కథా సమీక్షలు - సమ్మెట ఉమాదేవి

katha sameeksha

 

సమీక్ష:   సమ్మెట ఉమాదేవి 

గోతెలుగు 126 వ సంచిక!

ప్రస్తుత కథా సాహిత్యంలో గొప్ప ఆశా కిరణం రాచమల్లు ఉపేందర్ . మంచి విషయమున్న కథలు రాస్తున్నారు .. అయిదారు కథా సంకలనాలు వేశారు కూడా. మంచి కథలకు ప్రేరణ ప్రత్యేక్షానుభవాలు ద్వారానే కలుగుతుంది. సామజిక పరిస్థితుల పట్ల రచయిత పరిశీలన, కథలో ప్రతిఫలిస్తుంది. సమస్య పట్ల అతని అవగాహన కథను సమర్థవంతంగా రాయడానికి ఉపయోగపడితే.. సమస్యపట్ల రచయితకు ఉన్న స్పందన, కథను పరిపుష్టం చేసింది. "ఆకులు రాలిన అడవిలాగున్నాడు చెంచయ్య. కళ్ళల్లో తడి, గుండెల్లో అలజడి. ..

"మనిషి బతుకు చారెడు సుఖం, పుట్టెడు దు:ఖం. చెంచయ్య ఏనాడు చారెడు సుఖానికి నోచుకోలేదు. బాల్యంలో పాలబుగ్గల జీతగాడు. పెద్దయ్యాక మీసం వచ్చిన పనోడు. పెళ్ళయ్యాక కొమ్ములు తిరిగిన కూలోడు. సూటిగా చెప్పాలంటే కరువు, కాటకాల మీద నిలిచిన మొనగాడు." .......

వంటి వ్యాఖ్యలు చెంచయ్య అనే పాత్ర జీవితం పట్లా... పల్లెలోని ఓ సగటు రైతు కూలి కష్ఠాలపట్ల పట్ల అతని సహానుభూతిని తెలుపుతుంది.

ఇక్కడ పల్లె ప్రజల జీవితాల్లో పెంపుడు జంతువుల అవసరాన్ని రచయిత చెప్పక చెబుతారు . వాటి మీద సంపాదనతో బ్రతుకుతున్నా వాటిని కన్న బిడ్డలా చూసుకుంటూ వాటి పట్ల ప్రేమాభిమానాలు పెంచుకునే రైతులు పల్లెల్లో ఉంటారు.. ఈ విషయం ఈ కథకు వేసిన బొమ్మలో కూడా స్పష్టంగా కనపడుతుంది .. ఒకే బొమ్మలో పేద రైతును , అతని భార్యను, తరిమినట్టుగా వస్తున్న ఆవులను చిత్రకారులు మాధవ్ గారు చక్కగా చిత్రీకరించి కథ పట్ల ఆసక్తిని రేకెత్తించారు ..

ఇక కథలోకి వస్తే .. అనారోగ్యం పాలయిన అతని భార్య వైద్యానికి సొమ్ములు లేక పెంచుకుంటున్న ఆవులను అమ్మలేక మధన పడుతుంటాడు చెంచయ్య. చెంచయ్య భార్య ఆరోగ్యం విషమస్థితిలో ఉండి తప్పని సరిగా తన బిడ్డల్లా పెంచుకున్న ఆవులను అమ్ముకో వడానికి సిద్ద పడతాడు, తీరా వాటిని అమ్ముకున్నాక ఎంతో ఖేదపడతాడు .. సొమ్ములందాయి కదా అని తిరిగి వెంటనే ఇంటికి వెళ్ళలేకపోతాడు..

చిత్రంగా ఆవులు కూడా కొన్న వారి వెంట వెళ్ళడానికి సిద్ద పడక మొరాయిస్తుంటాయి.. కొన్న వారు విసిగిపోయి ఇక వాటిని సంభాళించడం కష్టమని అనుకుని ఆవులను వదిలించుకుని సొమ్ము వాపసు తీసుకుని వెళ్ళిపోతారు. చెంచయ్య పరమానంద భరితుడవుతాడు. మరి భార్య వైద్యానికి సొమ్ములెలా..? ఈ ఆలోచన రాగానే భార్య మంగళ సూత్రం గుర్తుకు వచ్చి అది అమ్మడానికి సిద్దమ యి ఇంటికి తిరుగు ముఖంపడతాడు.

