు - కీలెరిగి వాతపెట్టాలి - బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - keelirigi vatha pettali

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి, శ్రీలక్ష్మి, శివయ్య, పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకుతిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

''తమ్ముళ్ళు ఈరోజు మీకు కీలెరిగి వాతపెట్టాలి అనే కథ చెపుతాను వినండి అని బ్రహ్మయ్య కథ చెప్పడం ప్రారంభించాడు...

రామాపురం న్యాయాధికారిముందు ఇరువురు వ్యక్తలు చేతులు కట్టుకు నిలడి ఉన్నారు. " రామయ్య నువ్వు వ్యవసాయ భూమి కొనడానికి శివయ్య పౌర్ణమి రోజున వేయి రూకలు అప్పు ఇచ్చానని అతను ఎన్ని పర్యాయాలు అడిగినా రేపు ఇస్తాను మాపు ఇస్తాను అని చెప్పిన నీవు ఇప్పుడు శివయ్య అసలు నాకు డబ్బులే ఇవ్వలేదంటున్నావట నిజమేనా ? "అన్నాడు న్యాయాధికారి .

"అయ్యా నేను వ్యవసాయ భూమి కొన్నది నిజమే కాని శివయ్య వద్ద నేను ధనం తీసుకోలేదు అతని ఇల్లుకూడా ఎక్కడో నాకు తెలియదు "అన్నాడు రామయ్య.

"నువ్వు వ్యవసాయ భూమి ఎవరివద్ద కొన్నావు అతనికి ధనం మెత్తం ఒకేసారి చెల్లించావా" అన్నాడు న్యాయాధికారి.

"నేను మావీధిలోని రంగనాధం వద్దనుండి ఆభూమి కొనుగోలు చేసాను మొదట నాలుగువేల రూకలు ఇచ్చాను అనంతరం వారం తరువాత వేయి రూకలు ఇచ్చి పత్రాలు రాయించుకున్నాను "అన్నాడు రామయ్య.

న్యాయాధికారి తన సహయకుడిని పిలిచి కాగితం పైన ఏదోరాసి ఇచ్చి అతనిని పంపించి. "శివయ్య నువ్వు మీఇంటికి వెళ్ళి వెంటనే తిరిగి ఇక్కడకురా "అన్నాడు.

శివయ్య తన గుర్రంపైన తన ఇంటికి బయలుదేరాడు. కొంతసమయం గడచాక "రామయ్య అతను ఇల్లు బాగాదూరమా " అన్నాడు న్యాయధికారి.

"అవును ప్రభు దారిలో రెండు వాగులుకూడా దాటివెళ్ళాలి "అన్నాడు రామయ్య. "అంటే శివయ్య నీకు ధనం ఇచ్చింది యదార్ధమేనన్నమాట "అనగానే న్యాయమూర్తి సహయకుడు రంగనాధాన్ని తన వెంటపెట్టుకు వచ్చాడు, రంగనాధాన్ని చూస్తూనే "అయ్యారంగనాధం గారు రామయ్య మీవ్యవసాయభూమి కొనుగోలు చేస్తు మీకు ముట్టవలసిన ధనం రెండు దఫాలుగా ఇచ్చచాడట నిజమేనా "అన్నాడు న్యాయమూర్తి.

"అయ్య మెదట నాలుగు వేలరూకలు ఇచ్చి మిగిలిన ధనం మరో వారంలో ఇచ్చి పత్రాలు రాసుకుందాం అని గత పౌర్ణమినాడు మిగిలిన వేయిరూకలు ఇచ్చి పత్రాలు రాయించుకున్నాడు " అన్నాడు. రంగనాధం.

ఇంతలో ఇంటికివెళ్ళిన శివయ్యయ వెళ్ళివచ్చాడు

"రామయ్య గత పౌర్ణమినాడు శివయ్య వద్ద కాకుండా మరెవరివద్ద నువ్వు వేయి రూకలు అప్పు తీసుకున్నావో చెప్పు నీకు ఆరోజు అప్పు ఇచ్చిన వారిని కూడా పిలిపిస్తాను " అన్నాడు న్యాయమూర్తి. మౌనం వహించాడు రామయ్య.

"రామయ్య నువ్వు శివయ్య ఇల్లు దూరమా అని నేను అడిగినప్పుడు చాలాదూరం అని సమాధానం చెప్పావు అంటే నువ్వు శివయ్య ఇంటికి వెళ్ళావని నిర్ధారణ అయింది, శివయ్య పౌర్ణమి రోజు నీకు ధనం ఇవ్వడం అదేరోజు నువ్వ రంగనాధానికి ధనం చెల్లించి పత్రాలు రాయించుకున్నావు ఆవిషయం రంగనాధం ద్వారా నిర్ధారణ అయింది. మంచివాడవని ఎటువంటి పత్రాలు,హమీలు లేకుండా ధనసహయం చేసిన శివయ్యను నువ్వు మోసం చేసావు. శివయ్యకు ఇవ్వవలసిన ధనంతో పాటు నూరు రూకలు జరిమానగా కలపి మెత్తం ధనం ఒకనెలలో మాద్వారా చెల్లించాలి "అని తీర్పు ఇచ్చాడు న్యాయమూర్తి ' అన్నాడు బ్రహ్మయ్య.

అందరూ నిద్రకు ఉపక్రమించారు.