నీలం సంజీవరెడ్డి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

నీలం సంజీవరెడ్డి.

నీలం సంజీవరెడ్డి.
కాంగ్రెస్ పార్టి అద్యక్షులు, రాష్ట్రపతి,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వంటి మహాన్నత పదవులు అలంకరించిన సంజీవరెడ్డి గారు అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో సుబ్బమ్మ,చిన్నపరెడ్డి దంపతులకు జన్నించిన వీరు తన పదహారవ ఏట గాంధీజి ప్రసంగానికి ప్రభావితులై ఖధ్ధరు ధరించసాగారు.వీరికి బాల్య గురువులు పప్పురు రాఘవాచార్యులు.చెన్నయ్ లో నేషనల్ థియోసాఫికల్ కాలేజిలో చేరినా,మహాత్మాగాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు. 1937 లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళాడు. 1940-1945 ల మధ్య ఎక్కువకాలం అతను జైలులో ఉన్నాడు. 1946 లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1947 లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగసభకు ఎన్నికయ్యాడు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్.జి.రంగాతో పోటీ పడ్డాడు. ప్రకాశం మద్దతుగల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు. ఆ తరువాత రంగా, ప్రకాశం కాంగ్రెసును విడిచి వెళ్ళారు. ఈ కాలంలో సంజీవరెడ్డి జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. అతను ఐదేళ్ళ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి, పార్టీ పదవికి రాజీనామా చేసాడు. తరువాత పార్టీ పెద్దల ఒత్తిడిమేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నాడు.

1953లో 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని ప్రకాశంవారికి నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 1955రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్.జి.రంగా గారి నాయకత్వం లోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది. అయితే బెజవాడ గోపాలరెడ్డి గారికి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతు ఇస్తామని రంగా ప్రకటించడంతో తాను తప్పుకుని మళ్ళీ ఉపముఖ్యమంత్రి అయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ
తరుణంలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దల ఓప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించాడు. 1960లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు.
కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, మళ్ళీ 1962లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో1964 ఫిబ్రవరి 9 న తనపదవికి రాజీనామా చేసాడు. ఆపై సంజీవరెడ్డి కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించసాగాడు.
కేంద్రంలో 1964జూన్ 9 లాల్ బహాద్దూర్ శాస్త్రి గారిప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేరాడు. ఆపై రాజ్యసభకు ఎన్నికయ్యాడు. 1967 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కూడా కొద్దికాలం మంత్రిగా చేసాడు. 1967లో నాలుగో లోక్‌సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్‌సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యాడు. సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశంతో ఎన్నిక కాగానే, కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేసాడు. సభాపతిగా ఎన్నిక కాగానే, తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్‌సభ సభాపతి, సంజీవరెడ్డి.
1969 జూలై19న సభాపతి పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసాడు. కాంగ్రెసు అంతర్గత రాజకీయాల ఫలితంగా అతను, మరో తెలుగువాడు - వి.వి.గిరి గారి చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయాడు. దాంతో సంజీవరెడ్డికి కొద్దికాలం రాజకీయ గ్రహణం పట్టింది. 1975 లో జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాద్ జరిపిన పర్యటనతో రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాడు. 1977లో ఎమర్జంన్సీ తరువాత, జనతాపార్టీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టి కాంగ్రెసును అధికారం నుండి దింపివేసినపుడు, ఆంధ్ర ప్రజలు మాత్రం కాంగ్రెసుకు పట్టం కట్టారు. 42 స్థానాలకుగాను, 41ని కాంగ్రెసు గెలుచుకుంది. జనతాపార్టిగెలిచిన ఒక్క స్థానమూ సంజీవరెడ్డిదే. మళ్ళీ లోక్ సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే మళ్ళీ పదవికి రాజీనామా చేసి - ఈసారి నాలుగు నెలల్లోనే - రాష్ట్రపతి పదవికి పోటీ చేసాడు. పోటీలో ఉన్న 37 మందిలో ఒక్క సంజీవరెడ్డి నామినేషను తప్ప మరెవరిదీ చెల్లకపోవడంతో, అతను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకేఒక్క రాష్ట్రపతి సంజీవరెడ్డి.
1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరులో స్థిరపడ్డాడు. 1996 జూన్ 1 న నీలం సంజీవరెడ్డి మరణించాడు. బెంగుళూరులో కాక్స్ టౌనులో ప్రభుత్వం అతనుకు సమాధి నిర్మించింది