కథలో చర్చించిన సగటు రైతు ఆర్ధిక సమస్యలు, తరుముకొచ్చే అనారోగ్యాలు అన్నీ కఠినమయిన వాస్తవాలే.. వాటిని వివరించడానికి రచయిత ఎన్నుకున్న వర్ణన తీరు కూడా బాగా అమరింది.

కథలలో క్లుప్తత ఉండాలి.. బ్రీవిటి ఉండాలి వర్ణనలు ఎక్కువగా ఉండకూడదు. అనే వారిని పట్టించుకోకుండా కథకు ఏది అవసరమో దాన్నే ప్రధానంగా భావించి రాస్తే తప్పకుండా ఆ ఉత్తమ కథ అవుతుంది. ఈ కథ ఆ కోవకు చెందినదే.

"ఊహించని వాటిని ఉత్పత్తి చేస్తుంది కాలం..." "కళ్ళు ఊరి చివర రాముడి చెరువు తూములను తలపిస్తుంటే.." "చీకట్లను తరుముతున్న వెలుగులు సిటిని వెలిగిస్తుండగా సిటి పొలిమేరల్లోకి ప్రవేశించాడు."

ఇలాంటి వర్ణనలు కథకు చాలా అవసరం.. కానీ "నీ అవస్థ సూస్తుంటే నా గుండె పగిలేలా ఉందే. సంసారం కోసం నాతో కల్సి యెన్ని సెరలుబడ్డవ్. .. ఈ వాక్యం అమరినట్లుగా.. "నా కోసం ఎన్నో" త్యాగాలు" సేసింది. ఈ వాక్యం అమరిందా .! అన్నది చూసుకోవాలి.

అలాగే ..

ఉన్నట్లుండి చెంచయ్యకు పెళ్లి నాడు భార్య మెడలో కట్టిన పసిడి మంగళసూత్రం ట్రంకుపెట్టెలో దాచిపెట్టిన సంగతి గుర్తుకొచ్చింది. 'దాన్నమ్మి ఆపరేషన్ చేయిస్తా!' అనుకుంటుండగానే చెంచయ్య ముఖం కొట్ల శక్తిని పొందుకుంటున్నట్లు..

మంగళ సూత్రం టాక్ పెట్టెలో ఎందుకు ఉంటుంది ..? మేడలో కదా ఉండవలసింది ..అన్నది చిన్న అనుమానం ఇలాంటి చిన్న చిన్న సాంకేతిక లోపాలను పక్కన పెడితే ఒక సాధారణమయిన రైతుకు అతను పెంచుకున్న జంతువులే ఆత్మ బంధువులు అని పోలుస్తూ చెప్పిన రాచమల్లు ఉపేందర్ రాసిన ఈ కథ ఆత్మ" బంధువులు" కథ ఖచ్చితంగా ఉత్తమమయిన కథ.

 

 

 

 ఈ కథను ఈ క్రింది లింక్ లో చదవచ్చు... http://www.gotelugu.com/issue126/3286/telugu-

stories/aatmabandhuvulu/

 

మరిన్ని వ్యాసాలు

Akashayanam lo anagarikatha
ఆకాశయానంలో అనాగరికత (వ్యాసం)
- మద్దూరి నరసింహమూర్తి
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
అమ్మ పాదాల వద్ద స్వర్గం ఉంది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - prathubhaku Pattam
కాశీ ప్రయాణ కథలు - ప్రతిభకు పట్టం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana kathalu - Pratyupakaram
కాశీ ప్రయాణ కథలు - ప్రత్యూ పకారం
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
దాసరి నారాయణ రావు
దాసరి నారాయణ రావు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు