పల్లవి - తటవర్తి భద్రిరాజు

Pallavi

విశాఖ బీచ్ సందర్శకులు తో రద్దీ గా ఉంది. సముద్రం లో దూరంగా రెండు ఓడలు కనిపిస్తూ ఉన్నాయి. సూర్యుడు అస్తమించడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు. బంగారు వర్ణం లో ఉన్న సూర్యుని కిరణాలు సముద్రపు నీటి పై పడి మరింత అందం గా ఉంది ఆ దృశ్యం. ఎగసిపడుతున్న సముద్రపు అలల శ్రావ్యమైన శబ్దం, ప్రకృతి సంగీతం ఆలపిస్తుందా అన్నట్టు గా ఉంది. దగ్గరలోని రోడ్ పై వెళ్తున్న వాహనాల శబ్దం తో పోటీ పడుతూ సముద్రపు అలలు మరింత శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆ సముద్రం ఒడ్డున పొడి ఇసుక లో కూర్చుని సముద్రం వైపే చూస్తూ ఉంది పల్లవి. ప్రకృతి లో ఉన్న అందం, ఆ సముద్రపు అలలు చేసే వినసొంపు ఐన ఆ సంగీతం అవేవి ఆమె ఆస్వాదించలేకపోతూ ఉంది. దూరంగా కొంతమంది పిల్లలు ఆ ఇసుకలో ఆడుకుంటున్నారు. ఒక్కోసారి ప్రశాంతం గా ఉండే ఈ సముద్రం, మరోసారి తన అలలుతో ఎగిసిపడుతూ ఉంటుంది. భయంకరమైన గాలులుతో, అటుపోటు లతో, తుపాను లతో బయపెడుతూ ఉంటుంది. జీవితం కూడా అంతే ఎప్పుడూ ప్రశాంతం గా ఉండదు. ఈ ఆలోచన రాగానే పల్లవి పెదాలపై విరక్తి తో కూడిన నవ్వు ఒకటి తనకు తెలియకుండానే వచ్చింది. సముద్రం లో వచ్చే కల్లోలలు తగ్గి అప్పుడప్పుడు సముద్రం అయినా ప్రశాంతం గా ఉంటుంది ఏమో! కానీ పల్లవి జీవితం ఎప్పుడూ కల్లోలలే. పల్లవి ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనలకి ఈ సమాజం తనని దురదృష్టం వెంట వేసుకుని తిరుగుతుంది అని ముద్ర వేసింది. తాను అడుగు పెట్టిన చోట కల్లోలాలే అని ఆడి పోసుకుంది. ఆ మాటలు విని, విని పల్లవి కూడా ఒక్కోసారి నిజంగానే నేను దుష్ట జాతకరాలు నా? అని తనలో తానే బాధ పడేది. భరించిన కష్టాలు, ఎదురుకున్న ఎదురు దెబ్బలు, నా అనుకున్న వాళ్ళే మాట్లాడిన సూటిపోటి మాటలు, తనని క్రుంగిపోయేలా చేసాయి. ఓదార్పు ను ఇచ్చే వాళ్ళు లేక జీవితం పై విసుగుతో ఆత్మ హత్య చేసుకోవాలి అని ఇలా ఈ బీచ్ లో కూర్చుంది. కొంచం చీకటి పడితే ఆ సముద్రం లో కి నడుచుకుంటూ వెళ్లి తాను ఇంతకాలం భరించిన బాధలు అన్నింటిని ఆ నీళ్లలో కలిపిలేయాలి అనుకుంది. అప్పుడేనా తనకి ప్రశాంత త దొరుకుతుంది ఏమో అనే చిన్న ఆశ.! ఆ ఎగసిపడుతున్న కెరటాలు చూస్తుంటే తన గతం అంతా కళ్ళముందు కనపడుతూ ఉంది. రామారావు, సుజాత లకు పల్లవి రెండో కూతురు గా పుట్టింది. మొదటి కూతురు ప్రశాంతి పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత