పుస్తక సమీక్ష - సిరాశ్రీ

Book Review - Telugu Velugu
పుస్తకం: తెలుగు వెలుగు
సంకలనం: ద్వా నా శాస్త్రి
వెల: 60/-
ప్రతులకు: విశాలాంధ్ర పుస్తక విక్రయశాల


కొన్ని పుస్తకాలకి పరిచయం అవసరం ఉండదు. అట్ట చూస్తేనే విషయం అర్థమైపోతుంది. అలాంటి పుస్తకాల్లో ఇదొకటి. ఇది ఒక తెలుగు సాహిత్య విషయాలకు సంబంధించిన ప్రశ్నోత్తరాల పుస్తకం. తెలుగు భాష, సాహిత్యం పట్ల ఆసక్తి కలవారందిరికీ ఇది మంచి కాలక్షేపం. వివిధ పోటీ పరీక్షలు రాసే వారికి మాత్రం నిధినిక్షేపం. దీన్ని సంకలించింది సుప్రసిధ్ధ ఆచార్యూ శ్రీ ద్వా నా శాస్త్రి.

2005 లో వచ్చిన ఈ పుస్తకం ఇంచుమించు ప్రతి ఏడూ పునర్ముద్రణకు నోచుకుంటోంది. 3300లకు పైగా ప్రశ్న జవాబులను 44 అధ్యాయాలుగా విభజించారు; ఆరుద్రగారు సమగ్రాంథ సాహిత్యాన్ని విభజించిన తీరులో అన్నమాట. 

జానపద సాహిత్యం, నన్నయ యుగం, శివకవి యుగం, తిక్కన యుగం, ఎఱ్ఱన యుగం ఇత్యాదిగా మొదలై కథా కావ్యాలు, పురాణాలు, శతకాలు, కథా, నవల, నాటకాల మీదుగా నడుస్తూ జంటపదాలు, నానార్థాలు, పర్యాయపదాలు, కలం పేర్లు వగైరాల దిశగా సాగి సామెతలు, అనుబంధ ప్రశ్నలతో ముగుస్తుంది ఈ 161 పేజీల పుస్తకం.

తెలుగు సాహిత్యానికి, భాషకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసనుకునే వారికి కూడా ఈ పుస్తకం కన్ను తెరిపిస్తుంది. ఎందరో ప్రాచీన ఆధునిక కవులు చెప్పిన గొప్ప వాక్యాలు, వారి కవితా పంక్తులు ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకం ప్రశ్నోత్తరాల రూపంలో ఉన్నా భాషా ప్రియులకి బాగా రుచిస్తుంది.

ప్రయాణ సమయాల్లో ఈ పుస్తకం చేతిలో ఉంటే ఒక మంచి గురువులాంటి స్నేహితుడు పక్కన ఉన్నట్టే.

కాలక్షేపం మాత్రమే కాదు. అదృష్టం పండి మా టీవీలో నాగార్జున నుంచి పిలుపొస్తే "కోటి" సంపాదించడానికి కూడా ఇందులో ప్రశ్నలు అందిరావొచ్చు. ఇంకెందుకు ఆలశ్యం. కొనేసి చదివేయండంతే.