సిరిపురం రాజు సీతయ్య ఎంతో గొప్ప దార్శనికుడు. తన పాలనలో ఎవరికి ఎలాంటి హాని కలిగినా కుమిలిపోయేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలే పాలించేవాడు. రోజంతా రాజ్యంలో అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని పరిష్కరించేవాడు. ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే సీతయ్యకు ఓ వింత సమస్య ఎదురైంది.
రోజూ తను నడిచివెళ్లే ప్రాంతంలో తన అడుగులు వేసిన ప్రదేశంలో రెండు, మూడు అడుగుల గోతులు ఏర్పడి ముందుకు నడవలేకపోయేవాడు. దీంతో సీతయ్య తను కూర్చున్న స్థలం నుంచి కదలలేకపోయేవాడు. రాజ భవనం నుండి బయటకు వెళ్లలేకపోవడంతో ప్రజలు పడుతున్న బాధలు తెలిసేవి కావు. ఇది రాజుకు కొరకరాని కొయ్యలా తయారైంది.
కాలునేలమీద పెడితే గుంతలు పడి ఆ ప్రాంతం కృంగి పోతుండడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ప్రజల సమస్యలు తెలుసుకోలేకపోవడంతో పరిష్కారం అయ్యేవి కావు. దీంతో రాజు ఓ నిర్ణయానికి వచ్చాడు. గొప్ప గొప్ప ఇంజినీర్లను పిలిచి కాంక్రీట్ రోడ్లు వేయించాడు. రాజ్యం మొత్తం వేయడంతో ఖజానా ఖాళీ అయ్యింది. ఓ రోజు ఆ రోడ్లను ప్రారంభించడానికి ముహూర్తం ఏర్పాటు చేశాడు. కాలు కింద పెట్టడంతో కాంక్రీట్ రోడ్డు కూడా కృంగిపోయింది. అది చూసిన రాజు రోడ్ల ప్రారంభోత్సవాన్ని విరమించుకుని రాజ భవనానికి చేరుకున్నాడు. అప్పటి నుంచి ఇక కాలు కిందపెట్టకూడదని గట్టిగా నిర్ణయించుకుని పాలనపై దృష్టిపెట్టాడు.
తన కోసం గాలిలో ఎగిరే విమానాన్ని ఏర్పాటు చేసుకుని రాజ్యంలో సమస్యల్ని గుర్తించి పరిష్కరించేవాడు. ప్రజలకు రాజు ముఖం కనిపించేది కాదు. దీంతో రాజు తన సమస్యను అందరికి చెప్పుకుని బాధపడేవాడు. ఇది విన్న ఓ పౌరుడు రాజు పాదాలను గమనించాడు. వాటికి ఏదో ఓ రకమైన రంగు వుండటం గమనించి దగ్గరికి వెళ్లి పరీక్షించాడు. ఇనుములాంటి ఓ రకమైన గట్టిగా వున్న లోహపు పదార్థాన్ని పూసినట్లు గుర్తించాడు. అది భూమిని తాకితే కృంగిపోయి గుంతలు ఏర్పడుతాయని గ్రహించాడు. ఆ తర్వాత రాజు ఆ పదార్థాన్ని తన తమ్ముడు పాలకుడు కావాలని పన్నిన పన్నాగమని తెలిసి ఆశ్చర్యపోయాడు.
సోదరుడిని పిలిపించాడు. ఆ పదార్థానికి విరుగుడుగా మరో లోహపు పదార్థాన్ని పూసుకుని పాలన సాగించాడు. అయినా రాజు కాలు కిందపెట్టి నడిచి ప్రజలకు చేరువై ఆప్యాయంగా పలకరించి సమస్యలు పరిష్కరించినా ఆయనకు గుంతలరాజు అనే పేరు మాసిపోలేదు. వచ్చిన మచ్చ జీవితాంతం అలాగే మిగిలిపోయింది.