కొడుకు కావాలి అనే రామారావు, సుజాతల కోరికకు పల్లవి రూపం లో నిరాసే ఎదురయ్యింది. ప్రశాంతి కి మంచి సంబంధం చూసి రమేష్ తో పెళ్లి జరిపించాడు రామారావు. . కూతురు కు పెళ్లి చేసిన కొన్ని నెలలకే రామారావు, సుజాత ఓ రోడ్ ప్రమాదం లో మరణింంచారు. అప్పటికి ఇంకా పదవ తరగతి చదువుతున్న పల్లవి తల్లితండ్రుల మరణం తో కుంగిపోయింది. తన అక్క తప్పని సరి పరిస్థులలో తన దగ్గరకి తీసుకుని వెళ్ళింది. ఉన్న ఒక్క ఇల్లు అమ్మితే ప్రశాంతి పెళ్ళికి చేసిన అప్పు తీరింది. ప్రశాంతి,పల్లవి ని తీసుకెళ్లి తన దగ్గర ఉంచుకున్నా ప్రశాంతి అత్తగారికి అసలు ఇష్టం ఉండేది కాదు. పల్లవి చదువు కు, తిండికి చాలా ఖర్చు అయిపోతూ ఉంది అని, తన కొడుకు రమేష్ కు చాలా కష్టం అయిపోతుంది అని ఇంటికి వచ్చే వాళ్ళ అందరికీ చెప్పేది. ఒక్కోసారి పల్లవి ముందు కూడా అలాగె మాట్లాడేది. అలాంటి మాటలు వింటూ పెరిగిన పల్లవి బాధ పడని రోజు అంటూ లేదు. ఒక్కోసారి ఐతే, అమ్మ నాన్న తో పాటు నేను కూడా ఆ ప్రమాదం లో ప్రాణాలు పోగొట్టుకుంటే బావుండేది ఏమో!! అని అనుకునేది. తన మనసులో బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. సొంత అక్క అయినా ప్రశాంతి తో మనసులో బాధ చెప్పుకుని సేద తీరుదాం అనుకున్నా, ఇంట్లో నే ఎప్పుడూ ఉండే ప్రశాంతి అత్తగారు ముందు ఇంక ఎలా చెప్పుకుంటుంది? రోజులు సంవత్సరాలుగా గడిచిపోతూనే ఉన్నాయి. కాలేజ్ లో స్నేహాతుడు గా పరిచయం అయిన చరణ్ పల్లవి జీవితాన్నే మార్చేసాడు. అతని పరిచయం పల్లవికి వసంతకాలం లో కోయిల కూసినట్టు, మండు వేసవిలో వర్షం పడినట్టు ఎంతో అనందాన్ని ఇచ్చింది. తన జీవితం లో మనసువిప్పి చెప్పుకోవడానికి ఒక తోడు దొరికింది. అతి కొద్ది కాలం లోనే వారి స్నేహం ప్రేమ గా మారింది. తన ప్రేమ విషయం తెలుసుకున్న పల్లవి అక్క సంతోషించినా, బావ, ప్రశాంతి అత్తగారు మా కుటుంబం పరువు నీవలన పోతుంది. నీలాంటిది మా ఇంట్లో ఉండకూడదు అంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు. ఆ సమయం లో చరణ్ తనకు తోడు ఉండడం వలన ధైర్యం గా ఇంటి నుండి బయటకి వచ్చేసింది. చరణ్ పల్లవి ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి జరిగింది అంతా చెప్పాడు. చరణ్ తల్లి తండ్రులు వెంకటరావు, శ్యామల. చరణ్ అమ్మాయిని సడన్ గా తీసుకుని వచ్చి ఆలా పరిచయం చేయడం, ఇకపై ఇక్కడే ఉంటుంది అని చెప్పడం తో మొదట్లో కొంచం షాక్ అయ్యారు. కానీ కొడుకు మీద ఉన్న ఇష్టం తో ఒప్పుకున్నారు. కానీ మీ ఇద్దరి చదువు ఇంకా మధ్యలోనే ఉంది. మీరు ఇద్దరు మొదట మీ చదువు పూర్తి చేయండి. అప్పటి వరకు పల్లవి ని పెళ్లి కాకుండా మన ఇంట్లోనే ఉంచుకుంటే బావుండదు. కాబట్టి పల్లవిని ఎక్కడైనా ఉంచుదాం అని చెప్పారు వెంకటరావు, శ్యామల. అనుకున్నట్టే తర్వాత రోజు పల్లవిని, శ్యామల తన తమ్ముడు రాజబాబు ఇంటికి తీసుకుని వెళ్ళింది. శ్యామలకు తన తమ్ముడు అంటే చాలా ఇష్టం. అలాగే రాజబాబు కూడా ఎప్పుడూ శ్యామల మాట కాదు అనడు. రాజబాబు భార్య వసంత పల్లవి ని ప్రేమగా ఆహ్వానించింది. రాజబాబు కు పిల్లలు లేకపోవడం తో పల్లవిని నా కూతురు గా దత్తత తీసుకుని, నేనే కన్యధానం చేస్తాను అని అక్క శ్యామల కు మాట ఇచ్చాడు. పల్లవి ని వసంత, రాజబాబు చాలా బాగా చూసుకునే వారు. పల్లవికి ఎక్కడ కొత్త ప్రదేశం లో ఉంటున్న ఫీలింగ్ అనేది రాలేదు. అంతా బాగుంది అనుకునే లోపు, పల్లవి వెళ్లి నెలరోజులు కూడా దాటాకుండానే ఆ ఇంట్లో రాజబాబు తల్లి కన్నుమూసింది. మరికొంత కాలానికి వసంత జబ్బు పడింది. టైరాయిడ్ పెరగడం తో తీవ్రమైన మోకాళ్ళు నొప్పులు, వచ్చి కూర్చున్న చోటు నుండి లేవలేక పోయేది. పల్లవి చదువు కొనసాగుతూనే ఉంది. వసంత వాడుతున్న మందులకు నెమ్మది నెమ్మదిగా కోలుకుంది అనుకునే లోపే రాజబాబు గుండె నొప్పి తో మరణింంచాడు. ఆ ఇంటికి పల్లవి అడుగు పెట్టిన క్షణం నుండే ఇలా జరుగుతున్నాయి అని, పల్లవి జాతకం మంచిది కాదు అని చుట్టాలు, చుట్టపక్కల వాళ్ళు అంటూ ఉంటే శ్యామల కు ఏం చెప్పాలో తెలియక మోనం గా ఉండేది. అత్తగారు కూడా అలానే ఆలోచిస్తుందా అనే ఆలోచన రాగానే పల్లవికి దుఃఖం ఆగలేదు. చరణ్ కూడాఅలాగే ఆలోచిస్తున్నాడా? అని తనలో తానే మదన పడింది. చదువు పూర్తి అవ్వగానే పల్లవి, చరణ్ కి పెళ్లి జరిపించారు. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి. కొత్త ఇంట్లో ఇద్దరు కాపురం పెట్టారు. ఐతే ఆరు నెలలు కూడా కాకుండానే విధి పగ పట్టినట్లు మరో ఉపద్రవం పల్లవి జీవితం లోకి తొంగి చూసింది. ఎవరిని ఐతే నమ్ముకుని అక్క దగ్గర నుండి బయటకి వచ్చిందో, ఎవరితో ఐతే తన భవిష్యత్ కలల ప్రపంచాన్ని ఊహించుకుందో ఆ చరణ్ రోడ్ ప్రమాదం లో మరణింంచాడు. మొదటి సారి పల్లవి కి నిజంగానే నేను నష్ట జాతకురాలిని. నేను ఇష్టపడినవి, నా అనుకున్నవి ఏవీ నాకు దక్కవు అనుకుంటూ బాధపడింది. మళ్ళీ మళ్లీ అవే మాటలు చుట్టూ ఉన్నవాళ్లు, సమాజం, బంధువులు అందరూ ఒకటే