సన్మానం! - బొల్లిముంత వెంకట రమణా రావు

Sanmanam

సదానందం పెద్ద రచయిత కాదు. ఒక మోస్తరు రచయిత. అతని కథలు, కవితలు చదివే పాఠకులు కొద్దిమందే ఉన్నారు. అది కూడా "మీరు రాసిన తర్వాత చదవక చస్తామా!" అన్నట్టు కాదు. సమాజం బాగుండాలి. అందులో నా వంతు ఉండాలి అనేది అతని ఉవాచ. సాహిత్య సభలకు వెళ్లడం అతనికి అంతగా ఇష్టం లేదు. దాని బదులు ఇంట్లో కూర్చొని రాయడానికే ఇష్టపడేవాడు. "పాఠకుడి మనసులో చోటు దక్కితే చాలు; వేదిక మీద కుర్చీ అవసరం లేదు" అనేది అతని నమ్మకం.

అతని స్నేహితుడు ప్రభాకర్ "సృజన" అనే సాంస్కృతిక సంస్థను నడిపేవాడు. ప్రతి నెలా సభలు, సన్మానాలు, పురస్కారాలు ఏర్పాటు చేసేవాడు. చిన్న రచయితలను కూడా వేదికపైకి పిలిచి శాలువా కప్పడం, జ్ఞాపిక ఇవ్వడం అతనికి గౌరవప్రదమైన పనిలా అనిపించేది.

ఒకరోజు ప్రభాకర్ పరుగులు తీస్తూ సదానందం దగ్గరకు వచ్చాడు.

"అపద్బాంధవా! అనాథ రక్షకా! నువ్వే దిక్కు. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. నా ఒక్క తప్పు కాస్త క్షమించి, ఓ పదిహేను వేల రూపాయలు అప్పుగా ఇచ్చి ఈ దీనుడిని కనికరించు. రెండు నెలల్లో తిరిగి ఇస్తాను. మా స్నేహం మీద ఒట్టు. నువ్వు వడ్డీ అడగవద్దు. నా నడ్డి విరగొట్టవద్దు. నీ డబ్బులు నీకు నచ్చిన, నీవు మెచ్చిన స్వీట్ బాక్స్‌లో పెట్టి ఇస్తాను," అన్నాడు.

సదానందం ఎలాంటి రసీదు లేకుండానే డబ్బు ఇచ్చాడు.

రెండు నెలలు గడిచాయి.

ఆరు నెలలు దాటాయి.

ఏడాది పూర్తయింది.

అప్పుడప్పుడూ ప్రభాకర్, "నీ డబ్బు ఇవ్వాలి. చాలా బాకీలు ఉన్నాయి. నీ అప్పు తీరిస్తేనే నాకు మనశ్శాంతి. లేదంటే అశాంతి," అనేవాడు.

సదానందం మాత్రం, "నా కోసం ఇంకొకరి దగ్గర అప్పు చేసి చేతులు కాల్చుకోవద్దు. వీలైనప్పుడు ఇవ్వు," అని నవ్వేసేవాడు.

అతనికి డబ్బు కంటే స్నేహమే ముఖ్యం. అదే అతని బలహీనత.

కొంతకాలానికి "సృజన" సాహితీ వార్షికోత్సవంలో సదానందానికి సన్మానం చేయాలని ప్రభాకర్ నిర్ణయించాడు.

నిజానికి ఆ సన్మానం సదానందానికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే మొదట "వద్దు... వద్దు..." అని నిరాకరించాడు.

"నువ్వు రాకపోతే నా మీద ఒట్టు," అని ప్రభాకర్ పట్టుబట్టాడు.

ఇక చేసేదేమీ లేక సభకు వెళ్లాడు.

వేదికపై బాహుబలిలాంటి నలుగురు సాహితీవేత్తల మధ్య అతనికి శాలువా కప్పారు. జ్ఞాపిక ఇచ్చారు.

"నిశ్శబ్ద సాహిత్యసేవకుడు..." అంటూ పొగిడారు.

చప్పట్లతో సభ మార్మోగిపోయింది. అందరూ అభినందించారు.

కానీ ఆ హడావుడిలో సదానందానికి ఆనందం కన్నా సంకోచమే ఎక్కువగా అనిపించింది.

నాలుగు నెలల తర్వాత సదానందానికే డబ్బు అవసరమైంది. ప్రభాకర్‌ను తన డబ్బు గురించి అడిగాడు.

"ఇంత తొందరేమిటి? చాలామందికి ఇవ్వాలి," అంటూ ప్రభాకర్ మాట దాటవేశాడు.

రెండుసార్లు గుర్తు చేసిన తర్వాతే కార్యాలయానికి రమ్మన్నాడు.

డబ్బు లెక్కపెట్టి సదానందం చేతిలో పెడుతూ నవ్వుతూ అన్నాడు—

"నీ సన్మానానికి ఐదు వేల రూపాయలు ఖర్చయింది. అది కూడా లెక్కలో పెట్టుకో."

ఆ ఒక్క మాటతో సదానందం మనసులో ఏదో విరిగిపోయింది.

వేదికపై కప్పిన శాలువా...

వేసిన పూలదండ...

చేతికిచ్చిన జ్ఞాపిక...

వేదికపై వినిపించిన ప్రశంసలు...

ఒక్కసారిగా కొత్త అర్థం సంతరించుకున్నాయి.

ఇంతకాలం అవి గౌరవ సూచకాలనుకున్నాడు.

ఇప్పుడు అవన్నీ తనకే ఇవ్వాల్సిన డబ్బుతో కొన్న వస్తువుల్లా కనిపించాయి.

ఇప్పటివరకు తనకు జరిగినది సన్మానం అనుకున్నాడు.

ఆ క్షణంలో అది అవమానమైంది.

అంతకంటే ఎక్కువగా అతన్ని వేధించింది ఒక అనుమానం.

"నన్ను గౌరవించింది నా రచనను చూసినా... లేక నా పదిహేను వేల రూపాయల అప్పును చూసినా?"

ప్రభాకర్ వైపు ఒక్క క్షణం చూశాడు సదానందం. ఆ ప్రశ్నకు సమాధానం అడగాల్సిన అవసరం లేదని అతనికి అర్థమైంది.

ప్రశాంతంగా మిగిలిన డబ్బు జేబులో పెట్టుకున్నాడు.

"ప్రభాకర్... నాకు ఐదు వేల రూపాయల సన్మానం ఎప్పుడూ అవసరం లేదు. ఆ ఖర్చు పెట్టేంత మనసుంటే, నా డబ్బు సమయానికి ఇచ్చి ఉంటే అదే నాకు గొప్ప గౌరవం. సన్మానం శాలువాలో ఉండదు... మాట నిలబెట్టుకోవడంలో ఉంటుంది," అన్నాడు.

అంతే, అని వెనక్కి తిరిగి చూడకుండా బయటకు నడిచాడు.

కార్యాలయం బయట గోడపై అదే సన్మాన సభ ఫోటో ఫ్రేమ్ కట్టబడి ఉంది.

మధ్యలో శాలువా కప్పుకుని చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు సదానందం.

ఆ ఫోటోను ఒక్క క్షణం చూశాడు.చిరునవ్వు నవ్వాడు.

ఆ నవ్వు పెదవుల మీదే ఆగిపోయింది.

నిశ్శబ్దంగా తన జేబులో ఉన్న పదివేల రూపాయలవైపు చూసుకున్నాడు.

కొన్ని సన్మానాలు జ్ఞాపకాలుగా మిగలవు... బాకీలుగా మిగిలిపోతాయి.

మరిన్ని కథలు

Apramatthata
అప్రమత్తత
- డా:సి.హెచ్.ప్రతాప్
Samskaram
సంస్కారం
- మద్దూరి నరసింహమూర్తి
Chivari vuttaram
చివరి ఉత్తరం
- డా:సి.హెచ్.ప్రతాప్
Manavatwam gelichindi
మానవత్వం గెలిచింది
- డా:సి.హెచ్.ప్రతాప్
Dinadina gandam noorella ayusshu
దిన దిన గండం నూరేళ్ళు ఆయుష్షు
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Dwesham
ద్వేషం
- డా:సి.హెచ్.ప్రతాప్
Manasupaddaanu kaanee
మనసు పడ్డాను కానీ!
- మీ రాము కోలా