
కవిత్వం ఒక దేవాలయం
కావ్యశాస్త్రం కవిత్వానికి లక్ష్మణ రేఖ
ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్రం
20వ శతాబ్ది తొలి దశాబ్ధాల్లో మొదలైన వచన కవిత ఏడవ దశకం చేరేసరికి ప్రధాన వాహికగా స్థిరపడింది. “చందస్సుల సర్ప పరిష్వంగం” పూర్తిగాగ తొలిగిపోయింది. మరి ఈ వాహిక, వచన కవిత లక్షణా లేమిటి? రూపురేఖలెలా ఉండాలి? వీటిపై కవులు, విమర్శకులు దృష్టి సారించలేదని పిస్తుంది. వేయ్యేళ్ళపాటు కవిత్వానికి కంచెగా ఉన్న చందస్సు వైదొలగడంతో కవితాక్షేత్రంలోకి ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో ప్రవేశించారు. కవిత్వం కొరవడిన రచనలదే పై చేయి అయ్యిందని కొందరు అవేదన చెందిన మాట వాస్తవమే. వీరిలో ప్రముఖులు మహాకవి శేషేంద్ర. చందస్సు వైదొలిగినందు వల్ల లాభం చేకూర లేదని, పైగా కవిత్వం ఉందో లేదో బయట పడే ప్రమాదం వచ్చిపడిందని “పొట్టవిప్పి” చెబుతున్నారు ఈ కావ్యశాస్త్రంలో..
“కవులు భూగోళపు రక్తనాళాలు” అన్న మహాకవి శేషేంద్ర ఆ కవులు , వాళ్ళ రక్త నాళాల్లో ప్రవహించే కవిత్వం , చరిత్రను పూసగుచ్చినట్లు గ్రంథస్తం చేశారు కవిసేన మానిఫెస్టోలో.
కవిత్వాన్ని శాస్త్రీయంగా నిర్వచించవచ్చు, కవిత్వమే సమాజంలో, జన జీవనంలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ సామాజిక పరివర్తనకు మార్గదర్శిగా ఉంటూ వస్తున్నదని శేషేన్ నిశ్చితాభిప్రాయం. “కవిత్వం అంటే ఏమిటి?" అన్న మీమాంసకు పునాదివేసి ఆయన అనేక కోణాలనుంచి చర్చించారు. నాగరికతను సృష్టించింది చరిత్రలో మానవతను ఒక ద్వజస్తంభంగా నిర్మించింది కవులే అని ప్రకటిస్తున్నారు. “కవిత్వం ఒక ఆత్మకళ” అధ్యాయంలో "అనుభూతి నుంచి చిలికి తీసిన కళా శకలమే... దృగ్విశేషాన్ని శద్ధీకరించడమే కవిత్వం అవుతుంది... మొదట అనుభూతిని కళగా అభ్యాసం చేయాలి, తరువాత అభివ్యక్తిని కళగా అభ్యాసం చేయాలి.... అందుకే కవిత్వం ఒకజీవన విధానమే...” అని శేషేంద్ర సిద్ధాంతం చేశారు. కవులు, కావ్యవేత్తల రచనల్ని సందర్భానుసారంగా పేర్కొంటూ తార్కిక పంథాలో విశ్లేషించడం అడుగడుగునా కనిపిస్తుంది ఈ గ్రంథంలో. నిజమైన కవితకు అనుభూతి గీటురాయి అని నిగ్గుతేల్చారు.
"పద్యం ఒక దేవాలయం... చివరికి దేవుడైనా సరే శుభ్రంగా స్నానం చేసి మడి కట్టుకుని మరీ అందులోకి ప్రవేశించాలి" అని గ్రంథకర్త వివరిం చారు. కవితకు శిలాశాసనం లాంటి లక్ష్మణ రేఖ గీసారు. కవితా మందిరంలో అనుభూతిని మూలవిరాట్గా పున:ప్రతిష్ట చేశారు. కవిత్వం అంటే అనుభూతి మూలక భావ చమత్కారం అని విశ్వజనీన నిర్వచనాన్ని తెలుగు నేలపై ఆవిష్కరిం చారు.
- శ్యాంమోహన్
రియల్ న్యూస్ ఆఫ్ ఇండియా
ఫిబ్రవరి, 2016
* * * * * *
ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్రం తెలుగుదేశంలో నూతనంగా కవిత్వభోధ అభివ్యాప్తం చెయ్యడానికి ప్రయత్నించే గ్రంథం- అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవిర్భవించిన ఒక ఉద్యమపత్రం.
సామాన్య శబ్దానికి అసమాన్య ఆకర్షణ శక్తి ప్రదానం చేసి, దాన్ని మహత్తర పురోగమన సాధనం గా మార్చే అయస్కాంత విద్యను యువతరానికి నేర్ప డానికి సాహిత్య సత్యాగ్రహయోద్దల్ని మలచడానికి | శబ్దరూపమెత్తిన కృషి- శోకము ప్రీతి సత్త్వము సమాధి ఆది శబ్దాలకున్న అలంకారిక ప్రతిపత్తి - ప్రతిభ జన్మసంస్కారం కాదు, సమాధిగానీ విలక్షణ వ్యుత్పత్తిగానీ సాధించగల శక్తి అనే అలంకారిక మతము-
కవే ప్రాచీన మత వాజ్ఞ్మయ కర్త-
వాల్మీకి ప్రధమ ప్రజాకవి-
వాల్మీకి ఉపమలు ప్రతీకలే-
కవి శోకజ్వాలే కవిత్వంలో కమిట్మెంట్
ఇత్యాది నూతన విశేషాలు ఆవిష్కరిస్తుంది.