కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు.
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
మీఅందరికి ఈరోజు "గర్వం వీడిన రాజు" అనే కథ చెపుతాను వినండి అని కథ చెప్పడం ప్రారంభించింది శ్రీలక్ష్మి...
పూర్వం మన రాజ్యాన్నిచంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతను చాలా గర్విష్ఠిగా ప్రవర్తిస్తుండేవాడు. అతని మంత్రి పేరు సుబుద్ది.
రాజు గారికి తగిన గుణపాఠం చెప్పాలి అనుకుని, ఒకరోజు మంత్రి సుబుద్ది ''మహారాజా వయోభారంతో ఈమంత్రి పదవి నిర్వహించ లేకుండా ఉన్నాను, నేను వనవాసం వెళ్లి ప్రశాంతంగా నాశేషజీవితం ధ్యానం చేసుకుంటూ ఉండాలి అనుకుంటున్నాను'' అన్నాడు.
"మంత్రి వర్యా ఇక్కడ సుఖమైన జీవితం వదులుకుని అడవులలో ఆహారం లభించక ఎటువంటి సౌకర్యాలు లేని జీవితం మీరు కోరుకోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది" అన్నాడు రాజుగారు.
"ప్రభూ ఏ పండు రుచి దానిదే సపోటా బాగుందని మామిడి పండును వద్దనలేముకదా! ప్రతివారి జీవితము ప్రత్యేకమైనదే. అనుభవంలోనికి వస్తేకాని ఎదుట వారి జీవితవిలువ తెలియదు, శెలవు" అని నమస్కరించిన మంత్రి వెళ్లిపోయాడు.
కొద్దిరోజుల్లో తెలివైన తన మంత్రి లేకపోవడంవలన పలు ఇబ్బందులు ఎదుర్కొన్నరాజు, మంత్రిని వెదుకుతూ అడవికి వెళ్ళాడు. మహారాజు రాక గమనించిన మంత్రి కళ్లు తెరవకుండా ధ్యానం లో ఉన్నట్లు నటించసాగాడు.
"మంత్రివర్యా మేము మహారాజులం విచ్చేసాం" అన్నాడు బిగ్గరగా.
కళ్లుతెరచిన మంత్రి "మహారాజా స్వాగతం తమరు ఎలా ఉన్నారు " అన్నాడు.
"మీరు లేని లోటు మాకు చాలా ఇబ్బంది కలిగించింది. అయినా మంత్రివర్యా రాజభోగాలు, మమ్ములను కాదనుకొని మీరు ఈ అడవిలో కందమూలాలు, ఆకులు తింటూ ఎండా వానలను భరిస్తూ ఏంసాధించారు" అన్నాడు రాజుగారు.
"అతని మాటలకు మంత్రి ఏం సమాధానం చెప్పాడో ఊహించి చెప్పగలరా?" అన్నది శ్రీలక్ష్మి.
"అక్కా రాజ్యంలో ఉండగా ప్రతిరోజు రాజు దర్శనానికి మంత్రి వెళ్ళేవాడు. ఇప్పుడు రాజే మంత్రిని వెదుకుతూ అరణ్యంలోనికి వెళ్ళాడు. ఇది నమ్మలేని సత్యం, మహారాజు ఒక సన్యాసిని వెదుకుతూ రావడం ఆశ్చర్యం. ఎదటి వారికంటే, నేనే గొప్పఅనుకోవడం ఎంత తప్పో రాజు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. పదండి, ఎవరి విలువ వారిదే అని రాజ్యంచేరిన రాజు తన గర్వాన్నివదలి, మంత్రి సుబుధ్ధి సలహాతో చక్కటి పరిపాలన చేసాడు" అన్నాది పార్వతి.
ఆమె సమాధానానికి తృప్తి చెందిన అందరు నిద్రకు ఉపక్రమించారు.

