మనిషి – జంతువు - Karlapalem HanumanthaRao

anishi-Janthuvu

రోజూ నా పూజా గదిలోకి వచ్చి, దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని పట్టుకుపోయే ఆ కోతిని చూస్తే మొదట్లో నాకు చిరాకు వేసేది.

జంతువులకు ఆలోచనా శక్తి ఉండదని, అవి కేవలం ఆకలి కోసమే వస్తాయని నా నమ్మకం. కానీ ఒకరోజు అది తన చిన్న బిడ్డను చంకన పెట్టుకుని రావడం చూశాక, నాలో కోపం కన్నా భయం కలిగింది—ఎక్కడ గదిని చిందరవందర చేస్తాయో అని! వాటిని బయటకు గెంటేసి హమ్మయ్య అనుకున్నాను.

కానీ ఆ కోతి ప్రవర్తన నన్ను ఆలోచింపజేసింది. అది తనకు కావలసిన పండును తీసుకుని, మిగిలిన ముక్కలను కింద ఉన్న ఉడతల కోసం వదిలేసి వెళ్లేది.

స్వార్థం తెలియని ఆ పంపిణీ గుణం చూసి నాకు చిన్నప్పుడు విన్న 'కోతి-మొసలి' కథ గుర్తొచ్చింది. తనను చంపాలనుకున్న మొసలి నుండి తన ప్రాణాలను తెలివితో కాపాడుకున్న కోతి కథ అది. జంతువుల తెలివితేటల గురించి ఆలోచిస్తుండగానే, నా ఇంటి మెట్ల కింద మరో దృశ్యం ఆవిష్కృతమైంది.

గర్భంతో ఉన్న ఒక కుక్క, దాని తోడుగా ఉండే మరో కుక్క రోజూ నా ఇంటి మెట్ల మీద తలదాచుకునేవి. ఒక ఉదయం ఆ కుక్క రోడ్డు పక్కన ఇసుక కుప్పపై పిల్లల్ని కన్నది. కానీ విధి వైపరీత్యం... కొన్ని పిల్లలు పుడుతూనే చనిపోయాయి. ఆ తల్లి కుక్క కళ్లలో కనిపించిన శోకం వర్ణనాతీతం. నేను జాలితో పాలు, రొట్టెలు తెచ్చి ముందు పెట్టినా, అది తన చనిపోయిన బిడ్డల దుఃఖంలో ఉండి వాటిని ముట్టలేదు.

మనుషులమైన మనం ఆస్తులు, రాజకీయం, మతం అంటూ ఒకరినొకరు చంపుకుంటుంటే, ఆ మూగజీవి మాత్రం మాతృత్వపు భారంతో మౌనంగా విలపిస్తోంది.

కాసేపటికి ఎండ ముదరడంతో, అది తన ప్రాణాలతో ఉన్న మిగిలిన పిల్లలను నోట కరుచుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. నా పొరుగు ఆవిడ వచ్చి, "చనిపోయిన పిల్లలను మున్సిపాలిటీ వాళ్లతో తీయించి పాతర వేయించాను, ఆ కుక్క ఎక్కడికి వెళ్ళిందో ఏమో!" అని సాదాసీదాగా చెప్పింది.

కానీ ఆ కుక్క జతమాత్రం రాత్రంతా ఆ ఇసుక కుప్ప చుట్టూ తిరుగుతూ, ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూనే ఉంది. అది మా నిద్రను చెడగొడుతోందని అందరూ విసుక్కున్నారు.

మరుసటి రోజు ఉదయం నేను ఆ ఇసుక కుప్ప వైపు వెళ్లాను. అక్కడ ఆ పగటిపూట పొరుగు ఆవిడ చెప్పినట్లు 'పాతర' వేసిన గుర్తులు లేవు. ఆశ్చర్యపోయి ఆరా తీస్తే తెలిసింది... పారిశుద్ధ్య పనివాడు ఆ చనిపోయిన పిల్లలను చెత్త కుప్పలో పారేసాడని, కుప్ప మీద పూలు పెట్టమని ఇచ్చిన డబ్బును అతను చాయ్ పానీలకు ధారపోసాడని!

రాత్రి అంతలా మొరిగిన మగ కుక్క తెల్లవారేసరికి మా ఇంటి గుమ్మం ముందే ప్రాణం వదిలి పడి ఉంది. రాత్రి దాని నోటి దగ్గర నేను పెట్టిన పాలు, రొట్టె ముక్కలు అలాగే ఉన్నాయి. అది ఆకలితో చనిపోలేదు... తన బిడ్డలు ఎక్కడికి వెళ్ళారో తెలియక, తన తోడు ఎటు పోయిందో అర్థం కాక, మానవత్వం లేని మనుషుల మధ్య అతిగా ప్రేమించినందు వల్ల కలిగిన ' ఒత్తిడి' కారణంగా దాని గుండె ఆగిపోయింది.

జంతువులకు ఆలోచనా శక్తి లేదనుకుంటాం. కానీ ఆ రోజు నాకు అర్థమైంది... మనకు 'మేధస్సు ' ఎక్కువై మానవత్వాన్ని మర్చిపోతున్నాం, వాటికి 'ఆవేదన' ఎక్కువై ప్రాణాలు వదులుతున్నాయి.

***

మరిన్ని కథలు

Iddaru yajamaanulu
ఇద్దరు యజమానులు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Gulakarallu
గులకరాళ్ళు
- Lakshmi Priyanka
Mamatala kovela
మమతల కోవెల
- డా:సి.హెచ్.ప్రతాప్
O chelli Tanjamma katha
ఓ చెల్లి తంజమ్మ కథ
- హేమావతి బొబ్బు
Vinta charya
వింత చర్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Illu-Illalu
ఇల్లు-ఇల్లాలు
- డా:సి.హెచ్.ప్రతాప్
Daariu choopina mitrudu
దారి చూపిన మిత్రుడు
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు