పాతాళ్ భువనేశ్వర్ - కర్రా నాగలక్ష్మి

patala bhuvaneswar

ఇది ఉత్తరాంచల్ లో ఉన్న మరో గుహ దేవాలయం . ఇది ఉత్తరాంచల్ పిత్తోడఘడ్ జిల్లా లో ఉంది. ఢిల్లీ నుంచి "ఖాట్గోదాం "వరకు ట్రైన్స్ ఉన్నాయి  అక్కడ నుంచి రోడ్డు మార్గం తప్ప రైలు మార్గం లేదు. లేదు అంటే ఢిల్లీ నుంచి కారు అద్దెకి  తీసుకోని ప్రయాణం చెయ్యొచ్చు .ఉత్తరాంచల్ పర్వత ప్రాంతాన్ని  "ఘరేవాల్" మరియు" కుమావు"గ విభజించారు . "ఘరేవాల్" మండలంలో కేదార్నాథ్, బదరీ నాథ్ ,గంగోత్రి, యమునోత్రి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి "కుమావు "మండలంలో నైనిటాల్, అల్మోడ,  పిత్తోరాఘడ్ మొదలైనవి ఉన్నాయి .

ఢిల్లీ నుంచి "అల్మోడ "కి 370కిమి,అక్కడ నుంచి "పాతాల్ భువనేశ్వర్ "కి దగ్గర దగ్గర 110కిమి.

"అల్మోడ " నుంచి బెరినాగ్ వెళ్ళే దారిలో "గ్ంగొలిహాట్ " 14కిమి దూరం లో ఉంది.

" ఢిల్లీ " నుంచి "ఖాటగోదాం "వరకు ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ లోని మైదానాలలో  మన ప్రయాణం సాగుతుంది. మళ్ళీ  మనకి కాలుష్య వాతావరణం అన్నమాట . "ఖాటగోదాం" నుంచి పాతాళ భువనేశ్వర్ వరకు అంతా ఘాట్ రోడ్డే . ఒక వైపు ఎత్తయిన పర్వతాలు వాటి మీద పొడుగైన కోనిఫర్ వృక్షాలు , దేవదారు వృక్షాలు మరో ప్రక్క లోతైన లోయలు దిగువున గలగలమని ప్రవహిస్తున్న "వనగంగా" నది . అక్కడక్కడ ప్రజా ఆవాసాలు. ఘాట్ మొదలవగానే టెంపరేచర్ బాగా పడిపోతుంది. చలి మొదలవుతుంది . ప్రజా ఆవాసాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలలో మనకి మెట్ల వ్యవసాయం  కనబడుతుంది. మెట్ల వ్యవసాయ పద్దతిలో వీరు వరి , జొన్న కూరగాయలు, బంగాళా దుంపలు మొ: కమలా నారింజా, నాష్పతి ,యాపిలు మొదలయిన పండ్లు ఇక్కడ పండిస్తున్నారు . అక్కడక్కడ గొట్టాల ద్వారా ప్రవహింపజేస్తున్న ప్రకృతి సిద్దమైన వేడినీటి ప్రవాహాలు. చిన్నప్పుడు మనం చదువుకున్న కధలలో  కాకులు దూరని కారడవి చీమలు దూరని చిట్టడవి అనే వాక్యాన్ని ఉపయోగించేవారు.  ఈ అడవులని చుస్తే అది నిజం అనిపిస్తుంది. సూర్య కిరణాలు చొరబడ లేనంత దట్టంగా ఉంటాయి ఈ అడవులు . ఏవో  పేరు తెలియని రకరకాల పువ్వులు గాలికి ఊగుతూ మనకు స్వాగతం పలుకుతున్నట్లుగ అనిపిస్తుంది. కొండల మీద నుంచి క్రిందికి దుముకుతున్న జలపాతాల గలగలలు మనలని మైమరపింప జేస్తాయి .రోజూ కలుషిత గాలి పీల్చి పీల్చి పాడయిన  ఊపిరి తిత్తులకు ఒక్క సారి కాలుష్య రహితమైన గాలి తగలగానే తిండి లేనివాడికి పంచ భక్షాలు దొరికినంత ఆనందం కలుగుతుంది.  ఊపిరితిత్తు లకు . ఆ అడవుల మీదుగా వీచే గాలిలో అక్కడ ఉండే అనేక రకములైన ఔషధముల  గుణాలు కలిసి ఉంటాయి . అవి మన శరీరాన్ని శుద్ధిచేస్తాయి.

ఇది గుహ ద్వారం

పాతాళ భువనేశ్వర్ చాల చిన్న గ్రామం . ఈ గుహా మందిరం ఊరి నుంచి 2,3 కిమీ సన్నని కాలి బాటన ప్రయాణించాలి గుహ చేరడానికి నడక తప్ప మరో మార్గం లేదు. గుహ ముందర చిన్న శివాలయం  ఉంటుంది . గుహ ద్వారం చాలా చిన్నది. ఒక మనిషి కూర్చొని ప్రక్కల వేలాడుతున్న గొలుసులు పట్టుకొని జాగ్రత్తగా  జారుతూ లోనికి వెళ్ళాలి. అలా ఓ వంద అడుగులు లోపలికి వెళ్ళిన తరవాత  90 అడుగుల లోతు 180 మీటర్ల పొడువు ఉన్న గుహల సముదాయం. ఈ గుహలు సున్నపు రాతి గుహలు.  ఇవి ప్రకృతి సిద్దంగా నిర్మించబడ్డాయి. సంవత్సరాలు ఒకేచోట నిరంతరం నీళ్ళు ప్రవహించడం వల్ల ఏర్పడ్డ రూపాలు మనకి మన ఆరాధ్య దేవతా మూర్తులుగా కనబడతాయి. అందులో శివుని జటాఝూటం , వేయి పడగల శేషుడు,  ఐరావతం,  కల్పవృక్షం , కామధేనువు ,బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తో పాటు 33 కోట్ల దేవి,దేవతల ఆకారాలు కననడతాయి. ఇవి కొన్ని గుహల సముదాయం .

ఇక్కడ ఒక శివలింగం 

అది కూడా ప్రకృతిసిద్దం గా ఏర్పడింది అని చెప్తారు ఆ పక్కనే కొంత దూరంలో ఒక చిన్నపిల్లవాని మొండెము ఆకారం కనబడుతుంది దీనిపైన నిరంతరమూ నీటి బిందివులు పై కప్పు నుండి పడుతూ ఉంటాయి . వినాయకుని తల నరికిన పరమశివుడు ఏనుగు తల తెచ్చి అతికించి నంతవరకు ఇక్కడ వినాయకుని మొండెము ఉంచారని దానికి గుర్తుగా ఇక్కడ శిలా రూపాన్ని వదిలి పెట్టారని  చెప్తారు.

ఇది శివుని ఝఠాఝూటం

ఈ గుహలో నాలుగు ద్వారాలు కనిపిస్తాయి ఇవి 1)పాప ద్వారము 2) రణ ద్వారము 3) మోక్ష  ద్వారము 4)ధర్మ ద్వారము  పాప ద్వారము రావణుని మరణానంతరము మూసుకు   పోయిందట. రణ ద్వారము మహాభారత యుద్దానంతరము మూసుకు పోయిందిట. మిగిలిన రెండు ద్వారాలు తెరిచి ఉన్నాయి.ఇక్కడ నుండి కైలాస్ పర్వతానికి గుప్తమార్గం ఉన్నదని అంటారు.

స్కంద పురాణంలో మానస ఖండం లో 800 శ్లోకాలు ఈ గుహల గురించి వర్ణించడం జరిగింది. ఈ గుహలని మొట్ట మొదటగా కనుగొన్నది త్రేతాయుగం లో సూర్య వంశానికి చెందిన ఋతుపర్ణ మహారాజు.అది ఎలా  అంటే నల మహారాజు తన భార్య అయిన దమయంతి చే ఒకానొక పందెములో ఓటమి పొందుతాడు.  శిక్ష నుండి తప్పించు కొనడానికై రుతుపర్ణుని సహాయం కోరుతాడు నలుడు. అప్పుడు ఋతుపర్ణుడు నలుని ఈ అరణ్యమున విడిచిపెట్టి తిరిగి తన రాజ్యమునకు -పోవు మార్గములో కొంత సమయము విశ్రాంతి కొరకై చెట్టు నీడన విశ్రమిస్తాడు. అప్పుడు ఒక అందమయిన జింక "నన్ను వేటాడకు రాజా "అంటూ పరుగెత్తుకొని పోవడం కనిపిస్తుంది. "నేను జింకను వెంటాడనేలేదు .మరి జింక అలా అన్నది అంటే వెంబడించమనా?"అని

తలపోసి ఆ జింకని వెంబడించెనట .కొంత దూరం పరుగెత్తిన జింక ఒక ప్రదేశంలో అంతర్దానమైనదట. ఆ ప్రదేశమును ఋతుపర్ణుడు పరిశీలించగా  అక్కడ రామగంగా ,గుప్తగంగా మరియు సరయు నదుల సంగమమని  తెలుసుకొని "ఇంత పవిత్రమైన ప్రదేశమునకు మాయ జింక ఏదో కార్యార్దమై దారి చూపెనని "తలచి పొదలు తొలగించి చూడగా  పాతాళభువనేశ్వర్ గుహలు బయల్ప్దడినవని ఇక్కడ స్తల పురాణం వివరిస్తోంది. త్రేతాయుగములో పాండవులు మహాభారత యుద్దానంతరము ఇక్కడ కొద్ది రోజులు ఈ గుహలలో తపస్సు చేసుకొని ఇక్కడ గల గుప్త మార్గము గుండా కైలామునకు వెళ్లేరని చెప్తారు.

ఆది శంకరాచార్యుల వారు పూజించిన  శివలింగం కలియుగములో ఆది శంకరులు కుడా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని ఇక్కడ నుండే కైలాసానికి వెళ్లినారని చెప్తారు. ఈ గుహలో గల శివలింగమునకు   వెండి, పాదరసము పూసి అప్పటి వరకు జ్వలిస్తున్న లింగాన్ని ఆది శంకరులు చల్లపరిచేరని  అంటారు.ఈ  పాతాళభువనేశ్వరుని  దర్శించుకుంటే చార్ ధామ్ యాత్ర చేసినంత పుణ్యం వస్తుందని స్తానికుల నమ్మకం. మరో విషయం ఈ గుహలలో రాతికి చెవి ఆనిస్తే నీటి  ప్రవాహ "గల గలలు" వినిపిస్తాయి.

మహానగర ఒత్తిడులనుంచి తప్పించుకొని మంచి రిలాక్శేషన్ కావాలంటే పాతాళభువనేశ్వర్ వెళ్లవలసిందే.

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు
Kashi Prayana Kathalu - vikatakavi telivi
కాశీ ప్రయాణ కథలు - వికటకవి తెలివి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు