ఓల్డేజ్ హోం - కె. మనస్వీ

old age home

వరుణ్ ఒక బహుళ జాతి సంస్థ లో ప్రోజెక్ట్ మేనెజర్ గా పని చేస్తున్నాడు. అతనికి పెళ్లై పదేళ్లు అయింది. అతని భార్య పేరు నైమిష. వారికొక తొమ్మిదేళ్ల బాబు కూడా ఉన్నాడు. అతని పేరు షణ్ముఖ్. వరుణ్ కి పెళ్లైన మూడు నెలలకే తన అమ్మమ్మ చనిపోయింది. అతనికి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆమె దగ్గరే ఎక్కువ అలవాటు. ఒకరోజు అతను ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఒక ముసలివాడిని మాసిన బట్టల్లో బంగ్లా గేటు దగ్గర పడుకుని ఉండటం చూసాడు. కారు ఆపి వివరాలు తెలుసుకోగా అతడు ఇలా చెప్పాడు. బాబు నేను , మా అబ్బాయి, కోడలు ఆ బంగ్లాలో ఉండేవాళ్ళం. మరి ఇపుడు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగితే ఇలా చెప్పాడు.

ఈ మధ్యనే నేను డాక్టరు చెకప్ చేయించుకున్నాను. వారు నాకు కీళ్ళవాతం ఉందని త్వరలోనే మంచం పడతానని చెప్పారు. అది విన్నప్పటి నుండి మా అబ్బాయి, కోడలు నాతో సరిగ్గా ఉండట్లేదు. ఊరికే విస్సుకునేవారు. అవకాశం వస్తే నన్ను వడిలించుకుందామని చూసారు. పో యిన ఆదివారం ఇప్పుడే వస్టామని చెప్పి బంగ్లా కుడా తాళం వేసి కారులో వెళ్లారు. సరేలే వస్తారులే అని ఆ రోజంతా కింద బాల్కెని లో గడిపాను. ఆ రోజు సాయంత్రం మా డ్రైవర్ వచ్చి మా వాళ్ళు ఈ దేశం వొదిలి వేరే దేశానికి వెల్లిపొయారు అని చెప్పాడు. అపుడు నాకు అర్థమయింది నేను మంచం పడితే నాకు ఎక్కడ చేయాల్స వస్తుందోనని ఇలా చేసారు. అప్పటి నుండి ఇలా గేటు ముందు పడుకుంటున్నా వచ్చే పొయే వారు వేసే డబ్బులతో తింటున్నా. ఇదంతా విన్నాక వరుణ్ కి చాలా బాధ కలిగి అతనికి డబ్బులు ఇచ్చి మళ్లీ కలుస్తానని చెప్పి వెళ్లిపోతాడు.

వరుణ్ వాళ్ల ఇంటికి దగ్గర లో ఒక మురికివాడ లో వాళ్ళ ఆమ్మ కి సంపాదన లేనందుకు వాళ్ల కొడుకు తరిమేస్తూ కనిపించింది. అతను దారి అంతా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళాక కూడా ఈ విషయం తన భార్య నైమిష కి చెప్తాడు. అది విని ఆమె మీరు చెప్పేది వింటే బాధ గానే ఉంది కాని ఎవరి సమస్యలు వారివి మనం మాత్రం ఏం చెయ్యగలం అంటుంది. అది నిజమే అనుకుంటాడు. కాని ఆ రోజు జరిగిన రెండు సంఘటనలు గుర్తొచ్చి రాత్రి నిద్ర పట్టలేదు . దానితో అతనికి వీళ్ళలాంటి వారికోసం ఒక వృద్ధాశ్రమం పెట్టాలనే ఆలోచన తట్టింది. మరుసటి ఉదయం అతను ఈ ఆలోచన తన భార్య నైమిష కి చెప్పాడు. మొదట ఆమెకి నచ్చలేదు కాని తన భర్త మాట కాదనలేక ఒప్పుకుంది. ఒక మంచిరోజు చూసి శాంతాక్రిష్ణ అనే వృద్ధాశ్రమం స్థాపించాడు. అందులో నిస్సహాయ పరిస్థితుల లో ఉన్న వృధ్ధులను పిల్లలు వొదిలేసిన వారిని రొగాలకి గురైన వారికి , ఆర్ధిక సహాయం లేనివారిని అటువంటి వారినందరిని చేర్చుకున్నాడు. వారికి కావల్సిన వసతులు ఏర్పాటు చేశాడు . వారిని చూసుకోడానికి నర్సులను కూడా నియమించాడు. ఇలా మొత్తం సక్రమంగా నిర్వహించేవాడు. వారిని రోజు చూసి అక్కడ వారికి సౌకర్యాలు ఎలా ఉన్నాయి , సేవలు ఎలా చేస్తున్నారు అని తెలుసుకుని ఇంటికి వెళ్ళేవాడు .

ఈ కారణం గా సాయంత్రం కాస్త ఆలస్యమయ్యేది. దీనితో తన భార్య నైమిష కి కోపం వచ్చేది. ఒకసారి తొమ్మిది గంటలైనా వరుణ్ ఇంటికి రాకపోయేసరికి నైమిష తన బిడ్డ షణ్ముఖ్ తో పాటు అతను పెట్టిన వృద్దాశ్రమానికి వెళ్లింది. అక్కడ రెండు మూడు గదులు చూసింది ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి ఒక గది లో మంచానికే అంకితమైన ఒక వృద్దుడి మలినాలు శుభ్రం చేసి అతనికి స్నానం చేయించి, బట్టలు తొడిగి బయటికి వచ్చాడు. ఇదంతా చూసిన నైమిష కి అసహ్యం వేసింది. ఆ ఆశ్రమంలో భార్య ను , కొడుకు ను చూసి ఆనందించినా తర్వాత ఇంట్లో ఏదో గొడవ జరుగుతుందేమోనని మనస్సులో భయపడ్డాడు. అతడు అనుకున్నట్లు గానే ఇంటికి వెళ్లాక గొడవ మొదలైంది. అసలు రేపటినుండి ఆ వృద్దాశ్రమానికి వెళ్ళొద్దని , ఆ ఆశ్రమం నడిపించేందుకు కావలసినంత ధన సహాయం చేస్తే చాలునంది. ఆ వృద్ధాశ్రమం లో అంత మంది నర్సులను నియమించినా ఆ రోజు ఆ ముసలివాడికి తానే ఎందుకు మలినాలు శుభ్రం చేసి , స్నానం చేయించాడని అడిగింది. నర్సు డ్యూటీ కి రాకపొయేసరికి తానే అవన్ని చేశానని చెప్పాడు. దానితో నైమిష తన భర్త రోజూ ఇలాగే అందరికీ చేస్తాడేమో అని అసహ్యం కలిగింది. ఆ రోజు మొదలు ఆమె తన భర్త కి కావల్సిన వంట పనిమనిషి తో చేయించేది. వరుణ్ కి ఒకకంచం , ఒక గ్లాసు విడి గా పెట్టేసింది. మిగిలిన గిన్నెల తో కలపనిచ్చేది కాదు. అతనికి నైమిష వడ్డించేది కాదు. అతనికి కోసం చేసిన వంట నేల మీద పెట్టించేది.

అతనినే వడ్డించుకోమనేది. అతను తన భార్య కి ఎంత సర్ది చెప్పినా ఆమె అలానే ప్రవర్తించేది. అతనిని అసహ్యించుకునేది. ఇలా కొంత కాలం గడిచింది. వరుణ్ నైమిష మారుతుందని ఎదురుచూసాడు. కాని అది జరగలేదు. దానితో అతనికి అసహనం పెరిగి విడి గా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందువలన అతను ఆఫీసు కి వృధ్ధస్రమానికి దగ్గర లో ఇల్లు తీసుకున్నాడు. నైమిష తన పాత ఇంట్లోనే వాళ్ల అమ్మగారి తో వాళ్ళ బాబు ని పెట్టుకుని ఉండేది. ఒకరోజు నైమిష వాళ్ల అబ్బాయి కి స్నానం చేయించి బాత్రూం నుండి బయటికి వస్తుండగా కాలు జారి పడింది. దానితో ఆమె కదలలేకపొయింది. డాక్టరు ను సంప్రదించగా ఆమె కి కాలు విరిగిందని ఒక నెల పాటు కదలకోడదని చెప్పాడు. మూడు వారాల వరకు అంతా బాగానే జరిగింది. ఆమె కి కావల్సినవన్ని వాళ్ల అబ్బాయి అందించేవాడు. నైమిష అవసరాలన్ని వాళ్ల అమ్మగారు తీర్చేవారు. ఒకరోజు నైమిష వాళ్ళ అమ్మగారికి జ్వరం వచ్చింది. ఆమె కదలలేని పరిస్థితి లో ఉంది. అయినా నైమిష కు అవసరాలు తీర్చి స్నానం చేయించి పడుకోబెట్టింది. ఇక చేయలేక ఆమె పడుకుంది. దానితో నైమిష ప్రతిసారి ప్రతిదానికీ వాళ్ళ అబ్బాయి నే పిలిచింది. నైమిషే కాకుండా వాళ్ళ అమ్మగారు కూడా మందులకొకసారి, మంచినీళ్ళ కి ఒకసారి ఇలా ప్రతిదానికీ ప్రతిసారి వాడినే పిలిచేసరికి వాడికి విసుగొచ్చింది. ఇంతలో ఎప్పటిలాగానే వరుణ్ వాళ్ళ అబ్బాయి షణ్ముఖ్ కోసం వచ్చి కట్టుకట్టిన కాలు తో నైమిష ఒక మంచం మీద, జ్వరం తో వాళ్ళ అత్తగారిని మరో మంచం మీద చూసి చాలా బాధపడ్డాడు. వరుణ్ , షణ్ముఖ్ ఆడుకున్నారు. ఇంత లో నైమిష మళ్లీ నీళ్ల కోసం షణ్ముఖ్ ను పిలిచింది. వాడు పలకలేదు . మరోసారి పిలిచింది అయినా స్పందించలేదు. ఏమి వినపడనట్టే కూర్చున్నాడు . అప్పుడు వరుణ్ వెళ్లి నైమిష కి నీళ్ళు తాగించి వస్తాడు. వరుణ్ వాళ్ల అబ్బాయి ని ఇలా అడుగుతాడు అమ్మ రెండుసార్లు పిలిచినా ఎందుకు పలకనట్టు కూర్చున్నావ్ ? అని అడగ్గా షణ్ముఖ్ ఇలా చెప్పాడు.

నాన్నా నిన్న రాత్రి నుండి అమ్మమ్మ కి జ్వరం రావడం తో ఇద్దరికీ నేనే అన్నీ ఇస్తున్నాను. ఇవాళ పొద్దుటి నుండి ఇద్దరూ అసలు ప్రతిదానికీ నన్నే పిలుస్తున్నారు . ఒకసారి అమ్మ, ఒకసారి అమ్మమ్మ .మా ఫ్రెండ్స్ తో ఆడుకోడానికి అసలు టైం లేదు నాన్న. ఊరికే విసిగిస్తున్నారు. అందుకే అలా చేసాను. నాన్న నాకో ఐడియా వచ్చింది. ఏంటది అని వరుణ్ అడిగితే ఇలా చెప్తాడు. నాన్న మీరు ఒక ఓల్డెజ్ హోం పెట్టారు కదా అందులో అమ్మ ని పెట్టేదాం అంటాడు. అపుడు వరుణ్ ఇలా అంటాడు అందులో పెడితే అమ్మమ్మ లాంటి వాళ్ల ని పెట్టాలి కాని అమ్మ ని కాదు. దానికి షణ్ముఖ్ ఇలా అంటాడు అదికాదు నాన్న జ్వరం అంటే రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది కాని అమ్మ కి కాలు విరిగింది కదా చెయ్యడాని అమ్మ కంటే పెద్దదైన అమ్మమ్మ కి కష్టం మీ కంటే చిన్నవాడినైన నాకు కష్టం అందుకే అంటాడు. ఇదంతా వింటున్న నైమిష కి కన్నీళ్ళు ఆగలేదు . అపుడు వరుణ్ షణ్ముఖ్ తో ఇలా అంటాడు చూడు బాబు మనం ఎప్పుడైనా సరే నిస్సహాయ పరిస్థితిలో ఉన్న వారికి అంటే ఎవరైతే వారి పనులు సొంతం గా చేసుకోలేరో వారికి మనం సహాయపడాలి నువ్వు చెయ్యకపోతే వారి కోసం ఒక ఆయా గాని, నర్సును పెట్టుకోవాలి. అంతే కాని విస్సుకోకూడదు. నువ్వు మీ అమ్మ కి ఒక్క పూట చెయ్యడానికి విస్సుక్కుంటే మరి మీ అమ్మ నువ్వు ఇంత పెద్దయ్యే వరకు నీకు అన్నీ చేసింది ఎప్పుడూ విస్సుక్కొలేదు. ఇప్పటికీ రోజు నీ కోసం నిన్ను స్కూలు పంపడానికి టిఫిన్, లంచ్ ,ఇవన్నీ చేస్తోంది కదా . అపుడు షణ్ముఖ్ ఇలా అంటాడు అది కాదు నాన్నా ఆ రోజు రాత్రి మీరు లేట్ అయినా రాకపోయేసరికి నీ కొసం వచ్చినపుడు మీరు ఒక తాతగారిని శుభ్రంగా స్నానం చేయించడం చూసి మీతో మాట్లాడ్డం మానేసింది కదా మరి అపుడు ఆ పది నిమిషాల కే అమ్మ కి చిరాకేసింది. నేను ఒక పూట చెసాను నాకు విసుగొచ్చింది అని చెప్పగా వరుణ్ ఇలా అంటాడు

మీ అమ్మ అపుడు అలా చేసింది కాబట్టే తను కూడా ఇపుడు ఇలా చేయించుకునే పరిస్థితి లో ఉంది. దానికి షణ్ముఖ్ సారి నాన్నా ఇంకెప్పుడూ ఇలా చెయ్యను విస్సుక్కోను అంటాడు. ఇదంతా విన్న నైమిష మనస్సు కూడా మారుతుంది. తన భర్త చెప్పింది నిజమేనని భావిస్తుంది. వరుణ్ ఒక లేడి నర్సు ను నైమిష కు , వాళ్ల అత్తగారి కోసం నియమిస్తాడు. అతను కూడా అక్కడే ఉండి చూసుకునేవాడు. ఇద్దరికి నయమయ్యాక ఆ నర్స్ ని మళ్ళీ వృద్దాశ్రమానికి పంపిస్తాడు. అప్పటినుండి నైమిష తను కూడా తన భర్త తో పాటు ఆ ఓల్డెజ్ హోం ని చూసుకునేది. ఉదయం పూట ఆమె , సాయంకాలం ఇద్దరూ వెళ్ళి ఆ వృద్ధుల ను చూసుకునేవారు.

మరిన్ని కథలు

Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల
Atanu aame madilo
అతను ఆమె మదిలో
- బొబ్బు హేమావతి
Atani kannu aame meeda padindi
అతని కన్ను ఆమె మీద పడింది
- బొబ్బు హేమావతి
Kottha ugadhi
కొత్త ఉగాది
- తాత మోహనకృష్ణ
Pallavi
పల్లవి
- తటవర్తి భద్రిరాజు