మాట నీ దురదృష్టం తో ఎంత మంది ప్రాణాలు తీస్తావు.? చివరకి తన అత్తగారు శ్యామల కూడా అవే మాటలు అంటూ ఉంది. నా కొడుకు నీవలనే దూరం అయ్యాడు అని. ఆమాటలు తో చాలా కుంగిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది పల్లవి. చరణ్ చనిపోయిన పదవ రోజు నాడు పల్లవి అక్క ప్రశాంతి, బావ రమేష్ వచ్చారు. పల్లవి ని చూసిన ప్రశాంతి తట్టుకోలేక పోయింది. మీ అబ్బాయిని చేసుకోవడం వలనే మా పల్లవి జీవితం ఇలా అయ్యింది అంటూ ప్రశాంతి అన్న మాటలు శ్యామల ను బాధపెట్టాయి. వెంటనే వెంకటరావు ఒక్క నిమషం కూడా మీ అమ్మాయి మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు తీసుకుపోండి అని గట్టిగా అరిచాడు. ప్రశాంతి, రమేష్ పల్లవి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు. పల్లవి మాత్రం ఆలా డెప్రిషన్ లోనే ఉంది ఎవరితో మాట్లాడేది కాదు.. గతం చేసిన గాయాలు అడుగు అడుగునా తనకి గుర్తుకు వస్తూనే ఉన్నాయి. తన జీవితం లో అనందం గా గడిపిన క్షణాలు, కన్నా ఎదుటివారి పై ఆధారి పడి న సందర్భాలే ఎక్కువ. నా అనుకున్న వాడు ఒంటరి ని చేశాడు. ఇంక ఎవరికోసం బతకాలి అనుకుని ప్రశాంతి కి ఒక లెటర్ రాసి, ఇలా బీచ్ కి వచ్చి కూర్చుంది. సూర్యుడు నెమ్మదిగా మబ్బులు చాటుకి వెళ్తుంటే, పల్లవి అడుగులు నెమ్మదిగా సముద్రం వైపు పడుతున్నాయి. ఇప్పుడు తన ఆలోచనలు అన్నీ సూన్యం గా ఉన్నాయి. జీవితం పై తనకు ఆశ లేదు. చుట్టూ ఉన్న మనుషులు పై నమ్మకం లేదు. అందుకే విరక్తి తో ఈ నిర్ణయం తీసుకుంది. సరిగ్గా అప్పుడే పల్లవి బుజం పై ఒక చేయి బలం గా పడింది. పల్లవి వెనుక ప్రశాంతి. పల్లవి ని దగ్గరకు తీసుకుని కౌగలించుకుంది. ఆ కౌగిలింత పల్లవిలో జీవితం పై ఏదో తెలియని ధైర్యాన్ని ఇచ్చింది. వారి మధ్య మాటలు లేవు. మౌనం మాత్రమే ఉంది. వారి ఆత్మీయత చూసి ఓ కెరటం సంతోషం తో వారిని ముద్దాడింది. జీవితం లో ఒక్కోసారి ఎన్నో సంఘటనలు యాద్రుచ్చికంగా జరుగుతూ ఉంటాయి. ఏ మనిషి అదృష్టం వలనో, దురదృష్టం వలనో ఇంకొకరి జీవితం ప్రభావితం అవ్వదు. అలాంటి వాటిని నమ్మి సమాజం నిందలు వేసినా, బాధ పెట్టినా ధైర్యం తో నిలబడి తలపడాలి. ముందు కు అడుగువేయాలి కానీ ఆత్మ స్థైర్యం కోల్పోయి ఆత్మహత్య వైపు అడుగులు వేయకూడదు. మనిషికి తోడుగా ఉండాల్సింది ధైర్యం మాత్రమే.

మరిన్ని కథలు

Vimanam lo kalakalam
విమానంలో కలకలం
- తాతా కామేశ్వరి
Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల