సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం
 
అత్యుత్తముడైన దైవము, అత్యుత్తమమైన   క్షేత్రము, అత్యుత్తమమైన తీర్థము ఒకేచోట  ఉన్న పుణ్యస్థలం ఏది అని అగస్త్యమహర్షి  కుమారస్వామిని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు  సమాధానం యివ్వగలవాడు పరమశివుడే  అని చెప్పి, అగస్త్యమహర్షిని, ఆయన సతిని,
ఇతరులను వెంటబెట్టుకుని కుమారస్వామి  కైలాసానికి వెళ్ళాడు. కైలాస వర్ణన చేస్తున్నాడు  తెనాలి రామకృష్ణుడు.

క్షోణీ రేణు కృతంబులంజనరజో గుచ్ఛాసితంబుల్, తమ
శ్శ్రేణుల్ దూషితపూష భీషణ గతిన్  జృంభించియున్ దూలె న
క్షీణోత్తంభిత శక్తిభృద్భట శిరస్సీమా కిరీట స్ఫుర
న్మాణిక్యాతప పల్లవస్తబక సామగ్రీ హృతాగ్రంబులై                             (శా)

కుమారస్వామి అనుచరుల పాదధూళి నల్లగా పైకి లేచి ఆ దుమ్ము, ధూళిలో  కాటుకపొడి కుప్పల్లా నల్లగా కనిపించకుండా ఐపోయాయి లోకాలు. సూర్యుడిని ధిక్కరించి, ఆయన వెలుతురు పడకుండా చేసి, ఆయనకు భయాన్ని కలిగించాయి. ఐనప్పటికీ ఆ అనుచరుల కిరీతాలలో ఉన్న మాణిక్యముల కాంతులచేత వెలుగులు  ప్రసరించి లోకాలన్నీ మరలా కనిపించాయి.

స్మర శశి తటిదజ పవమా
న రవి సుధా సలిల మునిజన క్ష్మా రిష్టా
సురమృత్యు జ్వలనజలగు 
సురవేశ్యలు గొలిచిరపుడు సుబ్రహ్మణ్యున్                (కం)

మన్మథుడు, చంద్రుడు, మెరుపులు, బ్రహ్మదేవుడు, వాయువు, సూర్యుడు, అమృతము, నీరు, మునిజనులు, భూమి, దక్షుని పుత్రికయగు అరిష్ట, దేవతలు, మృత్యువు, అగ్ని  యిందరి అంశాలతో, యిందరి లక్షణాలతో, యిందరి కారణంగా జన్మించిన దేవవేశ్యలు 
ఐన అప్సరలు సుబ్రహ్మణ్యుడిని కొలిచారు అప్పుడు. అత్యద్భుతమైన అతిచిన్ని పద్యాల జాబితా తాయారు జేస్తే ఈ పద్యం తప్పకుండా అందులో ఉంటుంది! దేవవేశ్యలు, ఆ మాటకొస్తే ఏ వేశ్యలైనా, మన్మథ బాధను కలిగిస్తారు. చంద్రుడిలా చల్లగా  అనిపిస్తారు, చల్లని మాటలు చెబుతారు, ఆయనకు ఉన్నట్టే కళంకం ఉంటుంది! మెరుపు తీగల్లా వస్తారు, పోతారు వారి పని పూర్తి కాగానే. శాశ్వతంగా వెంట ఉండరు! గాలివాటంగా ఎక్కడ ఎక్కువ లాభం వుంటే అక్కడికి వెళ్తారు. సూర్యుడిలా ఊరికూరికే మండిపోతారు, తాపానికి గురిజేస్తారు. అమృతంలా తీయగా అనిపిస్తారు, కానీ లోపల హాలాహలం వంటి  వాళ్ళు! నీరులాగా ప్రవహిస్తూ, చంచలంగా, వెళ్ళిపోతారు. మునిజనుల్లాగా మౌనంగా తమ పని చేసుకునిపోతారు, కోరికలు తీరేదాకా తపస్సు చేస్తారు. తర్వాత చెక్కేస్తారు అక్కడినుండి. భూమిలాగా ఓర్పుగా ఉంటారు, తమ పని అయ్యేదాకా మాత్రమే, అంతే కాదు, భూమికి బహు భర్తృక అని పేరు, ఎందఱో నాథులు, ఇవ్వాళ ఒకడితో ఉంటుంది, రేపు ఎవడితోనో!
ఎవరికిందా శాశ్వతంగా ఉండదు! కనుక కూడా వారు భూమివంటివారే! అరిష్టాన్ని తెచ్చిపెడతారు. దేవతలలాగా పరోక్షప్రియులు, అంటే సూటిగా తిన్నగా ఉండవు వారి మాటలు, నడతలు కూడా, మర్మగర్భంగా మాట్లాడుతారు. మృత్యువు లాంటివారు, అపకీర్తిని 
తెచ్చిపెడతారు, అది మృత్యుసమానము. అగ్నిలాగా సమస్తాన్నీ దహించివేస్తారు, కీర్తిని, డబ్బును, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని యిలా అన్నిటినీ బూడిద చేస్తారు. కనుక అగ్నిలాంటి  వారు, వారు దేవవేశ్యలైనా వేశ్యలే అని చురక! వారూ కుమారస్వామిని కొలిచారు.

దైవతభట భుజశిఖర 
వ్యావల్గన్నవకృపాన వల్లికలలరెన్ 
దేవపథ వారినిధి సలి
లావిష్కృత విషమషీ మహార్చులుఁ బోలెన్     (కం) 

దేవభటుల భుజశిఖరములనుండి వ్రేల్లాడుతున్న తీగలవంటి, సానపట్టిన, నల్లగా మెరుస్తున్న కత్తులు ఆకాశ మార్గంలో ఉన్న సముద్రమునుండి పుట్టిన విషము, హాలాహలము అన్నట్లు  ఉన్నాయి.  

నయనత్రిభాగ దరహా
సయుతంబుగ సాధ్యసతులు చల్లినలాజల్ 
నయనాయుధ తనయాయుధ 
చాయ లతికావళులం గుసుమసమత వహించెన్       (కం) 

సాధ్యుల సతీమణులు లాజలు, పేలాలు చల్లారు. కనుల కొలకులకు వ్యాపిస్తున్న నవ్వులతో, కనులతో కూడా నవ్వుతూ వారు చల్లిన పేలాలు, దట్టంగా లతల్లాగా ఉన్న కుమారస్వామి  ఆయుధములమీద పడి, తీగలమీద పూలలాగా మెరిశాయి.  

వివిధ దివిషద్వధూ ముక్త దివిజవిటపి 
కుసుమకేసర లసదంసకూటుఁడగుచు
వేల్పుఁబడవాలు కాదు వాలు విరియఁబడిన
కందమునఁ బొల్చు దుర్గ కంఖాళ మనఁగ                  (తే.గీ) 

ఎందఱో దేవతాకాంతలు విడిచిన, విసిరిన దేవలోకపు కల్పవృక్షపు కుసుమముల పుప్పొడి పడి, ఆయన మూపురములు రంగురంగుల పూల రజముతో, గిరినుండి వెలువడిన దుర్గాదేవి  వాహనమైన సింహంలా కనిపించాడు.  

(కొనసాగింపు వచ్చేవారం)
***వనం వేంకట వరప్రసాదరావు.

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు